తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, December 23, 2010

ఖడ్గసృష్టి

శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" పుస్తకం పేరు చాలామంది వినే ఉంటారు. ఆ పేరు వెనక ఒక పద్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఆ పుస్తకం చదివిన వాళ్ళకి బహుశా తెలియవచ్చు. పుస్తకం మొదట్లోనే ఆ పద్యం ఉంటుంది. ఆ పద్యం ఇది:

గరళపు ముద్ద లోహ; మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్;
హరు నయనాగ్ని కొల్మి; ఉరగాధిపు కోరలు పట్టకార్లు; ది
క్కరటి శిరంబు దాయి; లయకారుడు కమ్మరి - వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్

ఒక ఖడ్గ సృష్టిని (కత్తి తయారీ విధానాన్ని) వర్ణించే పద్యమిది. కత్తి తయారికీ కావలసినవేమిటి - ముడిసరుకు లోహం (అంటే ఇనుములాంటి గట్టి మెటల్), దాన్ని అచ్చుపోసి బాగా కాల్చడానికి కొలిమి, కొలిమిలో కాల్చేటప్పుడు పట్టుకోడానికి పెద్ద పెద్ద పట్టకార్లు, ఒక దాయి, పెద్ద సమ్మెట. కాలుస్తూ, కత్తిని సాపు చెయ్యడానికి దాయి (ఇనప దిమ్మ) మీద పెట్టి, దాన్ని సమ్మెటలతో (పెద్ద సుత్తులు) దభీ దభీమని మోదుతారు. ఖణేల్ ఖణేల్ మంటు చప్పుడవుతుంది. సరే ఇదంతా చేసే కమ్మరి కూడా కావాలి కదా!

ఇక్కడ చెపుతున్న కత్తిని తయారు చెయ్యడానికి ఇవన్నీ ఎలా సమకూరాయో కవి చెపుతున్నాడు. లయకారుడయిన శివుడే స్వయానా ఈ కత్తిని తయారుచేసాడట! అతని దగ్గర ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయంటే - లోహమేమో గరళపు ముద్ద, అంటే ముద్దగా చేసిన కాలకూట విషం! దద్దరిల్లుతూ కోట్లకొలదిగా పడే పిడుగులు సమ్మెటలు. హరుని నిప్పుకన్నే మండే కొలిమి. ఉరగాధిపుడంటే పాములరాజైన వాసుకి (శివుడి మెడలో ఉండేది ఇతడే). ఆ వాసుకి కోరలు పట్టకార్లట. ఎనిమిది దిక్కులా భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తూంటాయని అంటారు కదా! వాటినే దిగ్గజాలంటారు. అలాంటి ఒక దిగ్గజం తల దాయిగా మారింది. ఈ సామాగ్రి అంతటితో లయకారుడయిన హరుడే కమ్మరిగా ఆ ఖడ్గాన్ని సృష్టించాడట. అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! ఇంతకీ ఎవరిదీ ఖడ్గం అంటే, శత్రు రాజులను సంహరించే గుణంతో శోభిల్లే మైలమ భీమునిదట. మైలమ భీముని ఖడ్గం ఎంత శక్తివంతమయినదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమయినదో ధ్వనించే పద్యమిది. చదవగానే ఒళ్ళు గగుర్పొడిచేలా లేదూ! తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణ వాక్కు వేములవాడ భీమకవిది.

వేములవాడ భీమకవి పదకొండవ శతాబ్దానికి చెందిన కవి. దక్షారామ భీమేశ్వరుని కొలిచి, అతని చేత నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన వాక్కును సంపాదించాడని కథ. ఇతని కావ్యాలేవీ దొరకలేదు కాని ఇతనివిగా చెప్పబడుతున్న ఒక 53 పద్యాలు మాత్రం లభించాయి. ఇందులో చాలా వరకూ చాటువులే. ఒకో చాటువుకీ ఒకో కథ! తిట్టు కవిత్వంలో ఇతడు మహా దిట్ట. బహుశా చిన్నతనంనుండీ ఎదుర్కున్న
ఈసడింపే (తండ్రిలేని బిడ్డ కావడాన) అతని వాక్పారుష్యానికి కారణమని ఒక ఊహ. చాటుపద్యాలయినా, వాటిలో చిక్కని ధార, తళుక్కున మెరిసే భావాలు కనిపిస్తాయి. ఇతను దేశ సంచారం చేస్తూ ఎందరో రాజులని దర్శించినట్టుగా అతని చాటువుల వల్ల తెలుస్తుంది. భీమకవి ప్రభావం శ్రీనాథుని మీద చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. భీమకవిలాగానే శ్రీనాథుడుకూడా దేశసంచారం చేసి వివిధ రాజాస్థానాలని దర్శించినవాడు. అతని మాదిరిగా శ్రీనాథుడుకూడా ఎన్నో చాటువులు చెప్పాడు. అతని కవిత్వ ధార కూడా శ్రీనాథుని బాగా ఆకట్టుకున్నట్టుగా ఉంది. "వచియింతు వేములవాడ భీముని భంగి నుద్దండ లీల నొక్కొక్క మాటు" అని చెప్పుకున్నాడు!

భీమకవి దర్శించిన రాజులలో మైలమ భీముడు ఒకడు. భీమకవికి మైలమ భీమునితో చాలా మైత్రి కలిగింది. మైలమ భీముడు విజయనగర (అంటే రాయల విజయనగరం కాదు, గజపతుల విజయనగరం, మా ఇజీనారం :-) రాజులయిన పూసపాటివారికి పూర్వీకుడు. "ఏరువ భీమ", "భండన భీమ", "చిక్క భీమ" అనే మొదలయిన పేర్లున్నాయితనికి. దేవవర్మకీ మైలమదేవికీ జన్మించినవాడు మైలమ భీమన. ఇతను చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు "పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి" అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఇప్పుడది ఉందో లేదో నాకు తెలీదు!


పూర్తిగా చదవండి...

Sunday, December 5, 2010

వేటూరి పాట - ఒక "మాత్రా"కావ్యం

మొన్న కార్తీక సోమవారంనాడు పుణ్యంపురుషార్థం కలిసొస్తాయని నాకు బాగా ఇష్టమైన (ఆమాటకొస్తే ఎవరికిష్టం కాదు!) భక్త కన్నప్ప సినిమాలో కిరాతార్జునీయం పాటని నెట్లో వెతికి మరీ విన్నాను. మా చిన్నప్పుడీ పాట రేడియోలో ఉదయాన్నే భక్తిరంజని కార్యక్రమంలో చాలాసార్లు వచ్చేది, ముఖ్యంగా సోమవారాల నాడు. ఒకో దేవుడికి ఒకో రోజు ప్రత్యేకం కదా. అలా ఆ రోజు బట్టి ఆ దేవుడి పాటలు వేసేవారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు ఇలా. ఇదొక సినిమా పాటని, భక్త కన్నప్ప సినిమాలోదని తెలీని వయసునుండే ఈ పాటని వింటూ వచ్చాను. మనసులో అలా పట్టేసింది. ఇప్పుడు రేడియో భక్తిరంజని లేకపోయినా ఇంటర్నెట్టూ గూగులూ ఉన్నాయి కదా! కాబట్టి వెతికిపట్టుకొని వినగలిగాను. అప్పటి రేడియో కన్నా ఇప్పటి ఇంటర్నెట్ మెరుగైన ప్రసారసాధనం. అయితే దాన్ని వాడుకొనే బాధ్యత మాత్రం మనదే. ఉదయాన్నే రేడియో వేస్తే చాలు, ఎంపికచేసిన మంచి పాటలు మనకోసం వినిపించేవి. ఇప్పుడు వెతుక్కొని వేసుకోవలసిన బాధ్యత మనమీద పడింది.

ఈ పాటలో వేటూరి తన విశ్వరూపం చూపించారు. శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించింది. అకాలప్రళయ జ్వాల కనిపించింది. అప్పుడేమయ్యిందో చూడండి:

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

పార్వతీదేవి నివ్వెరపోయింది, శివుని మొహమంతా నవ్వు పరచుకుంది - అని ఎంత సొగసుగా చెప్పాడు వేటూరి.

ఈ పాట నిజంగా ఒక కాప్స్యూల్ కావ్యమే. అయినా ఇది పాట కాని పద్యం కాదు కదా, తెలుగుపద్యంలో దీని గురించి ఎందుకు అని చొప్పదంటు ప్రశ్న వెయ్యొద్దు. నచ్చిన ఈ పాట గురించి నాకిక్కడ చెప్పాలనిపించింది చెపుతున్నానంతే. :-)

ఇంతకుముందు ఎప్పుడో నా బ్లాగులోనే చెప్పినట్టు, ఛందస్సన్నది పద్యాలకి పరిమితం కాదు. పాటల్లో కూడా ఛందస్సుంటుంది. అందులోనూ ఇది శివుని గురించిన పాటాయె. తనికెళ్ళ భరణిగారు అన్నట్టు, శివుడే ఒక యతి. గణాలు అతని చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పైగా అతను "లయ"కారుడు. జాగ్రత్తగా చూస్తే పై రెండు పాదాలూ ఇంచుమించు సీస పద్యపాదాలే, యతి మైత్రితో సహా! ఈ పాటలో చాలా చోట్ల ఈ సీసలక్షణాలే కనిపిస్తాయి. వేటూరికి ఛందోధర్మాలు ఎంతగా తెలుసో యీ పాట నిరూపిస్తుంది. ఎలాంటి గణాలు వేస్తే పాటకి ఎలాంటి నడక వస్తుంది, భావానికి తగిన నడక ఎలా రప్పించాలి అన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే కాని ఇలా రాయలేరు. తాండవానికి తగిన తాళం "తకిటతక తకతకిట"తో మొదలుపెట్టారు పాటని. ఇది అయిదు మాత్రల గణాలు, 3-2/2-3 విరుపుతో సాగుతుంది. దీన్ని సంగీత భాషలో ఖండ చాపు అంటారనుకుంటా (సంగీతం తెలుసున్నవాళ్ళెవరైనా చెప్పాలి).

ఆ తర్వాత అర్జునుడు తపోదీక్షలో చూపిన ఉత్సాహాన్ని ధ్వనిస్తూ, "అతడే అతడే అర్జునుడూ" అని మొదలుపెట్టి, "అనితర సాధ్యము పాశుపతాస్త్రము" అంటూ పాటని పరుగులు తీయించారు. "తకధిం తకధిం", "తకధిమి తకధిమి" అనే తాళాలు (ఛందస్సులో చెప్పుకోవాలంటే, స, నల గణాలు) పరుగులాంటి నడకనిస్తాయి, పాటకైనా పద్యానికైనా. గజేంద్రమోక్షంలో "సిరికిం జెప్పడు" అని సగణంతో మొదలయ్యే పద్యం గుర్తు తెచ్చుకోండి. నాలుగు మాత్రల పదాలతో వచ్చే ఈ నడకని చతురస్ర గతి అంటారు. "UII, IUI, UU" కూడా నాలుగు మాత్రల గణాలే. కాని ఒకో దానికి ఒకో ప్రత్యేకత ఉంది. వేటూరి ఈ పాటలో వాడిన IIU, IIII మాత్రమే వీటిల్లో పరుగులాంటి నడకనిస్తాయి.

అలా పరిగెత్తిన పాట ఒక్కసారి మళ్ళీ శివుని రూపంలోని మార్పుని వర్ణించడం కోసం సీసపు తూగుని సంతరించుకుంటుంది. శివుని రూపాన్ని వర్ణించే ఆ పాదాలన్నీ ఇంచుమించుగా సీసపద్య పాదాల మొదటి భాగాలే! అయితే ఇందులో మరో గమ్మత్తుంది. సీసపద్యంలో ఇంద్రగాణాలు ఏవైనా రావచ్చు అంటే "నల, నగ, సల, భ, ర, త"లు. కాని ఇందులో నల, భ గణాలు నాలుగు మాత్రలు. మిగతావి అయిదు మాత్రలు. ఇక్కడ వచ్చేవన్నీ ఈ అయిదు మాత్రల గణాలే. అంటే మళ్ళీ ఖండ గతి. అయితే దీని నడక తకిట-తక అన్న విఱుపు లేకుండా తకధింత/తద్ధింత అనే వస్తుంది. నడకలోనే కాదు, భాషలో కూడా ఎంత తేడా చూపించారో వేటూరి. భావానికి అనుగుణమైన భాష. తాండవం దగ్గర సంస్కృత పదాల సమాసాల పొహళింపు చూపిస్తే, ఇక్కడ చక్కని జాను తెనుగు కనిపిస్తుంది. అంత శివుడూ ఎఱుకలవానిగా మారుతున్న సందర్భం కదా. ఎంతో నిసర్గ సుందరంగా ఉంటుందీ వర్ణన.

నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా (ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎఱుకలవానిగా మారాడు!)
తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

పై వర్ణన శ్రీనాథుని యీ సీసపద్యానికి ఏమాత్రం తీసిపోదు. (ఇంకా పైనుంటుందన్నా తప్పులేదు!)

వికటపాటల జటామకుటికా భారంబు
కఱకైన జుంజుఱు నెఱులు గాగ
జారు సుధాధామశకలావతంసంబు
పెడకొప్పుపైనుండు పీకెగాగ
ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు
గైరికద్రవ తిలకంబు గాగ
భుజమధ్యమున గ్రాలు భుజగహారంబులు
గురిజపూసల గుబ్బసరులు గాగ

శంకరుండు కిరాతవేషంబు దాల్చి
యగజ చెంచెతయై తోడ నరుగుదేర
బాణి నోంకార దివ్యచాపము ధరించి
వచ్చె వివ్వచు వరతపోవనము కడకు

ఆ తర్వాత మూకాసురుడు వరాహరూపము ధరించి రావడం, అలా చిచ్చర పిడుగై వచ్చిన దాన్ని రెచ్చిన కోపంతో అర్జునుడు కొట్టడం, అది విలవిలలాడుతూ అసువులు వీడడం. ఆ పైన కిరాతార్జునుల వాదులాట, వాళ్ళ యుద్ధం, చివరికి తాడియెత్తు గాండీవంతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపంతో అతిపవిత్రమైన శివుని తలని మోదేసరికి, ఆ దెబ్బకి శివుడు ప్రత్యక్షమవ్వడం. ఒకో సందర్భానికి ఒకో నడక, దానికి తగ్గ యతిప్రాసలతో - ఎన్నెన్ని హొయలు పోతుందో! మొత్తం జరుగుతున్న కథంతా మన కళ్ళకి కట్టేస్తుంది, మనసుకి పట్టేస్తుంది!

వేటూరీ నీకు మరోసారి జోహార్! పాట పూర్తి సాహిత్యం ఇదిగో. చదువుకొని, వింటూ చదువుకొని, చూస్తూ వింటూ చదువుకొని ఆనందించండి.

తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా (వికటమైన గంగ దూకిన జట అనే సంకెల గలవాడు అని)

హరిహరాంచిత కళా కలిత నిలగళా (ఇది సరిగా అర్థం కాలేదు!)
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా (దట్టని కాంతుల సమూహంతో వెలిగే నిటలమున్న చంద్రకళాధరుడు)

జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా

అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!

అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు

నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా

చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే

తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ

కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు

వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ

చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ

ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
(ఇక్కడ "ఘన" అంటే గొప్పది అనే అర్థమే కాకుండా మేఘం అన్న అర్థం కూడా వస్తుంది. మేఘంలాంటి ధనుస్సు ఉఱుములా ధ్వనిస్తూ బాణ వర్షాన్ని కురిపించింది అని అర్థం.)

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె

అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల (అలోకంబౌ పెంజీకటికవ్వల నేకాకృతి వెల్గు!)
గంగకు నెలవై, కళ కాదరువై (కళకి అంటే చంద్రకళకి ఆదరువై అంటే ఆధారమైనదై)
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై (అఘము అంటే పాపం. లవిత్రము అంటే కొడవలి. కొడవలి గడ్డిని కోసినట్టు పాపాన్ని కోసేస్తుందని అర్థం!)
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా,
సృష్టి చెదరగా,

తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే

తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!


పూర్తిగా చదవండి...

Friday, November 26, 2010

తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!

మీరెప్పుడైనా అమెరికాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో కూర్చొని, చక్కని మినపరొట్టెని (దీన్నే దిబ్బరొట్టె, పొంగరం అని కూడా అంటారు) ఆవకాయతో నంజుకొని (లోలోపలే లోట్టలేసుకుంటూ) తిన్నారా? ఆ తర్వాత విమానం బయలుదేరే వరకూ ఆ ఆవకాయ డొక్కని బుగ్గన పెట్టుకు చప్పరిస్తూ కూర్చున్నారా? నన్ను నమ్మండి, అదొక అనిర్వచనీయమైన అనుభూతి! కొంతమంది అనుమానంగా, మరికొంత మంది ఆశ్చర్యంగా, ఇంకొంతమంది అసూయగా (విమానం కోసమే చూస్తున్న పక్కనున్న తెలుగువాళ్ళు) చూసే చూపులు మీకు తగులుతూ ఉంటే అలా అమెరికన్ ఎయిర్ పోర్టులో కూర్చొని అచ్చతెలుగు వంటకాన్ని ఆస్వాదించడం ఎంత కిక్కిస్తుందనుకున్నారు! అల్లాంటి అదృష్టం మొన్నమొన్ననే నాకు కలిగింది. అదంతా తెలుగుపద్యం మహిమ!

ఈ బ్లాగు నేను మొదలుపెట్టింది స్వానుభవాలు వ్రాసేందుకు కాదు. అయితే ఈసారి నా అమెరికా ప్రయాణం మిగిల్చిన అనుభవాలు తెలుగుపద్యంతో ముడిపడ్డాయి కాబట్టి వీటినిక్కడ వ్రాస్తున్నాను. ముఖ్యంగా, నన్ను అమెరికాలో ఆప్యాయంగా ఆదరించిన వాళ్ళందరికీ బ్లాగు ముఖంగానే కృతజ్ఞతలు చెప్పుకోడం సమంజసమనిపించింది.

కన్నెగంటి చంద్రగారింటిలో, ఇండియాలో ఉండీ ఎన్నాళ్ళగానో తినలేకపోయిన జున్నుని రుచిచూడ్డంతో మొదలయ్యింది నా అదృష్టం! వారి మామగారి గొంతులో హాయిగా వినిపించిన పద్యాలు ఆ జున్నంత తీయగానూ ఉన్నాయి. అంత పెద్ద వయసులో చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యాలు పొల్లుపోకుండా అలా అనర్గళంగా వారి గళంలోంచి జాలువారడం ఎంత గొప్ప విషయం! అదీ తెలుగు పద్యం మహిమ! అలా ఆ జున్ను తినడంతో మొదలైన నా అదృష్టం మరెందరో సహృదయులైన సాహితీమిత్రుల కలయికతో, పరిచయాలతో పెరిగి పెరిగి, గన్నవరపు మూర్తిగారి సతీమణి ఆప్యాయంగా చేసిచ్చిన ఆ మినపరొట్టెని ఎయిర్ పోర్టులో కూర్చుని తినడంతో సంపూర్ణమయ్యింది!
అంతకుముందు అసలు ముఖపరిచయం కూడా లేనివాళ్ళు, పట్టుబట్టి నన్ను వాళ్ళిళ్ళకి భోజనాలకి తీసుకువెళుతూండడం చూసి, నాతో అమెరికా వచ్చిన నా ఆఫీసుమిత్రులందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వేళ్ళాడేసారు! కన్నెగంటి చంద్రగారూ, గన్నవరపు మూర్తిగారు, లంక చంద్రశేఖర్ గారు, మద్దుకూరి చంద్రహాస్ గారు ఇచ్చిన ఆతిథ్యం మరచిపోలేనిది. కాజా సురేష్ గారు, అనంత్ గారు, నరసింహ రెడ్డిగారు, జువ్వాడి రమణగారు మొదలైన సాహితీ మిత్రుల పరిచయం మరపురానిది. కార్తీకపౌర్ణమి సాయంత్రం చంద్రశేఖర్ గారింట్లో, ఆకాశదీపానికి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకొని వారి ఆశీసులు పొందడం ఎంతో అదృష్టం. వారింటి వెనక పెరట్లో బల్లకుర్చీ మీద కూర్చొని పిల్లతెమ్మెరలు వీస్తూంటే పున్నమి వెన్నెల జల్లులో తడసిపోవడం ఒక మధురానుభూతి.

నెల్లాళ్ళుగా ఇక్కడుంటూ మాకు మాటమాత్రం చెప్పలేదేమని కోప్పడ్డవారున్నారు. నా తిరుగుప్రయాణం అనుకున్న రోజుకన్నా ముందుకు వచ్చేసినందుకు విచారించినవాళ్ళున్నారు. ఇంతమంది అభిమానాం వెనక ఏమిటి కారణం? అపరిచితుల మధ్యకూడా ఇంతటి అనుబంధాన్ని పెనవేసిన శక్తి ఏది? తెలుగంటే ప్రేమ, తెలుగుదనం మీద అభిమానం, తెలుగుపద్యం పైనున్న ఇష్టం. వాటికి నేను సదా ఋణపడిపోయాను!

ఏ దేశమేగినా ఎందు కాలిడినను
నాదైన గుర్తింపు నాకొసంగె
దూరతీరాలకు వారధియై నిల్చి
స్నేహానుబంధాలు చెలగజేసె
పరదేశమున ముఖపరిచయమ్మే లేని
వారిండ్ల అతిథిసత్కారమొసగె
సహృదయ సాంగత్య సౌరభ మెదనింపి
ఇంటిబెంగను మరపింపజేసె

మరపురాని అనుభవసంపద మిగిల్చె
అమ్మదీవెన వోలె నా కహరహమ్ము
తోడుగానిల్చి పచ్చనినీడ నిచ్చె
తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!
పూర్తిగా చదవండి...

Friday, November 5, 2010

దీపావళి శుభాకాంక్షలు!

దీపావళి శుభాకాంక్షలు!
శుభాకాంక్షల కోసమే ఈ బ్లాగన్నట్టుగా తయారయ్యిందీ మధ్య.:-) అసలు, పండగల ముఖ్య ప్రయోజనాల్లో ఇదొకటి. మనిషి మరీ ఒంటరివాడైపోకుండా నలుగురినీ కలపడం కోసం. సరే "ఈ" కాలంలో అవి "ఈ-కలయికలుగా" మారడం సహజమే కాబోలు! ఇంటిదగ్గర ఉండుంటే ఈపాటికి టపాకాయల హడావిడిలో ఉండేవాణ్ణి! తారాజువ్వలు తప్పనిసరి. ఒక్కో పండక్కి ఒకో ప్రత్యేకత! సరదాగా జరుపుకొనే పండగల్లో మాత్రం దీపావళిదే అగ్రస్థానం.

చారిత్రకంగా పండగల పుట్టుపూర్వోత్తరాలు వాటి సాంఘిక మూలాలు మొదలైనవి పక్కన పెడితే, వాటి గురించిన కథలు భలే విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఈ దీపావళి పండగే తీసుకోండి. మనందరికీ బాగా తెలిసిన కథ నరకాసుర వథ. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరిస్తే ప్రజలందరూ ఆనందంగా మర్నాడు దీపావళి జరుపుకోవడం ఈ పండగ పుట్టుకకి కారణంగా చెప్తారు. కృష్ణుడో, విష్ణుమూర్తో, శివుడో - ఎంతమంది రాక్షసులని చంపలేదు! మరి నరకుడిని చంపినందుకు మాత్రమే మనం ఎందుకు పండగ జరుపుకుంటున్నాం? మన ఆనందానికి సూచనగా దీపాలని (దీపాలంటే కృత్రిమమైన విద్యుత్తు దీపాలు కాదు, సహజమైన చక్కని ప్రమిద దీపాలు) ఎందుకు వెలిగిస్తున్నాం? బాణాసంచా ఎందుకు కాలుస్తున్నాం? ఇవన్నీ ఆలోచిస్తే భలే వింతగా అనిపిస్తాయి. సరదాగా పండగ జరుపుకోక ఈ ప్రశ్నలన్నీ అవసరమా అంటే కాదు. అయినా ఏదో బుద్ధి అన్నది ఉన్నందుకు ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడైనా తలెత్తకుండా ఉండవుకదా. రాక్షసుడి చావుని పండగ్గా జరుపుకొనేది ఒక్క దీపావళికే అనుకుంటా!

నరకాసుడి కథ గురించి విశ్వనాథ సత్యనారాయణగారు ఒక ఊహ చేసారు. నాచన సోమన ఉత్తరహరివంశాన్ని గురించిన విమర్శ "ఒకడు నాచన సోమన" అనే పుస్తకంలో తన ఊహని ప్రతిపాదించారు. అదేమిటంటే, భూమినుంచి బద్దలై విడిపోయిన ఒక పెద్ద గోళానికి నరకుడు ప్రతీక అనీ, ఆ గోళం తన గతి తప్పి భూమ్మీద పడిపోడానికి దూసుకువస్తే, కృష్ణుడు దాన్ని తునాతునకలు చేసి భూమిని రక్షించాడనీ. చంద్రుడు భూమి ఏర్పడే కొత్తలో విడిపోయిన గోళమని అంటారు కదా. అలాగే మరొక ముక్క విడిపోయుండేందుకు అవకాశం లేకపోలేదు. అది చంద్రుడిలా చక్కగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోకుండా, భూమ్యాకర్షణకి భూమ్మీదకి వచ్చిపడే అవకాశమూ ఉంది. ఏదో ఇంగ్లీషు సినిమాలో పెద్ద మీటియర్ భూమ్మీద పడబోతూ ఉంటే, దాన్నుంచి భూమిని రక్షించే ప్రయత్నం చెయ్యడమే కథ. నరకాసురుడిది కూడా అలాంటి కథే అని విశ్వనాథ వారి ఊహ. ఈ ఊహకి కారణాలు ఏంటంటే, ఒకటి - నరకుడి నగరం ప్రాగ్జ్యోతిష పురం కావడం. జ్యోతిషమంటే అంతరిక్షంలోని నక్షత్రాలకి సంబంధించినదని అర్థం. ప్రాక్ అంటే తూర్పు దిక్కు. ఈ రెండు పదాలు కలిపిన ప్రాగ్జ్యోతిషం అంతరిక్షంలో భూమికి తూర్పుగా ఉండే ప్రదేశాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు కదా. నరకుడి నివాసం అక్కడంటే అతడు ఏ గ్రహమో అయ్యేందుకు అవకాశం ఉంది. రెండో కారణం. నరకుడు, విష్ణువు వరాహావతారంలో భూమిని రక్షించేటప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టిన వాడు. వరాహావతారానికి కృష్ణావతారానికీ మధ్య కొన్ని మన్వంతరాల తేడా ఉంది. నరకుడు మనిషే (రాక్షసుడైనా) అయితే అన్నాళ్ళు బతికుండే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నాడనుకున్నా అన్ని కోట్ల సంవత్సరాలుగా ఊరుకొని కృష్ణుడు అవతరించేదాకా జనాలని పీడించకుండా ఉన్నాడా? ఈ ప్రశ్నలకి నరకుడు ఒక గోళం అని చెప్పుకుంటే సమాధానాలు సులువుగా దొరుకుతాయి. నాచన సోముడు కూడా ఇలాగే ఊహించాడాని విశ్వనాథవారి ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు తన చక్రంతో నరకుడిని వ్రక్కలు (తునాతునకలు) చేసాడని రెండుసార్లు నొక్కి మరీ చెప్పాడు నాచన. మామూలు మనిషైతే చక్రంతో తల నరికితే సరిపోతుంది కదా. తునాతునకలు చెయ్యడం దేనికి? అదే గోళమైతే ఏదైనా బాంబుపెట్టి పేల్చినట్టు చక్రంతో దాన్ని ముక్కచెక్కలు చేసే అవకాశం ఉంది. ఇదంతా ఊహే కావచ్చు. కాని సహేతుకమైనది. ఆర్య-ద్రవిడ లేదా జాతి/కుల వైరాన్ని ప్రతిపాదించే విద్వేష కారకమైన ఊహలకన్నా మేలైన ఊహ.

దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం అన్నది బహుశా ఈ కథకి సంబంధం లేని ఆచారం. దీపావళి అమావాస్య తర్వాత రోజునుండీ కార్తీక మాసం మొదలవుతుంది. అంటే చంద్రుడు కృత్తికలో ఉండే నెల. కృత్తికని అగ్ని నక్షత్రం అంటారు. దానికి సూచనగానే బహుశా ఆ నెలంతా దీపాలు వెలిగిస్తారేమో. దీపావళి దానికి శ్రీకారం చుడుతుంది.

నరకాసురడి కథ పురాణాల్లో కావ్యాల్లో ఉంది కాని దీపావళి పండగ ప్రసక్తి తెలుగు కావ్యాల్లో ఎక్కడైనా ఉందేమో నాకు తెలీదు. నరకాసుడి కథ అనగానే గుర్తుకువచ్చేది మాత్రం సత్యభామ యుద్ధం, అందులోని ఈ పద్యం:

అరిజూచున్ హరిజూచు జూచుకములం దందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరగం బయ్యెదకొంగొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీ గతిన్

ఈ పద్యం గురించి కొద్దిపాటి వివరణ ఇక్కడ వ్యాఖ్యల్లో చూడవచ్చు: http://www.eemaata.com/em/issues/200901/1386.html?allinonepage=1

అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. టపాకాయలతో పిల్లకాయలతో జాగ్రత్త సుమా!


పూర్తిగా చదవండి...

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?

అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును

ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ నా అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.

శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.

ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

శక్తిని స్త్రీ రూపంగా ఎందుకు పూజిస్తాం అన్నది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. అది అలా ఉంచితే, వివిధ రూపాల్లో శక్తిని అమ్మవారిగా పూజించడం మనకి బహుశా అనాదిగా వస్తున్న ఆచారమే అనుకుంటాను. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవత రూపంలో పూజించేది శక్తినే కదా. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు, మా ఊరి అమ్మవారైన పైడితల్లి ఉత్సవం జరుగుతుంది. మహా వైభవంగా జరుగుతుందది. చిన్నతనంలో అమ్మవారిపండగ అంటే మాకు భలే సంబరం! ఊరినిండా ఎక్కడ పడితే అక్కడ హరికథలు, బుఱ్ఱకథలు రాత్రంతా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఊరంతా కిటకిట, కళకళ. దసరా మొదటి రోజునించే పులివేషాలు, ఇంకా మిగతా పగటి వేషాలు ఊరంతా తిరగడం మొదలయ్యేవి. ఇక పైడితల్లమ్మవారి పండగ రోజైతే మరి చెప్పనే అక్కర లేదు. సాయంత్రం సుమారు నాలుగ్గంటలకి సిరిమాను ఉత్సవం మొదలయ్యేది. పైడితల్లి అమ్మవారి గుడినుండి కోటదాకా అమ్మవారు ముమ్మారు సిరిమాను రూపంలో తిరుగుతారు. ముందు జాలరివల, వెల్ల యేనుగు, రథం. వాటి వెనక సిరిమాను. మాను అంటే చెట్టు. శుభాన్ని చేకూర్చే మాను కాబట్టి సిరిమాను అని పేరు. ఆ మాను చివర అమ్మవారి గుడి పూజారి కూర్చుంటారు. వారిలో అమ్మవారు ఆవేశిస్తారని నమ్మకం. అలా ఆ సిరిమాను గుడినుండి కోటకి, మళ్ళీ కోటనుండి గుడికి మూడుసార్లు తిరిగుతూ ఉంటే దాన్ని చూడ్డానికి ఆ తోవంతా కిక్కిరిసిపోయి ఉంటారు జనం. ఆ తోవలో రెండు పక్కలా ఉన్న మేడలన్నీ జనాలతో నిండిపోతాయి. మా అదృష్టం ఏమిటంటే, మా ఇల్లు కోటకి సరిగ్గా ఎదురుగ్గా ఉండే వీధిలోనే! కాబట్టి ఇంటి అరుగుల మీద (ఇప్పుడు రోడ్డు విస్తరణ పుణ్యమా అని అరుగులని తెగనరికేసారనుకోండి :-() నిలబడితే హాయిగా కనిపించేది ఉత్సవం. ఆ రోజు, తెలుసున్న బంధువులు స్నేహితులు కుటుంబాలతో సహా మా ఇంటికే వచ్చేసేవారు, ఉత్సవాన్ని చూడ్డానికి. ఇంటి ముందు పెద్ద చెక్క మంచమొకటి వేసేవాళ్ళం, వచ్చిన వాళ్ళందరూ దాని మీద నిలబడి చూడ్డానికి. అతిథులందరికీ కాఫీ, టీ సరఫరాలు. వచ్చిన వాళ్ళ పిల్లలతో మా గెంతులు. పండగనగానే భలే సందడిగా ఉండేది ఇల్లంతా.

నాకు దసరా అంటే అమ్మవారిపండగే! ఈ ఏడాది కూడా పండక్కి ఇంటికి దూరంగా, చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది...ప్చ్...


పూర్తిగా చదవండి...

Monday, October 4, 2010

కప్పల పెళ్ళి

ఈ మధ్యనేదో కప్పలపెళ్ళి హవా వీస్తున్నట్టుంది! శంకరయ్యగారు "కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్" అన్న సమస్యనిచ్చారివాళ. మొన్నటికి మొన్న పొద్దులో గిరిగారు "శాపగ్రస్త మండూకము" అని పద్యాలలో ఏకంగా ఒక ఖండకావ్యాన్నే వ్రాసేసారు! సరే నేను మాత్రం తక్కూ తిన్నానా. కప్పలపెళ్ళి కథ ఒకటి నేనూ చెపుతాను. అబ్బే, నేను సొంతంగా రాసింది కాదు లెండి.

నీరప్రాంగణ కర్కటీబిలములన్ నిద్రింప, మృత్స్నామయా
హారంబుం గబళింప, బెల్లఱవ, నిట్టట్టుం బ్లుతంబుల్ గొనన్,
దూరాయాస్య దహీంద్ర భీతిహతి గొందుల్‌దూఱ, గోఱున్ మదిన్
సారాపేతమనోబలంబగు భవిష్యద్భేక ముత్సేకమై

భవిష్యద్భేకము అంటే భవిష్యత్తులో కప్ప. భవిష్యత్తులో కప్పేంటి? అంటే ప్రస్తుతం కప్పకాదు, సమీప భవిష్యత్తులో కప్పగా మారబోతున్న ఒక మనిషి. ఒకడు కప్పగా మారబోతున్నాడు. ఇంకా మార లేదు. కాని అతని మనసులో కప్ప లక్షణాలు పొడసూపాయి. ఆ లక్షణాలీ పద్యంలో వర్ణించబడ్డాయి. నీళ్ళ దగ్గరలో, కర్కటీబిలములన్ - కర్కటీ అంటే పీతలు (సరీగా చెప్పాలంటే ఆడపీతలు). అవి చేసిన కన్నాలు కర్కటీ బిలములు. నీటి గుంటల పక్కన పీతలు చేసిన కన్నాల్లో నిద్రించాలని ఉరకలువేస్తోంది ఆ మనిషి మనసు. మృత్స్నా అంటే మంచి మన్ను. మంచిమన్నుని ఆహారంగా తినాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. బెకబెకా అరవాలని ఉంది. ఇటు అటూ గెంతులు వెయ్యాలని కూడా ఉంది. కప్పలకి పాములంటే భయం కదా, తమని మింగేస్తాయని. అంచేత దూరాస్యత్ + అహీంద్ర = దూరన్నుంచి వస్తున్న పాము, భీతి హతి = ఆ పాముని చూసిన భయంతో కన్నాల్లోకి దూఱిపోదామనుకుంటున్నాడు! మనిషిగా ఉండగానే అతని మనసులో ఇలా కప్ప లక్షణాలు పెరిగిపోయి, అతడు పూర్తిగా గుండెదిటవు కోల్పోయాడు.

ఇంతకీ ఎవడితను? ఎందుకు కప్పలా మారబోతున్నాడు? ఇది తెలుసుకోవాలంటే తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యం చదవాలి. అందులో "అయుత నియుతోపాఖ్యానం" అని ఒక కథ ఉంది. పాండురంగ మాహాత్మ్యం కావ్యమే కొన్ని కథల సమాహారం. అందులో ఇది చివరి కథ. అయుతుడు, నియుతుడు అని ఇద్దరు అన్నదమ్ములు అగస్త్యమహర్షి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. చాలా నిష్ఠగా చదువుకొనేవారు. అగస్త్యునికి వీళ్ళిద్దరూ బాగా అనుంగు శిష్యులయ్యారు.ఆ రోజుల్లో గురువులకి శిష్యుల మీద చాలా ప్రేమ అధికారం రెండూ ఉండేవి కాబోలు. తన ప్రియశిష్యులిద్దరికీ పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వీళ్ళకి అలాంటిలాంటి అమ్మాయిలు కాదని సరాసరి బ్రహ్మదేవుని కూతుళ్ళనే ఇచ్చి చెయ్యాలనుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరకి స్వయంగా వెళ్ళి అడిగాడు. మరి మగపెళ్ళివారే ఆడపెళ్ళివాళ్ళ దగ్గరకి వెళ్ళి అడగడం ఆచారం. బ్రహ్మగారు అంతకన్నానా అని, సావిత్రి గాయత్రి అనే తన కూతుళ్ళని ఇద్దరినీ అగస్త్యుని వెంట పంపిస్తాడు. ఆ పెళ్ళికూతుళ్ళను వెంటపెట్టుకు వచ్చి, అగస్త్యుడు తన శిష్యులకి చూపించి వాళ్ళని పెళ్ళాడమంటాడు. నియుతుడు సరేనంటాడు కాని అయుతుడు ఒప్పుకోడు. నేను సంసార సాగరంలో మునగలేను స్వామీ నన్ను ఒదిలెయ్యండంటాడు. దానితో అగస్త్యునికి కోపం వచ్చి అయుతుణ్ణి తన ఆశ్రమం నుండి వెళ్ళగొట్టేస్తాడు. నియుతుడే ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటాడు. ఆశ్రమం నుండి బయటకి వచ్చేసిన అయుతుడు హిమాలయాలకి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. ముల్లోకాలు అతని తపశ్శక్తికి అల్లకల్లోలం అయిపోతాయి. లాభం లేదని ఇంద్రుడు అతని తపస్సుని భగ్నం చెయ్యడానికి బయలుదేరతాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అయుతుని దగ్గరకు వస్తాడు. తన పరివారం కొందరు శిష్యులుగా వెంట వస్తారు. కామధేనువుకూడా ఒక ముసలిఆవు రూపంలో వెంటవస్తుంది. సరే వచ్చిన అతిథులకి కూర్చోపెట్టి మర్యాదలు చేస్తాడు అయుతుడు. ఇంద్రుడు అయుతుని వివరాలు అడిగి, పెళ్ళిచేసుకోనని ప్రతిజ్ఞ పూని ఇలా తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని అతనికి గృహస్థాశ్రమంలోని గొప్పదనాన్ని బోధిస్తాడు. ఇంద్రుడెన్ని విధాలుగా చెప్పినా అయుతుడు అతనికి తిరుగు జవాబు చెపుతాడు కాని అతనితో అంగీకరించడు. దాంతో విసిగిపోయిన ఇంద్రుడు, సరే నీ ఖర్మ అని చెప్పి వెళిపోతాడు. ఎలా అయినా అతని తపస్సుని భగ్నం చెయ్యాలని, తనతో తెచ్చిన ఆవుని అక్కడే ఉంచేసి వెళిపోతాడు. అది బాగా నీరసించిపోయి జబ్బుచేసినదానిలా కదలలేకుండా పడుంటుంది. అలా ఉన్న ఆవు మీద అయుతునికి జాలి కలుగుతుంది. ఆ ఆవుని జాగ్రత్తగా సాకుతాడు. చాలా సేవ చేస్తాడు. ఆవు బాగా పుంజుకొని చక్కగా బలిష్టంగా తయారవుతుంది. కొన్ని దూడలని కూడా కంటుంది. ఇదంతా తలకెత్తుకొనే సరికి అతని తపస్సు గంగలో కలుస్తుంది! అప్పటికి అతనికి తెలివి వస్తుంది. చీ చీ ఈ లంపటంలో ఇఱుకున్నానేమిటని చెప్పి, ఆ ఆవుని అడవిలోకి తరిమేస్తాడు. దానితో ఆ గోవుకి కోపం వచ్చి వాధూలుడనే ముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆ ముని తపస్సుచేస్తూ ఉంటే అతని చుట్టూ ఏర్పడిన పుట్టని కాస్తా మట్టేసి పోతుంది. దానితో ఆ వాధూల ముని తపస్సు భగ్నమై, ఆ ఆవును తరుముకు వస్తున్న అయుతుణ్ణి చూసి, నా ఆశ్రమంలోకి ప్రవేశించి నా తపస్సుని భంగం చేస్తావా అని కోపంతో నువ్వు కప్పవైపోవు గాకా అని శపిస్తాడు. అయుతుడు అతని కాళ్ళపై పడి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు వాధూల మునికి అతనిపై కరుణ కలిగి, సరే భీమరథి నది ఒడ్డునున్న నరసింహస్వామిని పూజించు. మరో కప్పతో నీకు పెళ్ళై, సంతానం కలిగాక అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్తాడు. అయుతుడు సరేనని భీమరథి నదివడ్డునున్న పాండురంగని క్షేత్రమైన పండరీపురాన్ని చేరుకొని, అక్కడకి దగ్గరలో ఉన్న నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. ఇంతలో అతనిలో కప్పలో కలిగే మార్పులు పొడసూపుతాయి. అదిగో అప్పుడు వచ్చే పద్యమే ఇది!

తెనాలి రామకృష్ణుడి ప్రత్యేకత ఇదే. ఏ కవైనా ఒక మనిషి కప్పగా మారడాన్ని వర్ణించాలనుకోండి. అతని ఆకారంలో వచ్చే మార్పులని వర్ణిస్తాడు. లేదా అతను కప్పగా మారిన తర్వాత ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు. కాని రామకృష్ణుడు అలా కాదు. అతని దృష్టి విచిత్రంగా ఉంటుంది. పూర్తిగా కప్పగా మారక ముందు, మనిషి మనసులో కప్ప లక్షణాలు వస్తే ఎంత వింతగా ఉంటుంది అన్నది ఇతడి ఊహ. అందులో ఒక వెటకారం ఉంది. ఇది రామకృష్ణుడిలోని వికటత్వం. మనుషుల మనసుల్లోకి తొంగిచూసి, వాటిల్లో ఉండే అవలక్షణాలని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రించడం తెనాలి కవిలో ఉన్న విశిష్టత. అలాంటి సందర్భం వస్తే వదులుకోడు. మీరే ఆలోచించండి, ఒక మనిషి పై పద్యంలో వివరించిన చేష్టలు చేస్తే ఎంత వింతగా ఉంటుంది? అయితే అవన్నీ అయుతుడు చేసేడని వర్ణించలేదు. అతని మనసులో అలాంటి కోరికలు చెలరేగేయని మాత్రం వర్ణించి ఊరుకున్నాడు! ఎవరైనా అలా చేస్తున్నారని చెప్తే ఆ చేసేవాడిని ఊహించి నవ్వుకుంటాం. కాని అలాంటి ఊహలు మనసులో మెదిలాయి అని మాత్రం చెప్పి ఊరుకుంటే, మనమూ అలా ఊహించుకుంటాం. రామకృష్ణుడు గొప్ప కవే కాదు మంచి సైకాలజిస్టు అనికూడా అనిపిస్తుంది. :-)


ఇంతకీ అయుతుడి సంగతేమయ్యింది? ఆ కప్పరూపంలో చాలా ఏళ్ళు విష్ణు సాన్నిధ్యంలో గడిపిన తర్వాత కన్యాకుబ్జ రాజ్య రాకుమార్తె తన చెలికత్తెలతో ఈ పుండరీక క్షేత్రానికి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తూ అక్కడున్న ఈ కప్పని చూస్తుంది. వింత కాంతులతో ఉన్న ఆ కప్పని చూసి రాకుమార్తె దానితో సరదాగా ఆడుకోవాలని దాన్ని పట్టుకుంటుంది. తన చేతిలో కొంచెం సేపు ఆడిస్తూ, అల్లరిచేస్తూ, ఆ కప్పని తీసుకువెళ్ళి ఒక వృద్ధ బ్రాహ్మణుడి మీదకి విసురుతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు కోపించి ఆ రాకుమార్తెని, చెలికత్తెలనీ కూడా కప్పలుగా మారిపొమ్మని శపిస్తాడు. వెంటనే అవి కప్పలుగా మారిపోతాయి. ఒక్క భార్యని వద్దన్న అయుతుడికి ఈ కప్ప రూపంలో ఆ ఆడకప్పలన్నీ భార్యలైపోతాయి! నీళ్ళల్లో ఈదడంతో పాటు సంసారంలో కూడా ఈదాల్సి వస్తుంది! ఆఖరికి అయుతునికీ రాకుమార్తెకీ ఒక పిల్ల కప్ప, కొడుకు, పుడతాడు. దానితో అతనికి శాపవిమోచనమై, అంత కాలం విష్ణు సేవలో గడిపినందుకు ఫలంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు.

ఇదీ కథ! ఈ కథ ఎక్కడా పురాణాల్లో ఉన్నట్టు లేదు. ఇదంతా రామకృష్ణుని స్వకపోలకల్పితమే! బహుశా మన జానపథకథలని ఆధారం చేసుకొని దీన్ని రచించి ఉంటాడు. రామకృష్ణుని వైచిత్రి పేర్లలో కూడా కనిపిస్తుంది. అయుత నియుతుల తండ్రి పేరు ప్రయుతుడు. అయుత, నియుత, ప్రయుత అనేవి సంస్కృతంలో సంఖ్యా వాచకాలు. ఎంత అన్న విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది. అయుత అంటే పదివేలు, నియుత అంటే లక్ష, ప్రయుత అంటే పది లక్షలు అని చాలామంది ఒప్పుకున్న అర్థాలు. ఈ పేర్లని ఎందుకు ఎంచుకున్నాడో మరి! యుత అంటే బంధమనే అర్థం వస్తుంది. అయుత అంటే బంధం లేనివాడు, నియుత అంటే బంధమున్నవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఆలా అవి ఆ పాత్రల స్వభావాలకి తగిన పేర్లే! కాని ఎంత బంధ విముక్తుడవుదామనుకున్నాడో అంతకి అంతా బంధాల్లో చిక్కుకున్నాడు అయుతుడు, అదీ విచిత్రం!
పెళ్ళి చేసుకోం, సంసార బంధాలలో చిక్కుకోం అని భీష్మించే బ్రహ్మచారులకి ఈ కథ మంచి గుణపాఠమే నేర్పుతుంది. :-)


పూర్తిగా చదవండి...

Thursday, September 23, 2010

ఆదిన్ శ్రీసతి కొప్పుపై...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!

పోతన భాగవతంలో వామనావతార ఘట్టం తెలియని వాళ్ళు అరుదు. ఇందులో చాలా ప్రసిద్ధమైన పద్యాలే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. దానమియ్యవద్దని బోధించిన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి అంటున్న మాటలు. వచ్చినవాడు వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువని శుక్రాచార్యుడు కనిపెట్టాడు. అదే బలిచక్రవర్తికి చెప్పాడు. నిజానికీ విషయం చూచాయగా బలిచక్రవర్తికి కూడా తెలిసింది. లేకుంటే, ఒక బాల వటువు తన యజ్ఞశాలకు వస్తే, "ఇయ్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్, గడు ధన్యాత్ముడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడతేఱెన్" అని అనడంలో ఔచిత్యమేముంది? అయితే ఆ జ్ఞానం పరిపూర్ణమవ్వలేదు. అందుకే వెంటనే, "వర చేలంబులొ, మాడలో, ఫలములో..." ఏవి కావాలంటే అవి కోరుకోమన్నాడు. సరే శుక్రాచార్యుడు చెప్పిన తర్వాత అతడు శ్రీమహావిష్ణువే అన్న ఎఱుక పూర్తిగా స్థిరపడింది. రాక్షసుడైనా, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే! అతనికి తన తాత ప్రహ్లాదుని పోలికలే వచ్చాయి మరి. అటువంటి విష్ణుమూర్తి స్వయంగా తన దగ్గరకి వచ్చి దానం అడుగుతూంటే, అంత కన్నా అదృష్టం మరేముంది అనుకున్నాడు. ఎందుకు? ఎవరా విష్ణుమూర్తి? సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి పెనిమిటి. అంటే ప్రపంచంలోనున్న సర్వ సంపదలతో నిత్యభోగాన్ని అనుభవించే వాడు. మరొకళ్ళకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియనివాడు. ఆ వైభోగాన్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. భార్య అయిన లక్ష్మీదేవి కొప్పుపైన శరీరంపైన పైటకొంగుపైన పాదాలపైన బుగ్గలపైన పాలిండ్లపైన ఉండే చెయ్యి ఆయనది. అలా ఉండడం వల్ల ఆ చేయికి ఎప్పుడూ నూత్న మర్యాద కలుగుతుందట! ఇదొక వింత మాట! ఇక్కడ విష్ణువుని ఒక మామూలు పురుషుడిగా లక్ష్మీదేవిని మామూలు స్త్రీగా ఊహించుకొని, ఇక్కడ వర్ణించినది ఆ భార్యాభర్తల శృంగారాన్ని అనుకుంటే, ఈ "నూత్న మర్యాదన్ జెందు" అనే మాట పొసగదే! ఇది వట్టి సాంసారిక శృంగారమైతే, ఆ చేతికి కొత్త మర్యాద ఎక్కడనుండి వస్తుంది? రాదు. ఇక్కడ వర్ణించిన లక్ష్మీదేవి అంగాలన్నీ వివిధ రకాలైన సంపదలని మనం భావించాలి. అలాంటి సంపదలని లోకానికి ఎప్పుడూ దానం చేస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆ చేతికొక కొత్త గౌరవం వస్తుందన్నమాట. అలా ఎప్పుడూ పైనే ఉండే చెయ్యి ఇప్పుడు కిందయ్యింది! తన చేయి ఆ చేతిపైన ఉంది. అంటే లోకానికి సమస్త సంపదలనీ అందించే విష్ణువుకి కూడా తాను ఇవ్వగలిగింది ఏదో ఉందన్న మాట. అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఏముంటుంది! ఇక రాజ్యం గీజ్యం ఉంటేనేం పోతేనేం. కాయము (శరీరం) ఎప్పటికైనా నశించేదే కదా. ఈ జ్ఞానం బలిచక్రవర్తిలో పరిపూర్ణంగా ఏర్పడింది.

మీరొక నాటకం వేస్తున్నారనుకుందాం. అందులో మీదొక చక్రవర్తి పాత్ర. అద్భుతంగా నటిస్తున్నారు. అందులో ఎంతగా నిమగ్నమైపోయారంటే, నిజంగానే మీరొక చక్రవర్తి అన్న భావం కలిగింది. దానిలో పూర్తిగా లీనమైపోయారు. కాని నాటకానికి ఒక కథ ఉంటుంది కదా. దానికి అనుగుణంగానే కదా పాత్రలు ప్రవర్తించాలి. మీరీ పాత్రలో లీనమైపోయి చేస్తూ ఉండడంతో నాటకం దారితప్పే సూచనలు కనిపించాయి. దాంతో డైరెక్టర్ లాభం లేదు, ఈ పాత్రని బయటకి రప్పించడం కన్నా మార్గం లేదనుకున్నాడు. కాని ఎలా? అందుకోసం తన స్క్రిప్టులో లేని ఒక పాత్రని హఠాత్తుగా సృష్టించాల్సి వచ్చింది. తనే మేకప్ వేసుకొని రంగస్థలమ్మీదకి అడుగుపెట్టాడు. ఆ వచ్చింది డైరెక్టరే అని మీరు గుర్తుపట్టారు. "అర్రే! నేను నాటకం వేస్తున్నాను కదూ" అని జ్ఞాపకం వచ్చింది. మీరు వేస్తున్న పాత్రని నాటకం నుంచి తప్పించాలి కదా. ఇప్పుడు నువ్వు నాటకంలో నే చెప్పినట్టు చేస్తే, ఈ ఏడాది నీకే ఉత్తమనటుడిగా బంగారునంది గ్యారెంటీ అని మీతో దర్శకుడు చెప్పేడు. చెయ్యాల్సింది ఏమిటంటే, ఆ రాజుగారి పాత్ర తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యాలు పట్టుకొని పోవాలి. అప్పుడు మీరేం చేస్తారు? వచ్చింది స్వయానా డైరెక్టరాయె! మీకు ఉత్తమనటుడిగా నంది వచ్చే అవకాశం ఉందాయె. "ఓ, తప్పకుండా!" అనే కదా అంటారు. పక్కనున్న మంత్రి, "అదేంటి రాజా! నీ రాజ్యాన్నీ, సంపదనీ వదిలేసి అడవులకి పోతావా" అని నచ్చజెప్పబోయాడనుకోండి. మీరేంటంటారు? "ఓరి పిచ్చివాడా! ఇది నాటకంలో పాత్రరా. ఈ రాజ్యం గీజ్యం ఏమైనా శాశ్వతాలా. స్వయాన వచ్చి అడిగినవాడు డైరెక్టరు. కావలిస్తే నేనీ పాత్రలో చచ్చిపోడానికైనా రెడీనే!" అని అనరూ? సరిగ్గా బలిచక్రవర్తి కూడా అదే అన్నాడు.

"రాజ్యము గీజ్యము" అని ఒక అచ్చమైన తెలుగు కవే అనిపించగలడు. అంతకుముందే శుక్రాచార్యుడు బలికి హితబోధ చేస్తూ "కులుమున్ రాజ్యము దేజమున్ నిలుపు..." అన్న పద్యంలో "వలదీ దానము గీనమూ" అంటాడు. సరిగ్గా దానికి సమాధానంగా ఈ పద్యంలో "రాజ్యము గీజ్యమున్ సతతమే" అని బలి చేత అనిపించాడు పోతన. ఇదొక చక్కని వాక్శిల్పం.

నాకు చిన్నపటినుంచీ ఈ వామనావతారం కథ విన్నప్పుడల్లా ఒక్కటే అనుమానం. ఒక అడుగుతో భూమినీ మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసాడు వామనుడు. మరి మూడో అడుగు ఎక్కడ అంటే తన శిరస్సుపైన పెట్టమని బలి అంటాడు కదా. ఇక్కడే నాకు సందేహం. భూమీ ఆకాశాన్నీ మొత్తం ఆక్రమించేసాడు కదా. మరి బలిచక్రవర్తి శిరస్సు కూడా అందులో భాగమే కదా! మరి ఆ రెండడుగుల భాగంలో అతని శిరసు మాత్రం ఎందుకు లెక్కలోకి రాదు? దీని గురించి ఆలోచించగా ఆలోచించగా, ఈ మధ్యనే ఒక సమాధానం తట్టింది. శిరసు అంటే ఇక్కడ మనసుకి సంకేతం అయ్యుండాలి. ఈ "మనసు" అన్నది భూమ్యాకాశాల్లాగా భౌతిక పదార్థం కాదు. కాబట్టి అది వాటి లెక్కలోకి రాదు. మూడో అడుగుకి తన మనసునే అర్పించాడు బలి. అంతకన్నా కావలిసిందేముంది! బలిని పాతాళానికి అణగదొక్కడం అంటే, అతడిని అంతర్ముఖుణ్ణి చెయ్యడం. మనసంతా ఎప్పుడైతే శ్రీహరి ఆక్రమించుకున్నాడో, అతనికి సమస్తమైన ఆలోచనలూ బాహ్యమైన ప్రాపంచిక విషయాల వైపు కాక, తనలోని ఆత్మ వైపుకి ప్రయాణిస్తాయి. అలా మనసు తన ఆత్మలో కలిసిందంటే అది నిర్మలమైన జ్ఞానానికి చిహ్నం. పైగా ఆ శ్రీహరికి తన భక్తుడంటే ఎంత ఇష్టమో చూసారా! స్వయయంగా అతని దుర్గానికి తానే కాపలాదారుడిగా మారాడు. అంటే మరే ఇతర చింతనలు అతనిలోకి జొరబడకుండా తను కాపలా ఉన్నాడన్నమాట!
కాబట్టి, ఏదో దేవతల కోసం విష్ణువు బలిని అణిచేసి పాతాళానికి పంపేసాడు అనుకోవడం వట్టి తెలియనితనమే. బలి శ్రీహరి భక్తుడే అని, తన భక్తుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికే విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తాడనీ మనకి భాగవతం చదివితే స్పష్టంగా బోధపడుతుంది. బలిచక్రవర్తి గురించి ఆ విష్ణువే అన్న మాటలివి:

బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజ త్యక్తుడై
సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యమున్ గరుణయున్ సొంపేమియున్ దప్ప డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుండితం డల్పుడే
పూర్తిగా చదవండి...

Saturday, September 11, 2010

భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

మా తమిళనాడులో వినాయకుడిని పిళ్ళయ్యార్ అంటారు. అక్కడనుంచి వచ్చిందే "పిళ్ళై" అన్న పేరు. తెలుగులో కూడా కొన్ని చోట్ల వినాయకుణ్ణి ఈ పేరుతో పిలుస్తారనుకుంటాను. ఆ పిళ్ళారప్పని గురించి కొన్ని చాటు పద్యాలు:

శ్రీకర దంతరుచిజితసు
ధాకర మృడపార్వతీముదాకర గుణర
త్నాకర వరధీకర పర
భీకర భాగ్యములకుప్ప పిళ్ళారప్పా!

(శుభాలనిచ్చేవాడూ, తన దంతకాంతులతో తెల్లని జాబిల్లినే ఓడించినవాడూ, శివపార్వతులకి ఆనందం చేకూర్చేవాడూ, సద్గుణ సాగరుడూ, వరము (సిద్ధి), ధీ (బుద్ధి) ఇచ్చేవాడూ, శత్రుభయంకరుడూ - భాగ్యముల కుప్పైన ఆ పిళ్ళారప్పే!)

ఓరీ బాలుడ నీవిటు
రారా యని నన్ను బిలిచి రంజిలు దయచే
గోరిక లొసగుము భువి నీ
పేరును బ్రకటించి చెప్ప బిళ్ళారప్పా!

భక్షింపుము గావలసిన
భక్షణములు నీకు నిత్తు భక్షించియు నీ
కుక్షి గల విద్య మాకున్
బిక్షంబిడి కావుమప్ప పిళ్ళారప్పా!

అన్నట్టు ప్రతిసారీ వినాయకచవితికి వినాయకుడి మీదనేనా పద్యాలు, నా మీద ఒక్క పద్యమైనా లేదా అని ఆ వినాయకుణ్ణి మోసుకువెళ్ళే మూషిక రాజం కిచకిచమంటూ అడిగింది. దాని కోరిక కాదంటే ఇంకేమైనా ఉందా! అందుకే దాని మీద కూడా ఒక చాటువిదిగో!

నిర్ణిద్రవిషయుక్త నిశితదంష్ట్రలు బూని
భేదించు నెటువంటి గాదెలైన
దారుణోద్యద్దంతతతి చేత ఖండించు
గుఱుతుగా నెటువంటి కోకలైన
పటుసురాంగాగారభరితంబుగా ద్రవ్వు
బొంకాన నెటువంటి భూమినైన
కీచుకీచుధ్వని ప్రాచుర్యమహిమచే
వర్ణించు నెటువంటివారినైన

అతడు సామాన్యుడే నరేంద్రాలయాంత
రంతరానేక పేటికా క్రాంత వస్తు
హరణసురధాణి యవ్వినాయకుపఠాణి
చారుతరమూర్తి మూషకచక్రవర్తి!

ఆ మూషికనాయకుని నుండీ నాయకమూషికాలనుండీ ఆ వినాయకుడు మనందరినీ రక్షించుగాక!
పూర్తిగా చదవండి...

Thursday, September 9, 2010

ఈద్ ముబారక్!

ఈద్ ముబారక్!

ముస్లిముల కాలమానం ప్రకారం రమాదాన్ తొమ్మిదవ నెల. ఇది చాలా పవిత్రమైన నెల. ఆ నెలాఖరున వచ్చే పండగ ఈద్. హిందూ కాలమానం ప్రకారం తొమ్మిదవ నెల మార్గశిరం. అది కూడా మనకి చాలా పవిత్రమైన మాసమే! మాసానాం మార్గశీర్ష్యం అని గీత చెపుతోంది కదా. ఈ పోలిక యాదృచ్ఛికమే కావచ్చు కాని నాకు బాగుందనిపించింది. మరొక విశేషం ఏమిటంటే, ఈ రమాదాన్ సాధారణంగా మన శ్రావణమాసంలో వస్తుంది. మరి శ్రావణమాసం కూడా మనకి పవిత్రమైన మాసమే, చాలా నోములూ వ్రతాలూ ఉన్న మాసం. అలాగే ఈద్ పండగకి ఇటు అటుగానే (ఈసారి అది రేపే!) వినాయకచవితి కూడా వస్తుంది. ఆనందంగా జరుపుకోడానికి ఏ పండగైతేనేం! భక్తితో కొలవాడానికి ఏ దేవుడైతేనేం!

ఈ ఈద్ పండగ సందర్భంగా, ఉమర్ ఆలి షా కవిగారు ఆల్లా మీద రాసిన కొన్ని పద్యాలు చదివి ఆనందించండి. ఇవి కాళహస్తీశ్వర శతక పద్యాలకి దగ్గరగానే ఉంటాయి! ఏకం సత్ విప్ర బహుధా వదంతి.

ఉమర్ ఆలి షా 1885వ సంవత్సరంలో పిఠాపురంలో పుట్టారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆధ్యాత్మిక విద్యాపీఠంలో వీరు ఆచార్యులుగా ఉండేవారు. యోగశాస్త్ర ప్రవీణులు. అంతేకాక సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పారశీకం, ఇంగ్లీషు భాషలలో పాండిత్యం సంపాదించారు. ఉర్దూ వీరి మాతృభాష. తెలుగులో ఎన్నో నాటకాలు, నవలలు, పద్య కావితలు రాసారు. ఉమర్ ఖయాం రుబాయితులని పారశీకం నుండి నేరుగా తెలుగు పద్యాలలోకి అనువదించారు.
ఉమర్ ఆలి షాగారి "అల్లా ప్రభూ" అనే కవితా ఖండిక నుండి కొన్ని పద్యాలు:

శ్రీ లీజాలిన మేటివంచెఱిగి నే సేవింపగాబోను, ఆ
శ్రీలన్ గైకొననెంచి కుంటినయి అర్థింపంగ రాలేదు నీ
శ్రీ లావణ్య ప్రపుణ్య మార్గమున నా చిత్తంబు సంధిల్ల నే
వేళన్ గొల్చెద భక్తి పూర్ణమతినై విశ్వజ్ఞ అల్లాప్రభూ!

నిను జింతించి భజించి మ్రొక్కి మదిలో నిత్యంబు సేవించి నీ
వినుతిన్ జేసియు దానికిన్ ఫలముగా విశ్వజ్ఞ మోక్షంబు దె
మ్మని నే బేరము పెట్టలేను భవదీయంబైన ధ్యానంబు నా
పనిగా జేసెద నూపిరింబలె స్వభావం బొప్ప నల్లాప్రభూ!

జలరాశిన్ విలసిల్లు వీచికలతో సఖ్యంబు గావించి, పు
వ్వులతో నెయ్యము సల్పి తత్సుధలతో బొత్తై, నభోవీథి జు
క్కలతో వియ్యములంది, నీ ఘనఘనాకారంబు జింతింతు, ని
ర్మల సౌభాగ్యసుధా ప్రవృష్టి గురియన్ రావయ్య అల్లాప్రభూ!

జలమధ్యంబున లేచు బుద్బుదము లోజన్ బెద్దలై కొన్ని, కొ
న్ని లవాకారములై తనర్చు పగిదిన్ నీ యందు రూపించు మ
ర్త్యులు నీచాధిక తారతమ్య భవ సందోహమ్ములన్ భ్రాంతులై
కలహింపన్ జనుచుందు రీవని యెఱుంగన్ లేక అల్లాప్రభూ!

కలుముల్ లేములు వచ్చుపోవునవి మేఘవ్రాతముల్ మింటిపై
కలయం బ్రాకుచు నేగునట్లు సుఖదుఃఖ ప్రాప్తమప్రాప్తముల్
కలలం బోలె దనర్చు గోరికలు వృక్షచ్ఛాయలన్ బోలె మ
ర్త్యుల వెన్నాడు మహేంద్రజాలము జగంబూహింప నల్లాప్రభూ!

ధనహీనుండయి పుత్రదార గృహయుక్తంబైన సంసార దుః
ఖ నిధిన్ మున్గుచు తేలుచున్ నిను మదిన్ గాసంత నూహింప లే
కనయంబున్ మృగతృష్ణకై జనెడు దాహాసక్తునిన్ బోలె బో
వును మోహావిలచిత్తుడై చపలుడై మూర్ఖుండు నల్లాప్రభూ!

నిను తేజోలసితాంతరాత్మ వనుచున్ వీక్షింతునో లేక లో
క నికాయ ప్రణుతాఖిల ప్రజనుగా గాంక్షింతునో పుణ్య స
జ్జన దృగ్గోచరతత్త్వమూర్తివని నే సాధింతునో భక్తి నే
మని పూజింతు బరాత్పరాత్మవు మహాత్మా! దేవ! అల్లాప్రభూ!

రాజుల్ ధూర్తులు దుష్టచిత్తులు మృషాప్రాగల్భ్యమూర్తుల్ వృథా
వ్యాజస్త్రోత్ర పరాయణుల్ కుమతులా పాపాత్ములన్ జేర నే
యోజన్ జెల్లదు కోవిదప్రతతి యుద్యోగించి నీ కర్థులై
యోజింపన్ నిఖిలార్థముల్ బడయలేరో రాదొ అల్లాప్రభూ!

నీవే విశ్వమయుండవైన దివిపై నీరేజజాండంబుపై
ఆ వైకుంఠముపై వసింతువన మిధ్యావాదమే గాద టెం
కే వృక్షాకృతినైన వేళ్ళ నది వీక్షింపంగ రానేర న
ట్లీ వెందున్ గనరావు సర్వము భవత్ దృశ్యంబు అల్లాప్రభూ!


పూర్తిగా చదవండి...

Wednesday, September 1, 2010

గ్లోబల్ దేవుడు గోవిందుడే!


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :-) తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! కాబట్టి మన "గ్లోబల్" దేవునిగా కృష్ణయ్యనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను. ఈ రోజతని పుట్టినరోజు సందర్భంగా బ్లాఙ్ముఖంగా ఆ "దేవదేవునికి" (చూసారా దేవుళ్ళకే దేవుడాయన!) జన్మదిన శుభాకాంక్షలతో పాటు "గ్లోబల్" దేవునిగా ఎన్నికైనందుకు నా అభినందనలని కూడా అందిస్తున్నాను.

అలనాడు ధర్మరాజు రాజులలో మాత్రమే అగ్రస్థానాన్నిచ్చి శ్రీకృష్ణుణ్ణి గౌరవించాడు. ఇప్పుడు నేనతనికి దేవుళ్ళందరిలోనూ కూడా అగ్రేసరస్థానాన్ని ఇచ్చి గౌరవించానంటే, నేనింకెంత ధర్మాత్ముణ్ణో అందరూ గ్రహించగలరు, నేను మళ్ళీ దాన్ని నొక్కి వక్కాణించనక్కరలేదు. పైగా ధర్మరాజు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు "బంధుప్రీతి" స్కాండల్ లేవదీసే అవకాశం లేకపోలేదు. నాకదీ లేదు. నేను కృష్ణుడి రెలెటివ్నీ కాను, నాకు ప్రతిపక్షమూ లేదు. అయినా నా తృప్తి కోసం, శ్రీకృష్ణుడు ఈ పదవికి ఎంచేత అర్హుడో ఇప్పుడు వివరిస్తాను. ఇదంతా చదివిన తర్వాత కూడా మీరు నాతో ఒప్పుకొని తల ఊపకపోతే, అలనాడు శిశుపాలుని తలకి ఏం గతి పట్టిందో తెలుసు కదా! ఆ తర్వాత నా పూచీలేదు.

శ్రీకృష్ణుడంటే చిన్నపిల్లల నుంచీ ముసలివాళ్ళ దాకా అందరికీ ఎంతో మురిపెం!

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు, పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి గొలుతు

అంటూ ఆ చిన్ని కన్నయ్యని తమ ముద్దు ముద్దు పలుకులతో కొలుస్తారు మన సిసలైన తెలుగింటి పిల్ల భక్తులు. చిన్నపిల్లల సంగతి ఇలా ఉంటే, ఆ పండు ముదుసలి భీష్ముడు శ్రీకృష్ణదేవుని రూపాన్ని, అదీను తనని చంపడానికి వస్తున్న వాడిని ఎంత భక్తి తన్మయతతో దర్శించాడో చూడండి!

కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు

ఇలా జాతి, లింగ, వయో భేదాలు లేకుండా ఎందరెందరో భక్తులు శ్రీకృష్ణుని ఆరాధించారు. మరొక విశేషం ఒకటి చెప్పనా. అసలీ ప్రపంచంలో ఎన్ని రకాల భక్తి మార్గాలుండవచ్చో అన్ని మార్గాల్లోనూ కృష్ణుడికి భక్తులున్నారు. ఇల్లాంటి ప్రత్ర్యేకత, నాకు తెలిసి, మన దేవుళ్ళకే కాదు అసలీ భూప్రపంచంలో ఉన్న ఏ దేవుడికీ లేదు!

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

శత్రుత్వంతో కూడా భక్తులవ్వడం ఎంత చోద్యమో చూడండి! భావంలో ఏకాగ్రత ఉంటే అది ఏ భావమైనా సరే యోగంలాంటిదే అని నారదులవారు ధర్మరాజుకి చెపుతున్న మాటలివి. కడపున పుట్టకపోయినా కన్న ప్రేమకి పరాకాష్ఠ అనిపించే యశోద వాత్సల్య భక్తి మొదలుకొని ఎందరెందరో భక్తులు చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆ స్వామిని కొలిచి తరించలేదూ! ఇక్కడ మీకొక అనుమానం రావచ్చు. రాముడిపై కౌసల్యకి ఉన్నది మాత్రం వాత్సల్య భక్తి కాదా అని. నా ఉద్దేశంలో కాదు. అది వాత్సల్యమే కాని అందులో భక్తి ఉందని చెప్పలేం. కృష్ణుడైతే "చంటి పాప"గా ఉన్న నాటినుండీ ఎన్నెన్నో సాహసాలని చేసి చూపించి తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అంచేత యశోదకి కృష్ణుడు దైవమే అన్న స్పృహ తన అంతరాంతరాల్లోనైనా ఉండి ఉండాలి. పైగా తన నోరు తెఱచి విశ్వాన్నంతటినీ చూపించాడు కూడా కదా! "కలయో వైష్ణవ మయయో యితర సంకల్పార్థమో" అంటూ ఆశ్చర్యపడిన యశోద చివరకి,

నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధము గని
యేమఱితిమి గాని యీశు డీతడు మాకున్

అని నిశ్చయానికి కూడా వచ్చింది కదా. అంచేత యశోదకి ఒక పక్క తల్లిగా వాత్సల్యంతో పాటు మరో వంక పరమాత్ముడన్న భక్తిభావం అంతరాత్మలో నిండి ఉండే ఉంటుంది.

మరొక వింతైన భక్తురాలు కుంతీదేవి. ఆమె స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త. ఆమె జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించిందని! అన్ని కష్టాలామె ఓర్చుకున్నదంటే, అది ఆమెకి కృష్ణుడిపైనున్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగానే. ఇది చాలామంది గ్రహించని విషయం. పోతన్నలాంటి భక్త కవులే దీన్ని తెలుసుకున్నారు. కుంతి శ్రీకృష్ణుడిని కోరినది ఇది:

యాదవులందు పాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగ భంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య యీశ్వరా!

తన బంధువులైన యాదవులపైనా, తన కుమారులైన పాండవులపైనా కూడా తనకున్న మోహాన్ని త్రుంచెయ్యమని కోరిందా మహా భక్తురాలు.

సరే అర్జునుడి సఖ్య భక్తి అందరికీ తెలిసినదే. తన సఖుడు, ఆత్మబంధువు, తండ్రంతటివాడు, దిక్కు, దైవం అన్నీ ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇలాంటి సఖుడే కృష్ణుడికి మరొకడున్నాడు. అతని గురించి చాలామందికి తెలీదు. అతని పేరు ఉద్ధవుడు. మన భాషలో చెప్పాలంటే అతను శ్రీకృష్ణుడికి "Thickest Friend" అన్నమాట! ఎంతటి గాఢస్నేహం కాకపోతే గోపికల దగ్గరకి తన ప్రణయసందేశాన్ని అందించడానికి ఇతణ్ణి దూతగా పంపిస్తాడా గోపీమనోహరుడు! అప్పుడా గోపికలు ఉద్ధవుణ్ణి ఏమడుగుతారో తెలుసా!

ఏకాంతంబున నీదు పైనొరగి తానేమేని భాషించుచో
మా కాంతుండు వచించునే రవిసుతామధ్యప్రదేశంబునన్
రాకాచంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడ నం
గీకారంబొనరించి బంధనిహతిన్ గ్రీడించు విన్నాణముల్

ఏకాంతంలో మీరిద్దరూ దగ్గరగా కూర్చొని కబుర్లాడుకొనేటప్పుడు, యమునానదిలో వెన్నెల రాత్రుళ్ళు మాతో జరిపిన రాసలీలా వినోదాల విశేషాలని నీకు చెప్పాడా? అని అడుగుతున్నారు. అంటే ఆ ఉద్ధవునికి శ్రీకృష్ణుడి దగ్గర ఎంత చనవో మనం ఊహించుకోవచ్చు! అంతటి దగ్గరవాడు కాబట్టే, అతనికి కూడా అర్జునుడిలాగానే ప్రత్యేకంగా గీతా బోధ చేసాడు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కృష్ణభక్తుల పట్టికకి అంతమే ఉండదు! కురూపి అయిన కుబ్జ, పరమ దారిద్ర్య పీడితుడు కుచేలుడు, భాగవతోత్తముడైన విదురుడు ఇలా ఎందరెందరో ఆ కృష్ణయ్య కరుణాకటాక్షానికి నోచుకున్న భక్తులు మనకి అడుగడుగునా భాగవతంలో కనిపిస్తారు! అందరికన్నా విశిష్టమైన భక్తి గోపికలది. అల్లాంటి భక్తులు మరే దేవునికి ఉన్నారు చెప్పండి! శృంగారాన్ని ఒక భక్తిసాధనంగా చూపించిన ఘనత ఒక్క గోపీరమారమణుడికే దక్కుతుంది. అంతశ్శత్రువులలో మొదటిదైన కామాన్ని భక్తియోగంగా మార్చి, శత్రువుని చంపనవసరం లేదు మార్చగలిస్తే చాలనే గొప్ప సత్యాన్ని నిరూపించినవాడు ఆ లీలామానుషస్వరూపుడే. ఆ గోపికల భక్తి తీవ్రత, అందులోని ఏకాగ్రత ఎలాంటిదంటే,

ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కితీగెలం
జిక్కగబట్టి, హృద్గతముజేసి, వెలిం జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన వులకంబులు గ్రమ్మగ కౌగిలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను యోగికైవడిన్

ఒక గోపిక ఆ మాధవుని ఉజ్జ్వల రూపాన్ని తన చూపులనే తీగలతో కట్టేసి, హృదయంలో పొదువుకుని, మళ్ళీ బయటకి పోకుండా కన్నులు మూసేసుకొని, తన శరీరంపై పులకలు వచ్చేట్టు కౌగిలిలో అతన్ని బంధించి, స్వచ్ఛమైన లోపలి కాంతులతో పరవశించిపోతోందిట - ఒక యోగిలాగా! ఇది మధురభక్తి వర్ణనల్లోకెల్లా మకుటాయమైన పద్యం! ఇందులో శృంగారం ఉంది, భక్తి ఉంది, యోగం ఉంది! ఆ మూడూ గోపిలలో ఎలా కలగలిసిపోయేయో ఆ చిత్రం ఉంది.

భక్తి మార్గాల్లో ఇంత వెరైటీ, వేరియేషను చూపించిన కృష్ణపరమాత్ముడు కాక, "గ్లోబల్" దేవుని పదవికి ఇంకెవరు అర్హులు చెప్పండి? సరే మరొక పాయింటు చెప్తాను. కృష్ణుడిలా అన్నిమార్లు, అందరిమందికి "గ్లోబల్"రూపాన్ని, అదే "విశ్వ"రూపాన్ని చూపించిన దేవుడు ఇంకెవరైనా ఉన్నాడా?

సరే, ఇలా ఏకరువు పెడుతూ పోతే ఆ నల్లనయ్యకున్న ప్రత్యేకతలకీ, విశేషాలకీ కరువే లేదు. భాగవతం, మహాభారతం, హరివంశం ఎన్నెన్ని పురాణాలు కావలసి వచ్చాయి అతని లీలా విశేషాలని వర్ణించడానికి! ఇంకొక్క విశేషం మాత్రం చెప్పి నా వివరణని ముగిస్తాను.

పూర్వమెప్పుడో మొత్తం భూప్రపంచానికంతటికీ ఒక పెద్ద సమస్య వచ్చిందట, అంటే "global problem" అన్న మాట! భూమినుంచి విడిపోయిన ఒక పెద్ద గోళం (meteorite అనుకోండి), gravitational forcesలో వచ్చిన ఏవో తేడాల వల్ల, మళ్ళీ భూమ్మీదకి దూసుకువచ్చిందట. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ గోళాన్ని తన చక్రంతో తునాతునకలు చేసి భూమిని రక్షించాడట. ఆ కథాకమామీషు మరోసారి తీరిగ్గా ముచ్చటించుకుందాం. అలాంటి గ్లోబల్ సమస్యని తీర్చిన దేవుడే కదా గ్లోబల్ దేవుని పదవికి అర్హుడు.

అందుకే అంటున్నాను, గ్లోబల్ దేవుడు గోవిందుడే!

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడవనగా
విశ్వము జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!


పూర్తిగా చదవండి...

Monday, August 9, 2010

తెలుగు పద్యము తన పెద్దదిక్కు నీగె!

ఒకోసారి కొంతమందితో మనకి ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మన మీద గాఢమైన ప్రభావాన్ని చూపుతారు, మనకి ఆత్మీయులవుతారు. సాధారణంగా ఇలాంటి బంధం ఒక రచయితకీ పాఠకునికీ మధ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏకపక్షం. పాఠకునికి రచయితతోనే ఉండేది. నన్నలా ప్రభావితం చేసిన వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్యగారు.

ఛందస్సులో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి దోహదం చేసిన పుస్తకాలలో కోవెలవారి తెలుగు ఛందోవికాసము ముఖ్యమైనది. ఇది ఛందస్సుకి సంబంధించిన మామూలు లక్షణగ్రంథంలా కాకుండా, తెలుగు ఛందస్సు మూలాలను పరిశీలిస్తూ, తెలుగు ఛందస్సుని తమిళ కన్నడ ఛందస్సులతో పోలుస్తూ, గణవిభజన, యతి, ప్రాసల వెనకనున్న వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని వచనంలో సాగే పుస్తకం. ఛందస్సు గురించిన అవగాహనకి ఈ పుస్తకం నాకెంతో ఉపయోగపడింది.

అలాగే వీరికీ, చేరాగారికీ మధ్య వచన పద్యాలలో ఛందస్సు గురించి చాలా కాలం కిందట వ్యాసపరంపరలతో ఒక చర్చ జరిగింది. ఈ చర్చ ఎంతో ఆసక్తికరమైనది, అంతకు మించి ఆరోగ్యకరమైనది. వారిరువురి మధ్యనా ఆ చర్చ ద్వారా ఏర్పడిన అనుబంధం ఆదర్శవంతం. ఈ చర్చలోని వ్యాసాలన్నిటినీ "వచన పద్యం - లక్షణ చర్చ" అనే పుస్తకంగా సంకలించి ప్రచురించారు. ఈ చర్చలో వారిద్దరూ అనేక విషయాల్లో విభేదించుకున్నప్పటికీ వారి మధ్యన స్నేహబంధానికి ఆ విభేదాలు అడ్డురాలేదు. ఈ వాదనవల్ల ఏర్పడిన బంధం ఎంతదాకా వెళ్ళిందంటే, ఆ తర్వాత ఒకరు వ్రాసిన పుస్తకాలు మరొకరికి అంకితం ఇచ్చుకొనేంతదాకా!

అన్నిటికన్నా కూడా విశ్వనాథని అర్థం చేసుకోడానికి శ్రీ సంపత్కుమారాచార్యగారి పుస్తకాలు వ్యాసాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. దానికి నేనతనికి ఎప్పటికీ ఋణపడిపోయాను. విశ్వనాథ సాహిత్యాన్ని గురించి "విశ్వనాథ సాహిత్య దర్శనం" అన్న పుస్తకాన్ని వారు వ్రాసారు. విశ్వనాథ కవిత్వాన్ని గురించి ఇంకా చాలాచోట్ల చాలా వ్యాసాలు వ్రాసారు. విశ్వనాథ జీవితచరిత్రకి (పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వ్రాసిందని గుర్తు) సంపాదకత్వం వహించారు.

చాలా ఏళ్ళ కిందట దూరదర్శన్ "పద్యాల తోరణం" కార్యక్రమంలో పాల్గొనడానికి టీవీ స్టూడియోకి వెళ్ళినప్పుడు వారుకూడా వచ్చారు. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాకపోవడంతో వారికి నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాను కాని, అంతకుమించి పరిచయం పెంచుకోలేదు. అయినా వారి రచనల ద్వారా వారు నాకెంతగానో దగ్గరయ్యారు.

ఆ సంపత్కుమారాచార్యగారు మొన్ననే పరమపదించారన్న వార్త విని చాలా బాధపడ్డాను. ఛందస్సు, విశ్వనాథ కవిత్వం నాకు నేర్పిన పరోక్ష గురువు వారు. ఈ కాలంలో తెలుగు పద్యసాహిత్యమ్మీద గొప్ప అధికారం ఉన్నవాళ్ళలో ఆయనే పెద్ద. రామాయణకల్పవృక్షానికి వ్యాఖ్యానం వ్రాయగల సామర్థ్యం ఉన్న చాలా కొద్దిమంది విమర్శకులలో సంపత్కుమారాచార్య ఒకరని నేను నమ్ముతాను. ఇప్పుడు వారు కూడా పరమపదించారని తెలిసి, ఇక కల్పవృక్షానికి వ్యాఖ్యానం వచ్చే అవకాశం మరింత తగ్గిపోయిందని చాలా బాధగా ఉంది. ఇకపై వారి రచనలు చదివే అవకాశం లేదన్న ఊహ కష్టంగా ఉంది!

వారిని సంస్మరిస్తూ, వారు వ్రాసిన "కల్పవృక్షము - యుద్ధ శిల్పావతారిక" అనే వ్యాసం నుండి ఒక చిన్న భాగం ఇక్కడ ఇస్తున్నాను. మీరుకూడా వారి విమర్శ పటిమని రుచిచూడండి.

***

రామాయణగాథ నీ సంసారానికి - నిత్యప్రస్రవణ శీలమయిన లోకానికి - అందించిన వాల్మీకిమహర్షి పరమమౌని. కల్పవృక్షావతారికలో వాల్మీకి స్మరణ సాగిన పద్యత్రయిలోనూ ఆయన "మౌని"గానే విశేషణింపబడినాడు. గాథనందించిన మహర్షి "మౌని" కాగా, గురువుగారి మౌనవ్యాఖ్యానంలో శిష్యులు ఛిన్నసంశయులు కావలసి ఉంటుంది. ఎల్లాంటివారయితే, ఏం చేస్తే వారు ఛిన్నసంశయులు అయ్యే స్థితి కలుగుతుంది? మొదట కావలసింది వారు గాఢప్రతిభులు. తద్ద్వారా ఆ గాథను, దానిలోని రహస్యాలనూ, కథాకథనశిల్పానేక మార్గాలనూ పౌనఃపున్యంగా ఉపాసించి, ఆ కావ్యవాక్కు సర్వశిల్పభూమి అని తెలిసి సర్వశాస్త్ర లక్ష్యమని ఎరిగి, సంప్రదాయావగాహనతో మననం చేసి, అనంతమయిన వ్యుత్పన్నత లోకజ్ఞత కలిమితో అనేకాంశాలను సమన్వయపూర్వకంగా ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే ఛిన్న సంశయత్వం. కృష్ణశాస్త్రి అన్నట్లు "గాఢప్రతిభు"లయిన సత్యనారాయణగారు ఆ విధంగా చేసినారు.

"--- వలయు విద్యకైగాగ్ర్య మభ్యసనవేళ
జనును బహుముఖత్వము ప్రదర్శనము వేళ"

-రామాయణకల్పవృక్షం, యుద్ధ నిస్సంశయ ఖండం

రామాయణ మహావిద్యా విషయకంగా ఆయన చేసిన అభ్యాసమా విధమైనది. రామాయణాన్ని కల్పవృక్షంగా విరియించిన వేళ ప్రదర్శించిన బహుముఖత్వం అనంతముఖమయింది.
...
రామాయణకల్పవృక్షం యుద్ధకాండతోనే సమగ్రమయింది. కావలసిందిగూడా ఆ విధంగానే. వాల్మీకావతారికా సర్గల్లో - "రఘువరచరితం మునిప్రణీతం, దశశిరసశ్చ వధం నిశామయధ్వం" అనీ, "కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్" అనీ చెప్పబడింది. నిజాని కది రఘువర చరితమా? సీతామహచ్చరితమా? నిజానికా చరితలు "రెండు" కావు - ఒకటే రెండుగా భాసించినా ఒకరు లేకుండా మరో టనిపించే చరిత లేదు; కారణం సీతారాములు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు.

"ఇరువురము ఒక్క వెలుగున
చెరి సగమును, దీని నెఱుగు శివుడొకరుండే,
పురుషుడ వీ వైతివి, నే
గరితనుగా నైతి..." (కల్పవృక్షం, యుద్ధ.ఉపసంహరణ)

అగ్నిప్రవేశం చెయ్యబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది. కల్పవృక్షావతారికలో "కృత్స్నము రామ మహత్తు" శివుడెరుంగునని చెప్పిన అంశం ఇక్కడి అంశాన్ని స్పృశిస్తున్నది. ఈ విధంగా "పాలితాన్యోన్య లంఘన స్పర్థము"లయిన అంశాలు అనేకం. కాగా శివుడెరింగిన ఆ కృత్స్నత - సమగ్రత ఇది. అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణ వధార్థం. ఉదాహృత వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశశిరస్క - పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడు పౌలస్త్యుడు భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కారు. "రమ్‌" అన్న ధాతువునుంచి సుబంతపదం పుంలింగ రూపంలో నిష్పన్నమయితే "రామ" అని, స్త్రీలింగ రూపంలో నిష్పన్నమయితే "రామా" అని ఒకే వెలుగు ద్విధా పరిణతమయినట్లు, ఒకే మూలధాతువు ఈ రూపద్వయంగా పరిణతమయింది. ఒకటి పురుషరూపం, ఒకటి గరిత రూపం. అందుకనే తత్త్వతః అభేదం. ఈ కారణంగానే వాల్మీకం రఘువరచరితం గానీ, సీతా మహచ్చరితం గానీ కాక, "రామాయణ"మయింది. తాత్త్వికాభేదాన్ని రామాయణం గర్భీకరించుకుంది. "కావ్యం రామాయణం కృత్స్నం" అంటే ఆ కృత్స్నత ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే,

"సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి
ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యంబీ శివాద్వైతికిన్
సీతం గైకొనిపోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా
దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్" (యుద్ధ.నిస్సంశయ ఖండం)

అనుకుంటాడు. అట్లాగే, సీతను వదిలి పుత్రులను పొందటంగూదా కాదు. ఇవన్నీ అనుషంగికమయినవి. అసలు ఫలం దశశిరస్కుడు పౌలస్త్యుడు అయిన రావణుని వధ. దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక, పౌలస్త్యత్వం మానవుని ఉదాత్త స్థాయికి సూచిక. ఆ స్థాయిలో వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజకం. ఆ భంజికమయిన దాన్ని ఉన్మూలించటం సృష్టియొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించుట ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం కాబట్టి రావణవధ రామాయణఫలం. ఈ విధంగా యుద్ధకాండతోనే రామాయణ సమగ్రత.
...

రావణ వధానంతరం అగ్నిలో ప్రవేశించబోతూ సీత అనేకాంశాలను సువ్యక్తం చేస్తూ -

"--- కైక కోరక మహాప్రభు! నీ వని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్" (యుద్ధ,ఉప)

అంటుంది. "సీతాయాశ్చరితం మహత్" అని అనకుండా ఉండలేకపోవటం ఇందువల్లనే. రాముడు శుద్ధ తత్త్వ స్వరూపం. ఆయన క్రియాప్రవృత్తిని స్పందింప చేసింది కైకేయి. ఆ స్పందనను ఫలవంతం చేసింది సీత. అందుకే తిరిగి అయోధ్యకు వచ్చినాక కలుసుకున్నప్పుడు -

కైకెయి సీత గౌగిటికి గైకొని - "ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయనికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాదివధ కల్గునె యన్న ప్రశంసలోనికిన్ (యుద్ధ, ఉప)

అంటుంది. కార్య సాఫల్యం విషయికంగా అంతర్మథనం పొందిన లక్షణం కైక మాటల్లోనూ, నిశ్చయాత్మకత సీతమాటల్లోనూ వ్యక్తమై వారి వ్యక్తిత్వాలను సువ్యక్తం చేస్తుంది.

***


పూర్తిగా చదవండి...

Tuesday, July 6, 2010

దీర్ఘ విరామం తర్వాత - "దీర్ఘ వాసరా"ల గురించి

ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు. అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది:

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్

ఇది నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. ప్రసిద్ధమైన పద్యమే. భారతం చదవకపోయినా, కన్యాశుల్కం చదివిన వారిక్కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది. కరటకశాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు. వెంకటేశం, "పొగచుట్టకు" పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ "నలదమయంతులిద్దరు" పద్యం చదవమంటాడు. మొదటి పాదం చదవగానే కరటకశాస్త్రి ఆపి, "మనఃప్రభవానల" అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని. గుర్తుకొచ్చిందా?

అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి. ఇది కూడా చాలామందికి తెలిసిన కథే. ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస, ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి, నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది. ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి, విరహితులౌతారు. ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు. వాటిని వర్ణించే పద్యం ఇది!

మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు, మన్మథుడు. మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని. మన్మథ తాపం అన్న మాట. ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ. ఇక్కడ "మనః ప్రభవానల"లో "నః" యతి స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. అలా అక్కడ, ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది.
"దీర్ఘవాసర నిశల్" - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు. వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు. ఈ "దీర్ఘవాసరనిశల్" అనేది భలే అద్భుతమైన ప్రయోగం. చెపుతున్నది రాత్రుల గురించి. ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి. అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని. ఎందుకిలా జరుగుతోంది? దీనికి రెండు కారణాలు. ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు. దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి. మరొక కారణం - వేసం కాలంలో (వసంత గ్రీష్మ ఋతువుల్లో) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం తొందరగా అవుతుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి. కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది. వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట. ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక!

ఇంతకీ ఈ పద్యం ఈ మధ్యన గుర్తుకు రావడానికి కారణం, "దీర్ఘవాసర నిశల్" అన్న పదం. ఈ మధ్యనే ఆఫీసుపని మీద అమెరికాకి వచ్చాను. అందులోనూ అమెరికాలో పైన కెనడాకి దగ్గరగా ఉండే చోటు. తస్సాదియ్య "దీర్ఘవాసర నిశల్" అంటే ఏమిటో ఇక్కడకి వచ్చాక తెలిసివచ్చింది! ఇక్కడ ప్రస్తుతం వేసవి కాలం. ఉదయం అయిదు గంటలకే సూర్యోదయమైపోతుంది (నేనెప్పుడూ చూడలేదనుకోండి). రాత్రి(?) తొమ్మిదయ్యాక సూర్యాస్తమయం! అంటే ఉదయం అయిదునుంచీ రాత్రి(?) తొమ్మిది దాకా, పదహారు గంటలు పగలే నన్నమాట! పొడవైన పగళ్ళంటే ఇవి కదూ! చలికాలం వచ్చిందంటే ఎనిమిదింటి దాకా తెల్లవారదు. సాయంత్రం నాలుగింటికల్లా పొద్దుపోతుంది. ఇంత వైవిధ్యం మన దేశంలో ఉండదు. భారతదేశంలో ఉంటేనే నలదమయంతులకి అవి "దీర్ఘవాసర నిశల్" అనిపించాయే, అదే వాళ్ళు అమెరికాలో వేసంకాలం గడిపితే మరేమనిపించేదో! ఐతే ఇక్కడ ఎండకి మన ఎండంత తీక్ష్ణత ఉండదు కాబట్టి కాస్త నయమే :-) మన సూర్యుడు నిజంగా "ఖరకరుడే".

ఈ సందర్భంలోనే ఆముక్తమాల్యదలోని మరో పద్యం కూడా గుర్తుకు వచ్చింది. అద్భుతమైన ఊహ. రాయలంటేనే ఇలాంటి ఊహలకి పెట్టింది పేరు.

పడమరవెట్ట నయ్యుడుకు బ్రాశనమొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవి యాజ్ఞ మాటికిన్
ముడియిడ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్
జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తఱిన్

వేసం కాలంలో పగళ్ళు ఎంత పొడుగవుతాయో ముచ్చటించుకుంటున్నాం కదా. అలా ఎందుకవి పొడుగవుతాయో అన్నదానికి రాయల వారి ఊహ ఈ పద్యం. పగళ్ళెందుకు పొడుగవుతాయి? సూర్యుడు ఆకాశంలో తూర్పునుండి పడమరకి మెల్లగా ప్రయాణిస్తాడు కాబట్టి (ఇది ఊహ కాదు నిజమే!). సూర్యుడెందుకంత మెల్లగా ప్రయాణిస్తున్నాడు? సూర్యుడు రథమ్మీద కదా ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఏడు గుఱ్ఱాలు. వాటికి పగ్గాలేమో పాములు. పాములు గాలిని భోంచేస్తాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. వేసం కాలంలో పడమటినుండి గాలులు (ఎదురుగాలులన్న మాట) బాగా వేడిగా వీస్తున్నాయి. ఎవరైనా వేడన్నం తినగలరు కాని పొగలు క్రక్కుతూ నోరు కాలిపోయేట్టున్న అన్నాన్ని తినగలరా? లేదుకదా. అంచేత పాపం ఆ పాములకి ఆహారం లేకపోయింది. దానితో నీరసం వచ్చి వడలిపోయాయి. పట్టుతప్పి మాటిమాటికీ ఊడిపోతున్నాయి. వాటిని సరిచెయ్యమని సూర్యుడు చెపుతున్నాడు. సరిచెయ్యడానికి సూర్యుడి సారథి అనూరుడు (పిచ్చుకుంటు) మాటిమాటికీ రథాన్ని ఆపవలసి వస్తోంది. అంచేత ప్రయాణం మెల్లగా సాగుతోంది. కాబట్టి పగళ్ళు అంతసేపుంటున్నాయిట! ఏం ఊహ! ఇక్కడ అమెరికా సూర్యుడి పాములు మరీ నిస్సతువలై ఉన్నట్టున్నాయి :-) ఏకంగా పదహారు గంటలపాటు సాగుతోందతని ప్రయాణం!


పూర్తిగా చదవండి...

Saturday, May 22, 2010

మన్మథుడి విజయరహస్యం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే

ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.

లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.

మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.

ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.

తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన

శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.

శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!


పూర్తిగా చదవండి...

Wednesday, May 5, 2010

అంతర్జాలంలో మరో కల్పవృక్షం

కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది వేరే కల్పవృక్షం. అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి:

పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి
కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి
రోసి డస్సినవారల గాసిదీర్చు
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం.

పత్రం అంటే రెండర్థాలు. ఒకటి ఆకు. రెండు కాగితం. అలాగే ఫలము అంటే పండు, ప్రయోజనము. పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం. కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి. అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది. అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది. అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా. అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట! అవును అదే నిఘంటువు. ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ.
సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ "అపర్ణలే" (అంటే కాగితాలు లేనివే) కదా. తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు, నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం. ఇందులో బ్రౌణ్యమే కాకుండా, శబ్దరత్నాకరం, మరి రెండు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు. ఆ వెతుకులాట పదాలలో (ఆరోపాలలో) కాని, మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు. శొధన (అదే, తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇంకెందు కాలస్యం, వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి! అన్నట్టు మరో విషయం. ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు. అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట!

బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే, ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం. వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు, శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు. వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు. తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే. మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు. ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి.
పూర్తిగా చదవండి...

Friday, April 16, 2010

ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు!

"ధర్మరాజునేవిఁటి అర్జునుడేవిఁటి చెడతిట్టడమేవిఁటి? విడ్డూరంగా ఉందే!" అని ఆశ్చర్యపోతున్నారా? అవును విడ్డూరమే కదూ మరి! ఎంతో కలిసిమెలిసి ఉండే అన్నదమ్ములు పాండవుల్లో అర్జునుడు ధర్మరాజుని తిట్టడమా? ఇదేదో అవార్డు పొందిన ఏ ఆధునిక భారత నవలలోనో ఉన్న సన్నివేశం అనుకునేరు. కాదు కాదు. ఇది అచ్చంగా ఆ వ్యాసుడు రాసిన మహాభారతంలో ఉన్న విషయమే. మరో విషయం చెపితే మరీ ఆశ్చర్యపోతారు. స్వయంగా శ్రీకృష్ణుడి ప్రోద్బలంతోనే అర్జునుడా పని చేస్తాడు! సరే, ఇక ఊరించింది చాలు, అసలు కథలోకి ప్రవేశిద్దాం.

అవి కురుక్షేత్ర సంగ్రామం మహా జోరుగా సాగుతున్న రోజులు. అప్పటికే పదహార్రోజుల యుద్ధం అయిపోయింది. భీష్మ ద్రోణులు నేల కూలారు. కర్ణుడు కౌరవ పక్షాన సర్వసేనాధిపతి అయ్యాడు. ఈ కర్ణుడు వికెట్టొక్కటి తీసేస్తే ఆట గెలిచినట్టేనని అనుకుంటున్నారు పాండవులు. కర్ణుడు సర్వసేనాధిపతిగా ఒక రోజు యుద్ధం అప్పుడే అయిపోయింది. ఆ రోజు కర్ణార్జునులు భీకరంగా యుద్ధంచేసుకున్నారు. అర్జునుడి ప్రతాపానికి కౌరవ సేనలు చెల్లాచెదరైపోయాయి. ఆ రోజు యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడు కర్ణుడతనికి ధైర్యం చెపుతూ, "రేపు చూడు నేనెలా విజృంభిస్తానో! నీకు శత్రువులంటూ లేకుండా చేస్తాను. ఆ అర్జునుణ్ణి సంహరిస్తాను." అని బీరాలు పలికుతాడు. శల్య సారథ్యంలో ఆ మరునాడు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగానికి వెళతాడు కర్ణుడు. మళ్ళీ సంగ్రామం భీకరంగా సాగుతూ ఉంటుంది. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తూ కర్ణుడికి దూరంగా వెళతాడు. ధర్మరాజు కర్ణుడూ యుద్ధానికి తలపడతారు. వేసవికాలం మిట్టమధ్యాహ్నం మండే సూర్యుడిలాగా (ప్రస్తుతం ఆ ప్రతాపం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే కదా! వేడి 43 డిగ్రీలకి పెరిగిపోతోంది!) పరాక్రమిస్తాడు కర్ణుడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడి చేతిలో బాగా తన్నులు తిని యుద్ధభూమినుంచి పలాయనం చిత్తగిస్తాడు.

అప్పుడు జరుగుతుందొక విచిత్రమైన నాటకీయ సంఘటన! అలాంటి సందర్భంలో ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరం ఊహించలేం! అప్పటికే రెండు సార్లు కర్ణుడి చేతిలో తన్నులు తిని పరాభవింప బడ్డాడేమో, శిబిరంలోకి వెళ్ళి, ధర్మరాజు తనలో తానే బాగా కుమిలిపోతూ ఉంటాడు. ఈ లోపున యుద్ధభూమిలో అర్జునుడు ధర్మరాజుని వెతుకుతూ కర్ణుడున్న దిశగా వస్తాడు. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడి ఉగ్రమూర్తిని చూసి అర్జునుడు విస్తుపోతాడు. "బ్రతికి యుండిన శుభములు వడయవచ్చు", ముందు రథాన్నిక్కడనుంచి పోనియ్యమంటాడు కృష్ణుడితో. అర్జునుడు అలసినట్టున్నాడు కాస్త బడలిక తీర్చుకోవడం మంచిదే అనుకుంటాడు కృష్ణుడు (ఈ అర్జునుడిలా మాట్లాడతాడేమిటి? వీడికి కాస్త చికిత్స చెయ్యాలి అని బహుశా లోపల అనుకుని ఉంటాడు). "సరే, ధర్మరాజు ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించి వచ్చి అప్పుడీ కర్ణుడి సంగతి చూద్దాం", అని రథాన్ని ధర్మరాజు శిబిరం వైపు పోనిస్తాడు. కృష్ణార్జునులు రణరంగం నుంచి రావడాన్ని చూసి, కర్ణుణ్ణి చంపి ఆ శుభవార్త తనకి చెప్పడానికి వచ్చేరనుకుంటాడు ధర్మరాజు. పరమానందం పొందుతాడు. "ఆహా! అంతమంది చూస్తూ ఉండగా ఈ రోజు కర్ణుడు నన్ను అవమానించాడు. దానికి తగిన ప్రతీకారం చెల్లించి వచ్చారన్నమాట. సెహభాష్!" అని మెచ్చుకుంటాడు.

అరుదిది! నీవు నొవ్వక మహాబలు గర్ణు వధించితాతడ
క్కురుపతి సంతసింప - నరుగూల్చెద సంగరభూమి నేన యొ
క్కరుడను వీక దాకి - యను గర్వపు మాట సనంగనీక, నే
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్భుజ వీర్యశౌర్యముల్

"నువ్వేమాత్రం కష్టం లేకుండా ఆ మహాబలుడైన కర్ణుడిని సంహరించావా! ఆ దుర్యోధనుడి సంతోషం కోసం, 'నేనొక్కడినే ఆ అర్జునుణ్ణి చంపుతానూ అని విర్రవీగిన వాడి మాటలని వమ్ము చేస్తూ, ఇవ్వాళ యుద్ధంలో నీ భుజబలాన్ని, శౌర్యాన్ని చూపించి వచ్చావా!" అని అర్జునుణ్ణి పొగుడుతాడు.

కృష్ణార్జునులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా ధర్మరాజు అమితోత్సాహంతో మాట్లాడెస్తూ ఉంటే, మెల్లిగా అసలు సంగతి చెప్తాడు అర్జునుడు. "అన్నా! మరేమో, అశ్వత్థామ నా మీద యుద్ధానికి వచ్చాడు. చాలా ఘోరంగా యుద్ధం చేసాడు. మొత్తానికి ఎలాగైతేనేం అతని గర్వాన్ని అణచి అతన్ని తిప్పికొట్టాను. ఆ తర్వాత నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ కనిపించాడు. నువ్వేమో దెబ్బలు తగిలి శిబిరానికి వచ్చావని చెప్పారు. నువ్వెలా ఉన్నావో చూడ్డానికి వచ్చాము. నువ్వు క్షేమంగానే ఉన్నావుగా. ఇప్పుడు వెళ్ళి ఆ కర్ణుడి పనిపడతాను చూడు!" అని అంటాడు అర్జునుడు.

ఇంకేముంది! కర్ణుడు బతికే ఉన్నాడన్న మాట వినగానే ధర్మరాజు ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. పైగా విపరీతమైన కోపం వస్తుంది. రాదూ మరి! తను ఓడిపోయి వచ్చానని పరామర్శించడానికి వస్తాడా అర్జునుడు! పైగా తనని అవమానించిన కర్ణుడిని చంపకుండా వస్తాడా! ఉక్రోషం పొంగుకొస్తుంది. పట్టరాని కోపంతో అర్జునుణ్ణి చెడామడా తిడతాడు. తిక్కన కలంలో ఆ ఘాటైన అచ్చ తెలుగు తిట్లు మచ్చుకి మీరూ రుచి చూడండి. :-)

విను కర్ణున కేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజ మాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతో గూడంగ గంసమర్దను డోడెన్

నేను కర్ణుడికి ఓడిపోయానని అనుకోనక్కరలేదు. నేనొక్కడినే కాదు, ఇప్పుడు నువ్వూ ఓడిపోయావు. భీముడు, నకులసహదేవులు ఇంతకు ముందే ఓడిపోయారు. ఆఖరికి మనతో కలిసి ఉండడం వల్ల ఈ కృష్ణుడు కూడా ఓడిపోయాడు!

కావున మనమిక ననికిన్
బోవం బనిలేదు, విపినభూమికి జని య
చ్చో వెఱపు దక్కి తపసుల
మై విచ్చలవిడి జరింత మందఱము దగన్

"అంచేతనింక మనం మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళక్కరలేదు. అందరం కట్టకట్టుకొని మళ్ళీ అడవులకు పోదాం. అక్కడ ఎలాంటి భయమూ లేకుండా తపస్సుచేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. అదే మనకి తగిన పని", అని అంటాడు. "లేదా గొప్పలకిపోకుండా, వినయంతో వెళ్ళి ఆ దుర్యోధనుడికి సేవకులమై పడి ఉందాం", అని కూడా అంటాడు. అంతేనా! ఇంకా వినండి:

అని వధించెద గర్ణు నేనని ప్రతిజ్ఞ
సేసి, యిటు దెచ్చి నన్నిట్లు సేసి, తింత
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల
వైవ నోర్చితి నను బగవారి నడుమ

కర్ణుడిని చంపుతానని పెద్ద పోటుగాడిలా ప్రతిజ్ఞ చేసావు. తీరా చూస్తే ఇప్పుడిలా కొంపముంచావు. నన్ను బాగా పైకెత్తేసి చివరికి నేల మీద గభీలున పడెయ్యడమే నీకిష్టంలాగా ఉంది, అదీ శత్రువుల మధ్యలో!

దేవతలిచ్చిన తేరు నశ్వంబులు
గపికేతనంబును గలవు, దైవి
కంబు చేనున్నది గాండీవమను దాటి
యంత విల్లది గాక, హరి రథంబు
గడపెడు నటె! పరికర మిట్టిదై యుండ
నెట్లు కర్ణునికోడి యిట్టు వలియ
బాఱతెంచితి వీవు? భండనంబున గర్ణు
గని పాఱు దని సుయోధనుడు సెప్పె

నది నిజంబుగ గొనక బేలైతి; నాదు
బేలతనమున గాదె పాంచాల మత్స్య
పాడ్యులాదిగ గలిగిన బంధుమిత్త్ర
జనుల దెగటాఱి రప్రయోజనముగాగ

దేవతలిచ్చిన రథమూ, గుఱ్ఱాలూ ఉన్నాయి. సాక్షాత్తూ హనుమంతుడు నీ జెండాపై ఉన్నాడు. దైవసహాయంతో లభించిన గాండీవం, తాటిచెట్టంత విల్లది, చేతిలో ఉంది! నారాయణుడే నీ రథ సారథి! ఇన్నీ ఉండి కర్ణుడిని ఎదుర్కోలేక ఇలా పారిపోయి వచ్చావు నువ్వు. యుద్ధంలో కర్ణుడిని చూస్తే అర్జునుడు పరిగెట్టి పారిపోతాడని దుర్యోధనుడు ముందే చెప్పాడు. వాడి మాట వినక నేను బేలనయ్యాను. ఇలా నా బుద్ధిలేనితనం కారణంగా పాపం అనవసరంగా పాంచాలురు, మత్స్యులు, పాండ్యులు మొదలైన బంధు మిత్త్రులందరూ యుద్ధానికి వచ్చి నాశనమయ్యారు!

ఇంకా ఎంతమాటన్నాడో తెలుసా?

గొంతి కడుపునందు గొడుకుచూలై నీవు
దోపకుండ వైతి, తోచినట్టి
పిండ మెడలియైన బిదప దిగంబడ
దయ్యె; నింత వుట్ట దట్టులైన!

"కుంతి కడుపులో నువ్వు కొడుకులా కనిపించి కూడా కాకుండా పోయావే (అంటే నువ్వు మగాడివి కాకుండా పోయావే అనీ)! పిండంగా ఉన్నప్పుడే జారిపోయుంటే ఇంత జరిగేది కాదు కదా!" అన్నాడు. ఎంతలేసి మాటలన్నాడో చూసారా?!

"ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు" అని కదా శీర్షిక? మరి ధర్మరాజు అర్జునుడిని చెడతిట్టడం గురించి చెపుతున్నానేమిటని అలోచిస్తున్నారా? అగండాగండి. ముందుంది అసలు కథ!

ధర్మరాజు చివరగా మరోమాట కూడా అంటాడు.

హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి; నీదు గాండివం
బెరువుగ నిచ్చి, నీవు నొగలెక్కి హరిన్ రథి జేయ గన్న ని
ష్ఠురభుజవిక్రమోగ్రుడగు సూతతనూభవు దత్సహాయులన్
బొరిగొనడే సుయోధనుని పోడిమి దూలగ నొక్క మాత్రలోన్

"అక్కడ కృష్ణుడు ఉన్నా కూడా భయంతో వచ్చేసావే! నీ గాండీవాన్ని కృష్ణుడికి ఎరువుగా ఇచ్చి, అతన్ని రథమెక్కించి, నువ్వు రథాన్ని తోలవలసింది కదా. అప్పుడా దుర్యోధనుడి పొగరు అణిగేటట్టు కర్ణుడిని వాడి సేనని ఒక్క చిటికలో చంపేసేవాడు!" అని అంటాడు.

అది వినగానే చయ్యని తన కత్తి తీస్తాడు అర్జునుడు. "ఇదేమిటి. ఇక్కడ కౌరవులు లేరే. మనం ధర్మరాజు కుశలాన్ని తెలుసుకోడానికి వచ్చాం. అతను బాగానే ఉన్నాడు. అంచేత సంతోషించాలి కాని ఇప్పుడు కోప్పడాల్సిన సమయం కాదు కదా! ఎందుకు కత్తి తీసేవ్?" అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నా గాండీవాన్ని మరొకడికి ఇమ్మని ఎవడైనా అంటే కనక, వాడి తల తెగనరుకుతానని నేను ప్రతిజ్ఞ చేసాను. ఇప్పుడీ ధర్మరాజు నన్నంత మాటన్నాడు. కాబట్టి ఇతన్ని చంపేస్తాను" అంటాడు. అది విని కృష్ణుడు, "పోపో! నువ్వెవడివయ్యా బాబూ! నీయిల్లు బంగారంగానూ! నువ్వెప్పుడో ఏదో ప్రతిజ్ఞ చేసానని చెప్పి, నీ అన్న, సాక్షాత్తు ధర్మదేవత అయిన ధర్మరాజుని చంపేస్తానంటావా? నీకు మతీసుతీ తప్పిందా ఏమిటి? సరే, నీకు సత్యమంటే ఏమిటో, ధర్మమంటే ఏమిటో పూర్తిగా తెలిసినట్టు లేదు. చెప్తాను విను" అని ఒక కథ చెప్తాడు.

పూర్వం కౌశికుడనే ఒక ముని ఒక గ్రామానికి పక్కనే ఆశ్రమం ఏర్పరుచుకొని తపస్సు చేసుకొనేవాడు. అతను సత్యవ్రతాన్ని ఆచరిస్తూ, ఎప్పుడూ సత్యమే పలుకుతాడనే ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు పక్కనున్న గ్రామంలో దొంగలు పడ్డారు. వాళ్ళనుండి కొంతమంది జనం తప్పించుకు పారిపోయి, ఆ కౌశికుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి పక్కనున్న పొదల్లో దాక్కుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన దొంగలు కౌశికుణ్ణి ఊరి జనం ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. తనకి అసత్య దోషం అంటకూడదని, వాళ్ళు పొదల్లో దాక్కున్నారన్న విషయం దొంగలకి చెప్పేస్తాడా ముని. ఆ దొంగలా జనాలని చంపేసి, వాళ్ళ ధనాన్ని దోచుకుని చక్కాపోతారు. అప్పుడు వాళ్ళందరినీ చంపిన పాపానికి ఆ ముని నరకానికి వెళతాడు.

అదీ కథ. అంచేత హింసని కలిగించే నిజం సత్యం అవ్వదు. ఇప్పుడు చంపకూడని నీ అన్నని చంపి, హింస చేస్తే అది సత్యవాక్పరిపాలన అవ్వదు అని కృష్ణుడు వివరిస్తాడు. అప్పుడు అర్జునుడు సంతోషించి, "పాపం చెయ్యకుండా నన్ను రక్షించావు కృష్ణా. అయినా నా ప్రతిజ్ఞ వృథా పోకుండా, అన్నగారికి ఏమీ జరగకుండా ఏమైనా మార్గముంటే చెప్పు" అంటాడు. అప్పుడొక ఉపాయం చెపుతాడు కృష్ణుడు. "పెద్దవాళ్ళని, గురువులని దూషించడమంటే వాళ్ళని చంపినంత పని. అంచేత నువ్వు ధర్మరాజుని దూషించి, ఆ తర్వాత అతని కాళ్ళపైబడి క్షమించమను సరిపోతుంది. నీ ప్రతిజ్ఞ తీరినట్టైపోతుంది". ఇదీ కృష్ణుడు చెప్పిన ఉపాయం! బాగుంది కదూ :-)

ఇక చూస్కోండి! అర్జునుడు ధర్మరాజుని చెడ తిట్టడం మొదలుపెడతాడు. ఈ తిట్టడం చూస్తే, ఏదో మొహమాటానికి పైపై తిట్టడం అనిపించదు. మహ ధాటిగా, ఎప్పటినుంచో మనసులో రగులుతున్న కోపాన్ని వెళ్ళగక్కినట్టుగా ఉంటుంది. గట్టిగా తిడితే కాని తన ప్రతిజ్ఞ నెరవేరినట్టు కాదనుకున్నాడో ఏమో అర్జునుడు!

కన దస్త్రంబుల నుజ్జ్వలోద్భట గదాఘాతంబులం గాల గే
లను విద్విట్చతురంగ సంఘముల గూలం, గేలి సల్పంగ జా
లిన యా భీముడు వల్కుగాక నను; దోర్లీలాసమగ్రుండవై
యనిలో నిల్వగ లేని నీ విటుల కీడాడంగ నర్హుండవే?

ప్రకాశించే అస్త్రశస్త్రాల తోనూ, భీకరమైన గదాదండంతోనూ శత్రువుల చతురంగ బలాలనీ చీల్చి చెండాడేటట్టు యుద్ధం చెయ్యగలిగిన ఆ భీముడు నన్నేమైనా అన్నాడంటే అర్థముంది, జబ్బసత్తువలేక యుద్ధరంగంనుంచి పారిపోయి వచ్చిన నీకు నన్ను ఇంతలేసి మాటలనడానికి అర్హత ఉందా?

నన్నెఱిగి యెఱిగి యిట్లన
జన్నే? నీ జిహ్వ పెక్కు శకలము లై పో
కున్నది యేలొకొ? రణమున
నెన్నడు నీవేమి సేసి తింత యనుటకున్?

నా గుఱించి తెలిసి తెలిసీ ఇన్నిన్ని మాటలంటావా? ఇంతలేసి మాటలన్న తర్వాత కూడా నీ నాలుక ముక్కలై పోలేదేమిటో! ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా చేసావా, నన్నింత మాటలనడానికి?

నకులుడు సహదేవుండును
బ్రకట భుజాస్ఫురణమున నరాతిబలము నే
లకు గోలకు దెత్తురు; నో
రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్?

నకులుడూ సహదేవుడూ కూడా తమ భుజబలంతో శత్రువులని మట్టికరిపిస్తారే! వాళ్ళైనా ఎప్పుడూ నోటికి వచ్చినట్టిలా మాట్లాడారా?

నీవు జూదంబాడగా వైరబంధంబు
కౌరవకోటితో గలిగె; మనకు
రాజ్య నాశంబు నరణ్యవాసంబును
దాస్య దైన్యంబు నత్యంత దుఃఖ
ములు దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం
బున నించుకేనియు; ననికి జాల
కున్న వానికి దాల్మి యొప్పగు గాక ప్ర
ల్లదనములు పలికిన లాఘవంబు

సెందు? మున్నేమి సేసిన జేసి తింక
నైన దుర్బుద్ధితనములు మాని తగిన
పౌరుషము లేము సేయగ నూరకుండు;
మిడుము వడువారు సైతురే యివ్విధంబు?

నువ్వు జూదమాడ్డం వల్లనే మనకీ దురవస్థ, కౌరవులతో యుద్ధమూ, రాజ్య నాశనము, అరణ్యవాసము, అజ్ఞాత వాసంలో దాస్య వృత్తి ఇవన్నీ వచ్చాయి. అయినా ఇంకా నీకేమాత్రం సిగ్గు లజ్జా లేకుండా పోయింది! యుద్ధం చెయ్య లేకపొతే కనీసం సహనమైనా ఉండొద్దూ? ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం దేనికి? చేసినదేదో చేసావ్. ఇకనైనా నోరుమూసుకొని ఉండు. వచ్చిన కష్టాలతో పాటు నువ్విలా నోరు పారేసుకున్నావంటే సహించి ఊరుకోలేం!

చూసారా ఎంతగా ధర్మరాజుని చెడతిట్టాడో అర్జునుడు! ఎంత గట్టి వార్ణింగిచ్చాడో! నిజంగా అర్జునుడు ధర్మరాజుతో ఇలాంటి మాటలు మాట్లాడాడని ఊహించనుకుడా లేం కదా! ఏం చేస్తాడు తప్పనిసరై తిట్టాడు, కృష్ణుడు తిట్టించాడు. :-) సరే మొత్తం ఇలా తిట్టడమంతా అయిపోయాక, మళ్ళీ తన ఒరలోంచి కత్తి తీస్తాడు. "మళ్ళీ ఇదేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నేనింతలేసి మాటలు ధర్మరాజుని అన్నందుకు గాను నాకు మరణమే ప్రాయశ్చిత్తం. నా తల నరుక్కుంటాను" అంటాడు! అప్పుడు కృష్ణుడేం చేస్తాడు? "ఓరినీ! ఇంత ఉపాయం చెప్పిందీ నువ్వు చావడానికా! చాల్చాల్లే ఊరుకో. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. నిన్ను నువ్వు చంపుకోవడమే కదా నీకు కావలసింది. నిన్ను నువ్వు పొగుడుకో. అదే ఆత్మహత్యతో సమానం." అని మరో ఉపాయం చెప్తాడు కృష్ణుడు. సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని, తన గొప్పతనాన్ని తాను పొగుడుకుంటాడు అర్జునుడు! అంతా అయ్యాక ధర్మరాజు కాళ్ళ మీద పడి, "తప్పక నిన్ను అన్నేసి మాటలన్నాను. తూచ్! అవేం పట్టించుకోకు. ఇప్పుడు నిజం చెప్తాను విను. నువ్వు నా ప్రాణం కన్నా కూడా నాకెక్కువ. ఇప్పుడే నాకు అనుజ్ఞ ఇవ్వు. వెళ్ళి ఆ కర్ణుడిని చంపి వస్తాను" అని వేడుకుంటాడు అర్జునుడు.

హమ్మయ్యా అయ్యిందిరా సీను అనుకొని కృష్ణుడు ఊపిరి పీల్చుకునే లోపు, మరో ఉపద్రవం వచ్చిపడుతుంది! తనని అన్నేసి మాటలన్నాక, తర్వాత తూచ్ అంటే మాత్రం, ధర్మరాజు మనసు ముక్కలై పోయి ఉండదూ! "నా వల్ల మీకు చాలా కష్టాలు వచ్చాయి. ఈ వంశానికి కీడు తెచ్చిన నాలాంటి పాపాత్ముడి తల నఱికి వెయ్యడమే సరైన పని. నువ్వేదో దయ దలిచి ఆ పని చెయ్యలేదు. నేనిప్పుడే అడవులకి పోతాను. మీరందరూ సుఖంగా ఉండండి. పిఱికివాణ్ణి, బలహీనుణ్ణి రాజుగా చెయ్యడం తగునా? ఆ భీముడికే పట్టం కట్టెయ్యండి", అని ధర్మరాజు తన పక్క దిగి అడవులకి ప్రయాణం కడతాడు! ఓరినాయనోయ్! ఇదెక్కడి గొడవరా అనుకొని ఉంటాడు కృష్ణుడు. ఏం చేస్తాడు. వెళ్ళి తనే స్వయంగా ధర్మరాజు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. "ధర్మరాజా, నేను చెపితేనే అర్జునుడు నిన్నలా అన్నాడు తప్పిస్తే నిజంగా కాదు. నీ కాళ్ళు పట్టుకొని శరణంటున్నానయ్యా, మా ఇద్దరి తప్పూ మన్నించు. నీకు అమితానందం కలిగేటట్టు ఇప్పుడే వెళ్ళి ఆ కర్ణుడిని చంపివస్తాము." అని ప్రార్థిస్తాడు. స్వయంగా పరమాత్ముడైన ఆ కృష్ణుడు ధర్మరాజు కాళ్ళ మీద పడి ఇలా వేడుకుంటాడు! అప్పటికి ధర్మరాజు మనసు శాంతిస్తుంది. ఇవాళేదో నాకు వికారం పుట్టి ఇన్ని మాటలన్నాను, క్షమించమని తిరిగి వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడతని అనుజ్ఞతో కర్ణ సంహారానికి బయలుదేరుతారు కృష్ణార్జునులు.

అదండీ కథ. కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకి ఎవరికివారు, తమ సంస్కారాన్ని బట్టి సమాధానాలు ఆలోచించుకోవలసిందే! :-)

పూర్తిగా చదవండి...

Monday, March 29, 2010

భవిష్యత్తు

ఈ రోజు నిశ్యాలోచనాపథం ఫేం సౌమ్యగారి గూగుల్ బజ్ చూడగానే నాకీ కవిత గుర్తుకు వచ్చింది! ఇది ఎవరిదో ఎక్కడిదో వివరాలు త్వరలో విడుదల :-)

భవిష్యత్తు
======

నడచుచున్న పథంబు కంటక శిలావృ
తంబు, కటికచీకటి పైన, దారిసుంత
నాకు దోచదు, లాగుచున్నదియు నన్ను
కాలశైవలిన్యావర్తగర్భమునకు

(నడుస్తున్న దారంతా ముళ్ళూ రాళ్ళూ. పైనంతా కటికచీకటి. దారి ఏమాత్రం కనబడటం లేదు. కాలమనే నది నీటి సుడిలోకి నన్ను లాగుతున్నట్టుగా ఉంది.)

సురిగిపోయితి నంచు నెంచుకొనులోన
ముందు దూరాన కనవచ్చె పురుషుడొకడు
శతసహస్ర మార్తాండ తేజస్సహితుడు
హృదయ బాధా నివారణ మదనమూర్తి

(పూర్తిగా ఆ సుడిలో మునిగిపోతున్నానని అనుకొనే లోపల ముందు అల్లంత దూరంలో ఒక పురుషుడు కనిపించాడు. వందవేల సూర్యుల తేజస్సుతో ఉన్నవాడు. గుండెలో బాధని తీర్చే అందగాడు.)

అతి ప్రయాసంబు మీద నే నతనియున్న
తావునకు బోయి పడితి, నతండ దేమొ
అంజనావనీధర మట్టు లతి భయంక
రాకృతి వహించె, నాకు భయంబు తోచె

(అతి కష్టమ్మీద నేనతను ఉన్న చోటుకి వెళ్ళి పడ్డాను. అదేమిటో, అతను నల్లని అంజనా పర్వతాకారంలో భయంకరంగా కనిపించాడు. నాకు భయం వేసింది.)

పరుగులెత్తి మిక్కిలి దూర మరిగి వెనుక
తిరిగి చూచితి, నా చిత్రపురుషుడేలొ
నన్నుగని శాంతముగ నిల్చి నవ్వుచుండె
నా కతని నవ్వు దోచె స్వప్నంబువోలె

(పరుగులు పెట్టి, చాలా దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసాను. ఆ చిత్రపురుషుడు ఎందుకో నన్ను చూసి శాంతంగా నిల్చుని నవ్వుతున్నాడు. అతని నవ్వు ఏదో స్వప్నంలాగా అనిపించింది నాకు.)

వివిధ సూచీముఖోపలవిషమమైన
మార్గమున బోవుచుంటిని మరల నేను
ఇటుల జూతునుగద, ముందు నీ పురుషుడె
అతి మనోహరమూర్తి నన్నాహరించి

(ఎన్నో సూదుల్లాంటి మొనలున్న రాళ్ళతో నిండి నడవడానికి కష్టంగా ఉన్న త్రోవలో మళ్ళా పోతున్నాను. ఇటు తిరిగి చూసేసరికి ముందు ఆ పురుషుడే, ఎంతో మనోహరమైన మూర్తితో నన్ను ఆకర్షిస్తూ!)


పూర్తిగా చదవండి...

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండంకరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖంశరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

ఇది తెలుగువాళ్ళకి చాలందికి పరిచయమైన శ్లోకమే, కనీసం మొదటి పాదం. ఇది భద్రాచల ఆలయంలో గర్భగుడికి ముందు గది గోడపై ఉంటుంది కూడాను. ఈ శ్లోకం శ్రీరామకర్ణామృతంలోనిది అని ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇది వ్రాసింది ఆది శంకరాచార్యులవారని అంటారు. ఇదే నిజమైతే శంకరాచార్యూలవారి కాలానికే భద్రాద్రిపై శ్రీరాముడు వెలశాడని అనుకోవాలి! ఏదైతేనేం ఆ భద్రాద్రి రాముని రూపాన్ని వర్ణించే చక్కని ధారాసారమైన శ్లోకమిది. శ్రీరామకర్ణామృతాన్ని సిద్ధయోగి అనే అతను తెలుగులోకి మొట్టమొదట అనువదించారని చెప్తారు. ఇతనెవరో ఏ కాలానికి చెందినవారో నాకు తెలియదు. పై శ్లోకానికి అతని అనువాదం:

శరచాపాబ్జరథాంగముల్ కరచతుష్కప్రాప్తమైయుండ సు
స్థిర వామాంకమునందు సీత నియతిన్ సేవింప భద్రాద్రిపై
నిరదైనట్టి సరోజనేత్రు బలు యోగీంద్రేంద్ర సంస్తోత్రు భా
సుర కేయూరవిభూషణున్ దలచెదన్ శుద్ధాంతరంగమ్మునన్

ఇక్కడ అబ్జమంటే శంఖం, రథాంగం అంటే చక్రం. విల్లు, బాణము, శంఖము, చక్రము నాలుగు చేతుల్లో వెలుగుతూంటే, ఎడమతొడపై కూర్చుని ఉన్న సీతతో కేయూరాది భూషణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భద్రాద్రి కొండకొనపై వెలసి ఉన్న రాముని నీలమేఘశ్యాముని మనసారా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.


ఇంక, అంతటి భాషాపటిమ నాకు లేకపోయినా, నాకు వచ్చిన భాషలో రాముని గూర్చి చాన్నాళ్ళ క్రితం నేను వ్రాసిన పద్యాలు కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మరోసారి ఇక్కడ తలచుకుంటున్నాను:

"శ్రీరామా!" అని భక్తిన్
నోరారగ బిల్చినంత నుప్పొంగె మనో
వారాశి, కురిసె నమృతము
పారిన కన్నీటి సుధలు పద్యములయ్యెన్

నీ నామము నెమ్మనమున
నే నీమముతో స్మరింతు నిత్యము శ్యామా!
నానాటి జీవితమ్మిది
నీ నైవేద్యమ్మొనర్తు నిర్గుణధామా!

కలలోననైను నిన్నే
తలచే సౌభాగ్యగరిమ తక్క మరేదీ
వలదింక నాకు వరదా
కొలువై నీవుండ గుండెగుడిలో స్థిరమై!

ఆ రావణు బరిమార్చిన
ధీరోదాత్తుడవు నీవు, దీనుడ నేనున్
నా రాక్షసగుణముల సం
హారము గావించి బ్రోవవయ్యా రామా!

ఒకరికి తల్లివి తండ్రివి
ఒకరికి నువు బిడ్డవౌదు వొకరికి తోడున్
ఇక మరి నాకేమౌదువు
సకలము నీవే యటంచు స్వామీ కొలువన్!

నినునెన్నడు గనలేనని
మునుపెన్నడొ భాధపడుచు మూల్గితి గానీ
నను నేనే కనలేనని
కనుగొంటిని నేడు తుదకు కనువిప్పయ్యెన్!

నీలోపల నేనుంటినొ
నాలోపల నీవు దాగినావో యేమో
యేలాగున తెలియునురా
లీలా మానుష విలాస శ్రీరఘురామా!


పూర్తిగా చదవండి...

Wednesday, February 17, 2010

చుక్క గుర్తు పద్యాలు!

రమణగారు తన "చిన్ననాటి తెలుగు పద్యాలు" పోస్టుతో నన్ను మళ్ళీ నా చిన్నప్పటి స్కూలు బెంచీ మీదకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టేసారు! ఎదురుగా మా సుబ్బలక్ష్మీ టీచరు ఖంగుమనే గొంతుతో పాఠం చెపుతూ కనిపించారు, వినిపించారు. అల్లరి పిల్లలనీ, సరిగా చదవని వాళ్ళనీ "దొమ్మరగొండు రాస్కెల్స్" అని తిట్టినా, పాఠం మాత్రం ఆసక్తికరంగా చెప్పేవారు. మా అదృష్టం కొద్దీ ఎనిమిది, తొమ్మొది, రెండేళ్ళూ ఆవిడే మాకు తెలుగు టీచరు. ఆ పాఠాల మహత్వమో, ఆవిడ చెప్పడంలోని గొప్పతనమో కాని, అప్పుడు చదువుకున్న చాలా పద్యాలు మనసులో అలా ఉండిపోయాయి. చిన్నప్పడు కలిసి తిరిగి ఆడుకున్న మిత్రులు పెద్దయ్యాక ఎదురుపడితే ఆ చిన్ననాటి మధుర స్మృతులు అగరొత్తుల సువాసనలా కమ్ముకున్నట్టు, ఆ పద్యాలు అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటాయి.

రమణగారి టపాతో ఇదిగో మళ్ళీ ఇప్పుడు పలకరించాయి. నేను కూడా వారు చదువుకున్న పాఠాలే చదువుకున్నాను. వారు చెప్పినట్టుగా తొమ్మిదవ తరగతి పుస్తకం చాలా బావుండేది. అందులోనూ అది నాకు మరీ ప్రత్యేకం. మా ముత్తాతగారి కథ "ఎవరు గొప్ప" గద్యభాగంలో ఉండేది. ఆ సంగతి స్నేహితులతోనూ, మా టీచర్ తోనూ చెప్పుకొని పొంగిపోవడం, అదో గొప్ప అనుభూతి. తాతలు తాగిన నేతులని స్వయంగా వాసన చూడ్డం అనవచ్చేమో దీన్ని! :-)

రమణగారిచ్చిన పద్యాలకి, నాకు గుర్తున్నవికూడా కలిపి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. నాకు గుర్తులేని మిగతా పద్యాలు ఇంకెవరికైనా గుర్తుంటే చెప్పండి. అవికూడా కలుపుతాను. ఇవి ఎనిమిది, తొమ్మిది, బహుశా పది క్లాసుల పద్యభాగాలలోని చుక్క గుర్తు పద్యాలు.

ప్రాయోపవేశం
=========

ఇది మహాభారతం అరణ్యపర్వం, ఎఱ్ఱన రచించిన భాగంలోనిది. దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేత పట్టుబడి భీమార్జునుల చేత విడిపించబడి, ఆ అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాననే సందర్భం.

అక్కట యమ్మహారణమునందు వియచ్చరకోటితోడ బే
రుక్కున బోరి యేను మృతినొందగ నేరన అట్టులైన నీ
తక్కువబాటు లేక ప్రమదంబున దైవపదంబు నొందెడిన్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై

అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా
ర్ణవమది యింకినన్ దివసనాథుడు జంద్రుడు తేజమేదినన్
కువలయనాథ నీకునొక కుత్సితభావము గల్గ నేర్చునే
భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే

కౌరవనాథ నీకు నుపకారము చేసిరి పాండవేయు ల
వ్వీరులయందు నెయ్యమును వేడ్కయునొప్పగ నీ వభీష్ట స
త్కారము సేత యుక్తమగుగాక ప్రియంపడ నర్హమైనచో
దారుణ శోకవహ్ని పరితాపము బొందుట యిప్డు ధర్మమే

కృతముదలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి స
న్మతుల బృథాతనూజుల నమానుషతేజుల బిల్వపంచి తత్
పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగనిమ్ము నీకు నీ
క్షితివలయంబునన్ బరమ కీర్తియు బుణ్యము గల్గు భూవరా!

పార్వతి తపస్సు
==========

ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండంలోది. పార్వతీదేవి శివునికోసం తపస్సు చెయ్యబూనడం సందర్భం.

ఎక్కడలేరె వేల్పులు సమీప్స్తిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోరవీర తపమెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీష పుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా

భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా
రాధన కేళి కౌతుక పరాయణయై ధరియించి బాండు ర
క్షాధృతి పూర్వకంబుగ బ్రగాఢ పయోధరమండలీ సము
త్సేద విశీర్ణ సంహతుల జెల్లు మహీరుహవల్కలంబులన్

రాజధర్మము
========

ఇది మహాభారతం సభాపర్వంలోనిది. నన్నయ్య కృతం. రాజసూయం సందర్భంగా నారదుడు వచ్చి, ధర్మరాజుకి రాజధర్మాన్ని బోధించే ఘట్టం.

కడు జనువాడునై పురుషకారియు దక్షుడునైన మంత్రి పెం
పడఱగ రాజపుత్రుల మహాధనవంతుల జేసి వారితో
నొడబడి పక్షమేర్పడగ నుండడుగా ధనమెట్టివారికిన్
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యుకోటికి ననూనముగా దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్

వార్తయందు జగము వర్తిల్లుచున్నది
అదియులేని నాడు అఖిల జనులు
అంధకారమగ్ను లగుదురు కావున
వార్త నిర్వహింప వలయు బతికి

రాయబారము
=========

ఇది మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రసిద్ధమైన రాయబార సన్నివేశం. తిక్కన రచన.

జలదస్వన గంభీరత
నెలుగొప్పగ దంతదీప్తు లెసగ ముకుందుం
డలరు చెవుల నఖిల జనం
బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్

భరతకులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు పెంపునున్
గరుణయు గల్గియుండు ననగా నుతిగన్నది యందు సద్గుణో
త్తరులగు నీవు నీ యనుగు తమ్ముడు నీ తనయుల్ యశోదురం
ధర శుభశీలు రీ సుచరితక్రమ మిప్పుడు దప్పనేటికిన్

వీరునువారు బండితులు విక్రమవంతులు బాహుగర్వ దు
ర్వారులు లోని రిత్తబవరంబున నాఱడి జావబోవ నె
ట్లూరకయుండ్వచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదువుల్
గూరగ నాటినన్ బుడమి కూలుట కక్కట యోర్వవచ్చునే!

సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే
పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్

ఇందీవరాక్షుని వృత్తాంతం
===============

ఇది అల్లసాని పెద్దన రచించిన స్వారోచిష మనుసంభవం (మనుచరిత్ర) లోనిది. ఇందీవరాక్షుడనే గంధర్వుడు శాపవశాత్తూ రాక్షసుడయిన కథ. శాపవిమోచనం అయ్యాక స్వయంగా తను స్వరోచికి చెప్పేది.

కలడుల్లోక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్
నలనాబాహ్వయుడే దదీయ తనయుండన్ బ్రహ్మమిత్రుండు శి
ష్యులకున్ గంటను వత్తిబెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొ
ద్దుల జెప్పన్ వినుచుండి మానసమునందున్ దజ్జిఘృక్షా రతిన్

నటవిట గాయక గణికా
కుటిల వచశ్శీధు రసము గ్రోలెడు చేవికిన్
గటువీ శాస్త్రము వలది
చ్చట నిను చదివించకున్న జరగదె మాకున్

తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు బ్రార్ధించినన్
గండ్రల్గా నటులాడి ధీకృతుల పోకాల్మంటి వోహో! మదిన్
దీండ్రల్ గల్గినవాని కేకరణినేనిన్ విద్య రాకుండునే
గుండ్రాడాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ గష్టముష్టింపచా!

అనినం గన్నులు జేవురింప నధరంబల్లాడ వ్రేల్లత్పునః
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
జినుకన్ గంతు దిదృక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళధ్వనిన్

భాస్కరా!
======

ఇవి భాస్కర శతకంలోని పద్యాలు.

చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా

ఉరు గుణవంతుడొండు తనకొండపకారము సేయునప్పుడుం
పరహితమే యొనర్చు నొక పట్టునైనను కీడు సేయగా
నెరుగడు నిక్కమే కద యదెట్లన కవ్వము బట్టి యెంతయున్
తరువగ జొచ్చినం పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా

ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దా
జక్కనొనర్ప కౌరవులసంఖ్యులు బట్టిన ధేనుకోటులం
జిక్కకనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవొడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలము తొలంగెనేని తనపాలిట శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చుతరి సఖ్యముజూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పడె గాలి భాస్కరా

దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో
నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
బూనును మేఘుడంబుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే
వాన సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!

తనకు ఫలంబు లేదని యెదం దలపోయడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా!

పోతన జిజ్ఞాస
=========

ఇది శ్రీ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రములోనిది. ఇది చాలా మంచి ఘట్టం. పోతన వీథి భాగవతం చూస్తూ తనకి కలిగిన సందేహాలని తల్లిని అడుగుతాడు. ఆవిడ ఆ ప్రశ్నలకి గొప్ప తాత్త్వికమైన జవాబులిస్తుంది. పోతన భక్తి తత్త్వాలకి చిన్ననాడే ఎలా బీజాలు పడి ఉంటాయో ఊహించి చెప్పే సన్నివేశం. ఇందులో చివరగా పోతన, దీన్ని వీథి భాగవతం అని ఎందుకంటారని అడుగుతాడు తల్లిని. ఈ కథలు భాగవతంలోనివి కాబట్టి అని జవాబు చెపుతుంది. అయితే నేనా పుస్తకం చదువుతాను ఇమ్మంటాడు. అది సంస్కృతంలో ఉంది నాయనా మనకి అర్థం కాదని అంటుంది. అప్పుడు పోతన, "అయితే నేను పెద్దయ్యాక దాన్ని తెలుగులో వ్రాస్తాను" అంటాడు. దానికి తల్లి ఎంతో మురిసిపోయి "మా తండ్రే, మా నాయనే" అంటుంది!


ఇవ్విధి దివ్విటీల్వెలుగు లేమని బాలుడు పృచ్ఛసేయగా
నవ్వుచు లక్కమాంబ నిజనందను గన్గొని చంద్రసూర్యు లా
దవ్వుల వెల్గనేలయనె దాపున నా తెర యేల యన్నచో
నివ్వటిలుం బయిన్ మసక నీలపునింగి యదేలరా యనెన్

ధీనిదివై సతమ్మఖిల దేవతలొక్కటి యంచు నెంచుచున్
మానసమందుమారమణు మాటికి మాటికి సంస్మరింపనౌ
దా ననలమ్ము వృక్షసముదాయ విభేదము లూడ్చు కైవడిన్
జ్ఞానము రూపభేదము లొకండొనరించు నసంశయాకృతిన్

బుద్ధదేవుని పునరాహ్వానం
================

ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి రచన. ఎందులోనిదో గుర్తులేదు. ఇందులో పద్యాలు పూర్తిగా గుర్తు లేవు :-(

దయసేయంగదవయ్య శాక్యమునిచంద్రా! నీ పదస్పర్శచే
గయిసేయంగదవయ్య భారతమహీఖండంబు దివ్యత్ కృపా
మయ మందార మరంద బిందు లహరీ మందస్మితాలోకముల్
దయసేయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారగన్

ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు సద్భావమే
మోటైపోయెను పంచశీలపథకమ్ముల్ దుమ్మువట్టెన్ దురా
శాటోపంబులు హద్దుమీరినవి పోరాటమ్మె ఆరాటమై
లూటీచేసిరి మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!

హింసాశక్తులు రక్తదాహమున దండెత్తెన్ దరిద్రప్రజా
సంసారమ్ములపై...
కిరాతశాత శరవిద్ధంబైన ఇద్ధారుణీ
హంసన్ గాయముమాన్పి కావవలెనయ్యా రమ్ము వేగమ్ముగన్

యుద్ధజ్వాలలు రేగె భీతిలి జగమ్ముయ్యాలలూగెన్ రుషా
కృద్ధ వ్యాఘ్రము గాండ్రుగాండ్రుమనుచున్ గ్రొన్నెత్తురుల్ ద్రావె ...
...
సిద్ధార్థా ప్రళయాగ్నులార్పవె ప్రజాశ్రేయమ్ము చేకూర్పవే!


శివాజీ సౌశీల్యం
==========

ఇది శ్రీ గడియారం వేంకటశాస్త్రిగారు రచించిన శివభారతములోనిది. శివాజీ సౌశీల్యాన్ని చాటిచెప్పే ఘట్టం. ఇందులోని పద్యాలు కూడా గుర్తులేవు :-( ఒక పద్యం మాత్రం ఇలా మొదలవుతుంది:

అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నాస్పందితోష్ఠంబుతో
ఘన హుంకారముతో నటత్ భృకుటితో గర్జిల్లు నా భోంశలే
శుని జూడన్...

ఇది ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఇది ఇందీవరాక్షుని వృత్తాంతంలో "అనినన్ గన్నులు జేవురింప..." అనే పద్యానికి చాలా దగ్గరగా ఉండే పద్యం, ఆ వర్ణన పరంగా. బహుశా గడియారంవారికి అల్లసాని పద్యమే స్ఫూర్తి అయ్యుండాలి. తమాషాగా ఆ రెండిటినీ ఒకే ఏడు పాఠంగా పెట్టారు!

ఇవి నాకు గుర్తున్న పద్యాలు. ఇవిగాక ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు. అవి అన్ని పద్యాలూ చుక్క గుర్తు పద్యాలే! అన్నీ గుర్తున్నాయి. అవి పద్యం.నెట్లో ఇంతకుముందు పెట్టినట్టు గుర్తు.

రమణగారు, చిన్ననాటి జ్ఞాపకాలని మరోసారి గుర్తుకుతెచ్చినందుకు ధన్యవాదాలు!

నా మిత్రుడు మరొక పాఠం గుర్తుచేసాడు.

స్వయంవరం
========

మొల్ల రామాయణంలో సీతాస్వయంవర సన్నివేశం.

గురుభుజశక్తి కల్గు పదికోట్ల జనంబును బంప వారునా
హరుని శరాసనంబు గొనియాడుచు బాడుచు గొంచువచ్చి సు
స్థిరముగ వేదిమధ్యమున జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధమక్షతలు వేడుకనిచ్చిరి చూడనొప్పగన్

కొంకక సావధానమతి గూర్చి వినుండిదె మత్కుమార్తెకై
యుంకువ సేసినాడ వివిధోజ్వలమైన ధనంబు గాననీ
శంకరు చాప మెక్కిడిని సత్త్వఘనుండగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత నరపాలకులార నిజంబు సెప్పితిన్

కదలకుమీ ధరాతలమ కాశ్యపిబట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులనుబట్టు కూర్మమ రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కిడున్

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప మునీశ్వరుండలర కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరి ఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్


పూర్తిగా చదవండి...

Friday, February 12, 2010

విశ్వేశ్వరా!

మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథవారి విశ్వేశ్వరశతకం నుండి కొన్ని పద్యాలు:

శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానంద వ
ల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్ష ల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా!

కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి త
త్ప్రాలేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతం
బాలోలాగ్ర జటావనీ ఘటిత నాకౌకస్సరిత్కంబు దే
హాలంకారిత లేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా!

కరితోల్పుట్టముకొంగుతో బునుక భిక్షాపాత్ర చేబూని సం
స్కరణం బించుక లేమి మై జడలు మూగన్ బొట్ట పెల్లాకటన్
సురుగున్ ముమ్మొనకర్రతో దడుముకొంచున్ లచ్చి గేహంబు ముం
దర నిల్పున్ భవదీయ భిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా!

ఓ సామీ! అల కొండకోయెతకు నీ యొయ్యారమో బూదిపూ
తే సర్వంబయి నీకు నాయమ సొబంగే నచ్చి కన్నారు ర
య్యా! సంతానము నేన్గుమోమొకడు వింతౌ నార్మొగాలొక్కడో
హో! సౌరాపద కాకరుండొక డదేమో కాని విశ్వేశ్వరా!

దివ్యజ్యోతివి నీకు బెల్లుబుకు భక్తిన్, జాటజూటాగ్ర చా
రువ్యాబద్ధ పవిత్ర దైవతధునీ! రుద్రాభిషేకంబొగిన్
నవ్యశ్రీగతి జేయగా నమకమైనన్ రాదుగా హూణ వా
క్కావ్యామోదము ముక్తిత్రోవెదురుచుక్కైపోయె విశ్వేశ్వరా!

ఈ సంసారము చేత నిల్లొడలు గుల్లే కాని లేదేమి మి
ధ్యా సౌఖ్యంబనిపించు దుఃఖమయ జన్మానేక మూహింపగా
సీసీ పో యనుగాని వానిపయినే చిత్తంబు లగ్నంబగున్
భాసాభాసము నీదు చిన్మయ ప్రభావజ్యోతి విశ్వేశ్వరా!

నా కే పూర్వజనుర్మహత్త్వముననో నా తండ్రి! నీ యీ పద
శ్రీ కంజాతములన్ దగుల్కొనియెబో చిత్తంబు దానన్ ననున్
జేకో బాధ్యత నీక యున్నయది తూష్ణీంభావ మేలా ప్రభూ!
నా కుయ్యింతయు నీ చెవిన్ జొఱద సంధ్యాధార! విశ్వేశ్వరా!

నేనున్ జేసిన పాపకర్మములు తండ్రీ! చెప్పగా రానివిన్
లోనన్ దల్పగనైన రానివి దయాలోకాంబుధారా ప్రవా
హానన్ క్షాళన చేసివైచెదవొ, లేదా రౌరవాగ్ని స్ఫులిం
గానీకంబుల నూరెదో రురువిషాణశ్రేణి విశ్వేశ్వరా!

ఆక్రోశించెద బాహులెత్తి ప్రభువా! ఆలింపవే! యేమి కా
మ క్రోధంబు లహో! ప్రమాణతను సంపాదించె నాయందు నీ
యక్రూరత్వము నీ వశిత్వమును నాయందింత పొందింపవే!
అక్రీతుండను దాసుడన్ శివశివా యన్నాను విశ్వేశ్వరా!

ఏనాడో శివ! దుఃఖసంసృతి మహాహీనాంబుధిన్ దాటి యెం
దో నేనొక్కడనే మహాగహనమందున్ నిల్చినీ తేజమున్
బ్రాణాయామమునందు జూచి "శివ! నిర్వాణైకమూర్తీ! నిరం
తానందైకమయస్వరూప!" యనుచున్ ధ్యానింతు విశ్వేశ్వరా!

ఆకర్ణించెద నేమియో ప్రమధ శంఖారావమో! జాట వీ
ధీకల్లోల తరంగ దేవతటినీ దీప్తారవంబో! కుభృ
చ్ఛ్రీ కన్యామణి పాదనూపుర మణిక్రేంకారమో! నన్నిదే
కైకో నీ వరుదెంతు వీ ధ్వని యదే కాబోలు విశ్వేశ్వరా!

నీవేమో కనిపించకుండినను గానీ యైన గన్పించి న
ట్లే వేలూహలుగాగ దెచ్చుకొని నీవే కాక లేడే కదా
దైవంబంచును నా కవిత్వము భవత్పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసగెదో రానిమ్ము విశ్వేశ్వరా!

నిను గ్రొంగొత్తలు తేర్చు గుంఫనల వర్ణింపంగ నూహింతు నౌ
నని యే దారినిబోయి పూర్వకవి పాదాంకంబులే తోచి లో
నన లజ్జాపరిగూఢ మానసుడనై నాలోన నేనే వినూ
తనశంకా హృదయుండనౌదు మఱి క్షంతవ్యుండ విశ్వేశ్వరా!

ఆనందైకమయస్వరూప! భవదీయైశ్వర్యమున్ ధూర్జటి
శ్రీనాథుల్ కవితాసతీ కుచతటీ శ్రీగంధ కస్తూరికా
స్థానంబున్ బొనరించి రిప్పటికి నస్మత్ స్తోత్ర పాత్రంబవై
తేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె విశ్వేశ్వరా!


పూర్తిగా చదవండి...

Friday, February 5, 2010

చంద్రునికో నూలుపోగు

కిందటి టపాలో నా పద్యంలో, చంద్రబింబాన్ని అలసి వెలవెలబోతున్న సూర్యుని ప్రతిబింబంగా వర్ణించడాన్ని ఆ చంద్రుని తరఫున చంద్రమోహన్ గారు తీవ్రంగా ఖండించారు :-) అదీ పద్యంలో! పైగా నేను చంద్రునిపై మంచి పద్యాన్ని వ్రాస్తే గానీ వారి మనోభావాలు శాంతించవని కూడా హెచ్చరించారు! తమ పేరింటివారి మీద ఆ మాత్రం అభిమానం సహజమే. కాని వారి కోరిక విని నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఎందుకంటే మన కావ్యాలలో అందరికన్నా ఎక్కువగా, అందంగా వర్ణించబడింది బహుశా చంద్రుడే! అలాంటి చంద్రునిపై పద్యం వ్రాయాలంటే మాటలా?

చంద్రుని మీద పద్యం అనగానే నాకు గుర్తుకువచ్చిన పద్యం పెద్దన మనుచరిత్రలోనిది. చంద్రుని గురించి అంత అందమైన పద్యం మరొకటుందా అనిపించేంత చక్కని పద్యమది.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొర జోడు రేవెలుంగు

"కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి" - స్థూలంగా చూస్తే, "పాలసముద్రమునుంచి పుట్టినవాడు ఎవడో అతడు" అని అర్థం, అంతే! ఇందులో కవిత్వమేముంది? అని పెదవి విరిచేస్తే ఏమీ లేదు! సూక్ష్మంగా పరికిస్తే చాలా ఉంది. ఈ పద్యం మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. మనుచరిత్ర కృతిభర్త మరెవరో కాదు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. అతని వంశాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు పెద్దన్న. కృష్ణదేవరాయలు తుళు వంశానికి చెందిన రాజు. ఈ తుళువంశం చంద్రవంశం. అంటే ఈ వంశానికి ఆదిపురుషుడు చంద్రుడన్న మాట! ఆ చంద్రుని వర్ణనతో ఆ వంశ ప్రశంసని ప్రారంభించాడు. పెద్దనకి కృష్ణదేవరాయలపైనున్న అభిమానం అంతా ఇంతా కాదు! అలాంటి రాయల వంశ మూలపురుషుణ్ణి వర్ణించడమంటే పెద్దనగారి మనసులో ఉత్సాహం ఉప్పొంగి ఉండాలి. అందుకే ఇలాంటి పద్యం జాలువారింది. అసలీ పద్యంలో స్వయానా ఆ రాయలనే కీర్తిస్తున్నాడా అనికూడా నాకు అనిపిస్తుంది.

సీస పద్యం ఒకో పాదంలోనూ చంద్రుని ఒకో గొప్పతనాన్ని వర్ణించాడు. చంద్రుని వంశోన్నతిని చాటుతున్నది మొదటిపాదం. అయితే ఇందులో మంచి చమత్కారాన్ని చేశాడు పెద్దన. చంద్రుడు ఫలానా పాలసముద్రపు కొడుకు అని అన్నాడా? లేదు! కలశపాథోరాశి అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రం మధ్యలోనున్న, "వీచి మతల్లి". మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. వీచి అంటే అల. వీచిమతల్లి అంటే ఒక గొప్ప/పెద్ద అల. పాలసముద్రం మధ్యనున్న ఒక గొప్ప అల ఎవని కన్నతల్లో అతను చంద్రుడుట! సముద్రుణ్ణి మగవానిగా, చంద్రుడు లక్ష్మీదేవి మొదలైనవాళ్ళకి తండ్రిగా చెప్పడం సాధారణమైన విషయం. కాని ఇక్కడ తల్లిని కూడా తీసుకువచ్చాడు పెద్దన. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మధ్యలో తరంగాలు ఏర్పడి ఉంటాయి కదా. అలాంటి ఒక ఉన్నతమైన, ఉత్తుంగమైన తరంగంనుంచి ఉద్భవించాడట చంద్రుడు. అంతే కదా మరి! ఉన్నట్టుండి అలా సముద్రంలోంచి హఠాత్తుగా పుట్టలేదు కదా చంద్రుడు. సముద్రాన్ని మథించినప్పుడు, అందులోంచి పుట్టిన అలల నురగ గడ్డగట్టి, ఆ మథన వేగానికి పైకి కొట్టబడి చంద్రుడు ఉద్భవించి ఉండాలి. ఇంత కథనీ గుర్తుచేస్తూ చంద్రుని పుట్టుక ఎంత గొప్పదో ధ్వనింపజేస్తోంది ఈ వర్ణన. పదాల పొందిక సరేసరి!

"అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు" - మళ్ళీ ఆ పదాల పొహళింపు చూడండి! తెలుగుభాషలోని అనుప్రాస సౌందర్యమంతా మొదటి మూడు పదాలలోనూ నింపేసాడు! అనలాక్షుడంటే నిప్పుకంటివాడు, శివుడు. అతని ఘనమైన జడలనే తోటకి వెన్నె తెచ్చే పువ్వుట చంద్రుడు. పైగా అలాంటిలాంటి పువ్వుకూడా కాదు. అనావర్తవంపు పువ్వు. అంటే అన్ని ఋతువులలోనూ కూడా పూసేపువ్వని అర్థం. ఏ ఋతువులోనైనా చందమామ ఆకాశంలో అలా వెలుగుతూనే ఉంటాడు కదా! పైగా మనకంటే ఒక పదిహేను రోజులు క్షీణిస్తున్నట్టు కనిపిస్తాడు కాని శివుని జటాజూటంలో ఎప్పుడూ వెన్నెలలు చిలికిస్తూనే ఉంటాడాయె. ఈ పాదంలో చంద్రుని ఔన్నత్యం, నిరంతర వైభోగం ధ్వనింపజేసాడు పెద్దన. అంతటి ఔన్నత్యం వైభోగం రాయలకి మాత్రం లేవా?

"సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు పుట్టుగానని మేని మెట్టపంట" - ఈ పాదంలో చంద్రుని సంపన్నత, దాతృగుణం వర్ణింపబడ్డాయి. సకల దేవతల ఆకలినీ కూడా తీర్చే మెట్టపంట చంద్రుడు. చంద్రుడు కురిపించే సుధ/అమృతం దేవతల ఆహారం కదా. పైగా అతనిది "పుట్టుగానని మేను". అంటే ఆ మెట్టపంట ఎవరూ నాటకుండానే స్వతస్సిద్ధంగా పండినదన్న మాట. అంచేత ఇది కూడా ఋతుసంబంధి కాదు. నిరంతరం ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది.

"కటికిచీకటి తిండి కరముల గిలిగింత నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు" - ఇందులో చంద్రుని సరసత్వం వర్ణించాడు పెద్దన. కటికచీకటిని తినే చేతుల గిలిగింతతో, తొగ కన్నెని - అంటే కలువ కన్నెని, నవ్విస్తాడు చంద్రుడు. చంద్రకిరణాలు చీకటిని హరించి కలువకన్నెకి ఆనందాన్ని కలిగిస్తాయని భావం. ఇందులో "కటికి చీకటితిండి కరములు" అన్న సమాసం దుష్టసమాసం. పైగా విచిత్రమైన ప్రయోగం కూడాను! కటికచీకటిని తినే చేతులు అని చంద్రకిరణాలని వర్ణించడంలో మరి వేరే ఉద్దేశం కూడా ఏమైనా ఉందేమో నాకు తెలీదు.

"నతడు వొగడొందు మధుకైటభారి మఱది" - పైన చెప్పిన గొప్పతనమున్న చంద్రుడు స్వయానా మధుకైటభారి మఱది, అంటే విష్ణువు బావమఱది. బంధుత్వంలో కూడా చంద్రుని గొప్పతనాన్ని చెపుతున్నాడిక్కడ. "కళల నెలవగువాడు" - పదహారు కళలకి నెలవైనవాడు. రాయల కళావైదుష్యం ఇక్కడ ధ్వనిస్తోంది. చుక్కలకు రాజు. చంద్రుని/రాయల దక్షిణ నాయకత్వం స్ఫురిస్తోందిక్కడ. "మిసిమి పరసీమ" - మిసిమి అంటే మిలమిలా మెరిసిపోయే కాంతి. దానికి పైహద్దు చంద్రుడు. అంటే అంతకన్నా మెరిసే కాంతి మరెవ్వరికీ లేదని. ఇది రాయల కీర్తిని ధ్వనిస్తోంది. కీర్తిని వెలుగుతో పోల్చడం కవిసమయం. "వలరాజు మేనమామ" - మన్మథునికి స్వయానా మేనమామ. అంటే మన్మథుని అందమంతా ఇతనిలోనూ ఉందని అనుకోవచ్చు. ఇది కృష్ణరాయల సౌందర్యాన్ని ధ్వనిస్తోంది. "వేవెలుంగులదొర జోడు రేవెలుంగు" - వేయి వెలుగులున్న ఆ సూర్యునికి సరిజోడు, ఇతను రాత్రి వెలుగేవాడు అని. అంటే చంద్రవంశం సూర్యవంశానికి ఏమాత్రం తీసిపోని సరిజోడు అని అర్థం వస్తుంది.

ఇంతకన్నా అందంగా సమగ్రంగా చంద్రుణ్ణి మరెవరైనా వర్ణించారేమో నాకైతే తెలియదు. అలా చేస్తూ, కృష్ణరాయల గొప్పతనాన్ని కూడా ధ్వనింపజెయ్యడం పెద్దన ధురీణత. అతనికి రాయలమీదనున్న అభిమానానికి నిదర్శనం. ఈ "కలశపాథోరాశి" అనే ఎత్తుగడకి ప్రేరణ బహుశా క్రీడాభిరామంలో పద్యం అయ్యుండవచ్చు. ఆ పద్యం కూడా చంద్రస్తుతే.

చంద్రునిపై ఇంత పెద్ద పద్యం, ఇంత అందమైన పద్యం గురించి వివరించినా చంద్రమోహన్ గారు శాంతిస్తారని నమ్మకం లేదు :-) నన్ను స్వయంగా ఒక పద్యం వ్రాయమని ఆదేశీంచారు కదా! అంచేత ఆ చంద్రునికో నూలుపోగుగా నేనూ ఒక పద్యాన్ని ప్రయత్నించాను:

స్నేహరసార్ద్రయౌ జనని నిత్యము తండ్రి రుషాకషాయతన్
దా హృది నింకజేసుకు సుధామయ ప్రేమను జిల్కునట్లుగా
దాహకరోష్ణ తీక్ష్ణ కరధారను చల్లని వెన్నెలేరుగా
మోహన చంద్రబింబమ! అమోఘముగా ప్రసరింపజేతువే!


పూర్తిగా చదవండి...