తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, December 29, 2009

గరికిపాటివారి శతావధానం సంపూర్ణం

గరికిపాటివారి శతావధానం దిగ్విజయంగా పూర్తయ్యింది. ఈ అవధానం పుణ్యమా అని ఈసారి అసలు ఊరు వెళ్ళివచ్చినట్టే లేదు. ఉన్న మూడు రోజులూ మూడు గంటల్లా గడిచిపోయాయి! ఉదయాన్నే ఎనిమిదిన్నరకల్లా బయలుదేరి శతావధాన సభకి వెళ్ళడం. మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్నర దాకా సభ. తర్వాత భోజనాలు. ఒక గంట విశ్రాంతి. మళ్ళీ నాలుగుగంటలకల్లా సభ ప్రారంభం. రాత్రి ఇంచుమించు తొమ్మిది దాకా.

గరికిపాటివారు ఆశువుగా అనర్గళంగా పద్యాలు చదువుతూ ఉంటే, బాగా ఎత్తునుంచి పడే ఒక జలపాతం కింద నించొని ఆ నీటి ధారలో ఆపాదమస్తకం తడుస్తున్న అనుభూతి. ప్రేక్షకులని అయస్కాంతంలా ఆకర్షించగలిగే శక్తి అతని మాటల్లోనూ, మాట తీరులోనూ ఉంది. బహుశా మూడువందల మంది పట్టే ఆడిటోరియం అనుకుంటా, ప్రతి రోజూ నిండుగానే ఉండేది. చివరి రోజయితే చాలామంది జనాలు కూర్చునే చోటులేక నించునే ఉన్నారు! నేను ఒక పృచ్ఛకుడి కావడం వల్లనూ కాస్త స్థానబలిమి ఉండడం వల్లనూ గరికిపాటివారికి అతిదగ్గరగా కూర్చునే అదృష్టం లభించింది. అతనొక పద్యపాదాన్ని చెప్పి, ఎలా ఉందని చిద్విలాసంగా మా వైపు చూడడం, మేము మా ఆనందాన్ని మొహంలోనూ, ఒక తల ఊపులోనూ చూపిస్తూ ప్రతిస్పందించడం, సరదాగా విసిరే హాస్యోక్తులనూ ఉద్వేగంతో పలికే కఠినోక్తులనూ తాదాత్మ్యంతో చెప్పే మధురోక్తులనూ మేము కూడా సంతోషంతో ఉద్వేగంతో తాదాత్మ్యంతో వినడం - ఇలాంటి అనుభవం నిజంగా అదృష్టమే.

సహజంగా ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా రాష్ట్రంలో ఈనాడు నెలకొన్న పరిస్థితుల గురించిన అంశాలు వచ్చాయి. దీని గురించి గరికిపాటివారు చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాజకీయ పరిపాలనా కారణాల వల్ల విడిపోవలసిన అవసరం ఉంటే విడిపోవడంలో తప్పులేదు. అది సమస్య కాదు. ఎంతటి వైవిధ్యమున్నా భాషా సంస్కృతులు ఒకటేనన్న గ్రహింపు ఉండి, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఉండడం చాలా అవసరం. స్వార్థ రాజకీయశక్తుల వల్ల ఇది చెడిపోతోందని అతను చాలా ఆవేదన చెందారు. ఎక్కడబడితే అక్కడ సమైక్యాంధ్ర బ్యానర్ల మీద "సమైఖ్యాంద్ర" అని వ్రాసి ఉండడం సమైక్యాంధ్ర మాట దేవుడెరుగు, ముందు తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యాన్ని తనకి పదేపదే గుర్తుకుచేసిందని బాధపడ్డారు.

గరికిపాటివారికి ధారణా బ్రహ్మరాక్షసుడు అనే బిరుదు ఉంది కాని, అతను ధారలో కూడా బ్రహ్మరాక్షసుడే! ఒక సమస్య పూర్తి అయ్యీఅవ్వక ముందే పూరణ మొదటిపాదం అందుకోవడమంటే మరి మామూలువాళ్ళకి సాధ్యమా?! సరే ధారణ సంగతి చెప్పనే అక్కర లేదు. మొత్తం 75 పద్యాలను 32 నిమిషాలలో ధారణ చేసారు. అంటే ఒకో పద్యం ధారణ చెయ్యడానికి అరనిమిషం కూడా పట్టలేదన్న మాట! ఆ ప్రవాహ వేగం గురించి ఇంకా చెప్పేదేముంది! సాధారణంగా అవధానాలలో పద్యాలని ఎంత వేగిరం పూరిద్దామా అని చూస్తారు, వర్ణనలని కూడా. దీని వల్ల వీటిలో కవిత్వం పెద్దగా గుబాళించదు. కాని గరికిపాటివారికి ఈ విషయమై కాస్త తాపత్రయం ఎక్కువ. కాబట్టి కొన్ని చోట్ల ఆగి ఆలోచించడం జరిగింది. దాని ఫలితంగా కొన్ని అందమైన పూరణలు కూడా వచ్చాయి.

సమస్య, దత్తపదులు, వర్ణనలు, ఆశువులు అన్నీ కలిపి మొత్తం 101 పద్యాలు. ఇవన్నీ విజయభావనవాళ్ళు తమ బ్లాగులో పెడతారనుకుంటాను. పద్యప్రియులు వాటిని ఆస్వాదించవచ్చు. కొంత భాగం వీడియో తీసినట్టున్నారు కాని అది ఎప్పటికి వస్తుందో, ఇంటర్నెట్లో పెట్టగలనో లేదో తెలియదు.

ప్రస్తుతానికి, నేనిచ్చిన సమస్య ఇది:

భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

ఆసక్తి ఉన్నవాళ్ళు పూరించడానికి, గరికిపాటివారి పూరణని నా పూరణని ఇవ్వడం లేదు. ప్రయత్నించి చూడండి.


పూర్తిగా చదవండి...

Saturday, December 19, 2009

శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం

వచ్చే శుక్రవారంనుంచి ఆదివారం వరకు మూడు రోజులు (డిసెంబరు 25, 26, 27) మా విజయనగరంలో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం జరగబోతోంది. ఇందులో నేనూ ఒక పృచ్ఛకునిగా పాల్గొనబోతున్నాను. నేనిచ్చే అంశం సమస్య. ఈ ఏడాది జనవరిలో వారి అష్టావధానంలో పాల్గొన్నాను. ఇంచుమించు ఏడాదికి మళ్ళీ ఇలా వారి శతావధానంలో పాల్గొనడం నా అదృష్టం.

వందమంది పృచ్ఛకులతో జరిగేది శతావధానం అని చాలామందికి తెలిసే ఉంటుంది. నిర్వాహకులకి అష్టావధానం కన్నా శతావధానం కష్టం. వందమంది పృచ్ఛకులని సమకూర్చుకోవడం ఒక కష్టం. పైగా దీనికి పట్టే సమయం ఎక్కువ. ఇప్పుడు జరగబోయే అవధానం మూడు రోజులు! అయితే అవధానికి మాత్రం అష్టావధానం కన్నా శతావధానం కొంత సులువు. జ్ఞాపక శక్తి (ధారణ) గట్టిగా ఉంటే చాలు. మొత్తం వందమంది పృచ్ఛకులున్నా ఉండే అంశాలు మాత్రం నాలుగే. సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు. ఇందులో ఆశువుకి చెప్పే పాతిక పద్యాలూ మళ్ళీ ధారణ చెయ్యక్కరలేదు. అష్టావధానంలో ఉండే నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి వంటి అంశాలు కష్టమైనవి. పైగా అందులో పలురకాల విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి (ఘంటా గణనం/పుష్ప గణనం, వ్యస్తాక్షరి మొదలైనవి).
అయితే చూసేవాళ్ళకి శతావధానం రోజుకి ఎనిమిది గంటలు, మూడురోజులపాటు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో అభిరుచి ఉన్నవాళ్ళకి మంత్రముగ్ధమైన వాతావరణం అనిపిస్తుంది. అందులోనూ గరికిపాటివారు "ధారణా బ్రహ్మరాక్షసులు" అని అనిపించుకున్న వారాయె! అయితే అవధానం రక్తిగట్టడానికి పృచ్ఛకులు అడిగే ప్రశ్నలు కూడా బాగుండాలనుకోండి.

ఆసక్తీ వీలు ఉన్నవాళ్ళు, మూడు రోజులూ సెలవు రోజులే కాబట్టి, రావచ్చు. మరిన్ని వివరాలకి ఇక్కడ చూడండి: http://vijayabhavana.blogspot.com/2009/12/blog-post_5240.html


పూర్తిగా చదవండి...

Friday, December 4, 2009

ఛందస్సుతో నడక - 4

ఛందస్సుతో నడక మొదలుపెట్టినప్పుడు అది ఎన్నాళ్ళు ఎంత దాకా సాగుతుందో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియకుండానే ఉంది! :-) వృత్తాల గురించిన టపా అయిన వెంటనే తెలుగు ఛందస్సులకి (ఆటవెలది, తేటగీతి మొదలైనవి) దారి మళ్ళించ వచ్చనుకున్నాను. కాని దానికన్నా ముందు మరికొన్ని సంగతులు వివరించాల్సిన అవసరం ఉందనిపించిది. కిందటి టపాలో వృత్తాలలోనే భేదాలను (ఉత్పలమాల, మత్తకోకిల) గుర్తించే ప్రయత్నం చేసాను. తెలుగు ఛందస్సుల వైపు వెళ్ళడానికి ఇంకా మరికొంత సమయం ఉంది. మరికొన్ని విషయాలు ఇంకా ముచ్చటించుకో వలసినవి ఉన్నాయి.

కిందటి టపా వ్యాఖ్యలలో భా.రా.రె.గారు ఈ "తనన" గోల తనకి పూర్తిగా అర్థమైనట్టు లేదన్నారు. అంతకన్నా గణాల బట్టి (భరనభభరవ లాగా) వృత్తాన్ని గుర్తించడం సులువుగా ఉందన్నారు. వారలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మనకి చిన్నప్పుడు బాగా అలవాటైన పద్ధతి సులువుగా అనిపిస్తుంది. ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం, ఛందస్సు అసలుసిసలు స్వరూపం ఆ గణాలలోనే ఉందా, లేక మరేదైనానా అన్న విషయాన్ని ఆలోచించడం. ఛందస్సుని నిర్వచించడానికి "గణ" పద్ధతి మేలైనదా లేక "నడక" మేలైనదా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలంటే, ఛందస్సు చరిత్ర కొంచెం పరిశీలించాలి.

ఆ చరిత్ర పుటల్లోకి తొంగి చూసే ముందు, మీకొక చిన్న అభ్యాస ప్రశ్న (exercise). ఒక మూడు పద్య పాదాలకి మన గురు-లఘు గ్రాఫులు కింద ఇస్తున్నాను. ఆ గ్రాఫుల బట్టి ఆ మూడు పద్యపాదాలూ ఒకే ఛందస్సుకి చెందినవో కావో గుర్తించండి చూద్దాం:




పై గ్రాఫులు ఈ మూడు పద్యపాదాలవీను:

1. శుక్లాంబరధరం విష్ణుం
2. అగజానన పద్మార్కం
3. ఇదం తుతే గుహ్య తమం

గ్రాఫుల మధ్య ఎలాంటి పోలిక తెలియడం లేదు కదూ! అన్నట్టు ఇందులో విరామాలు కూడా లేవు. అది అచ్చంగా అక్షరాలలోని గురు-లఘువుల క్రమమే. ఈ శ్లోకాలతో పరిచయం ఉన్నవాళ్ళకి ఈ మూడూ ఒకటే ఛందస్సుకి చెందినవన్న విషయం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి, ఈ మూడూ ఒకటే ఛందస్సు - అది అనుష్టుప్! మరి ఒకటే ఛందస్సైతే ఆ మూడు గ్రాఫులు ఎందుకంత తేడాగా ఉన్నాయి (విరామాల గోల లేకున్నా కూడా)? దీనికి జవాబు చాలా తేలిక. అనుష్టుప్ ఛందస్సు వృత్తం కాదు కాబట్టి! వృత్తాల కైతే ప్రతి పాదంలోనూ గురు-లఘువుల క్రమం కచ్చితమై ఉంటుంది. అన్ని ఛందస్సులకీ అలా ఉండదు. సరే, పోనీ ఏమైనా repetetive patterns అన్నా ఉన్నాయా ఇందులో? ప్రతిదీ ఎనిమిది అక్షరాల పాదం, చివరి అక్షరం గురువు. ఇవే ఆ మూడిటిలో ఉన్న సామ్యాలు. అదే ఆ ఛందస్సు నిర్వచనం కూడాను! ఈ అనుష్టుప్ ఛందస్సు వృత్తాల కన్నా కూడా ప్రాచీనమైనది.

ఈ అభ్యాసం వల్ల మనకి తెలుస్తున్న విషయాలు ఏమిటంటే:
1. అన్ని ఛందస్సులూ వృత్తాలు కావు.
2. వృత్తాలు కాని ఛందస్సులకి గురు-లఘు గ్రాఫులు పెద్దగా ఉపయోగ పడవు
3. ప్రతి ఛందస్సుకీ గురు-లఘువుల pattern (అసలు ఎలాంటి repetetive pattern) ముఖ్యం కాదు

గురు-లఘువులు (లేదా మాత్రలు) ముఖ్యం కాని ఛందస్సులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనం బళ్ళో ఛందస్సు చదువుకోవడం ఈ గురు-లఘువులతోనే మొదలుపెడతాం కాబట్టి. గురు-లఘువుల క్రమంతో సంబంధం లేని ఛందస్సు మనం నేర్చుకోలేదు కాబట్టి!

సరే ఇప్పుడు ఛందస్సు చరిత్ర మీద కాస్త దృష్టి సారిద్దాం. దీని గురించి ఇప్పటికే నా ఛందస్సు - కథా కమామీషు టపాలో వ్రాసాను. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేస్తాను. ఛందస్సు పుట్టుక రెండు రకాలుగా జరిగింది. ఒకటి ఋషుల వేదాలలోను. మరొకటి జానపదుల పాటలలోనూ. ఈ రెండిటిలో ఏది ప్రాచీనం అన్న విషయం మనకి తెలియదు, అది ప్రస్తుతానికి అప్రస్తుతం కూడా. వేద ఛందస్సు మార్పులు చెంది సంస్కృత కావ్య ఛందస్సు అయ్యింది. ఆ సంస్కృత కావ్య ఛందస్సు నుంచి కన్నడం, తెలుగు వంటి దేశభాషల కావ్యాలలోని ఛందస్సు పుట్టుకొచ్చింది. ఈ పరిణామ క్రమంలో కావ్య ఛందస్సు జానపద ఛందస్సు నుంచి చాలా లక్షణాలని స్వీకరించింది.

ఛందస్సు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనే మాట - ఛందస్సు పద్యానికి చక్కని వినసొంపైన నడకని ఇస్తుంది, ఆ నడక మనసుని వెంటనే ఆకర్షిస్తుంది అని. ఇది నిజానికి నిజం కాదు, పూర్తిగా. ఈ మాట కేవలం జానపద ఛందస్సుకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకో కాసేపట్లో చూద్దాం. ముందుగా వేదాలలోని ఛందస్సుని తీసుకున్నట్లయితే, అవి ప్రధానంగా అక్షర బద్ధమైన ఛందస్సులు. అంటే, అందులో మాత్రలు కాని, గురు-లఘువుల క్రమం కాని, ఇవేవీ ముఖ్యం కాదు. ప్రతి పాదంలోనూ ఉండాల్సిన అక్షరాల సంఖ్యని మాత్రమే నిర్దేశిస్తాయవి. గురు-లఘువుల నియమం ఏ కొన్ని అక్షరాలకో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చూసిన అనుష్టుప్ ఛందస్సు తీసుకుంటే, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. చివరి అక్షరం గురువు అవ్వాలి అన్నది మాత్రమే దాని నియమం. మరి ఇలాంటి ఛందస్సులో చెవికి స్పష్టంగా తెలిసే "నడక" ఎలా సాధ్యమవుతుంది? అసలు వేదాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? చెవికి ఇంపు గూర్చే నడక ఇవ్వడమా? కాదు. జానపద గీతాల్లాగ, మానసిక ఆహ్లాదాన్ని గూర్చడం కాదు కదా వేద మంత్రాల పని. అంచేత అందులో ఛందస్సు ప్రయోజనం వేరే ఉంది. వేదాలు ముఖే ముఖే వ్యాప్తి చెందినవన్న విషయం మనకి తెలుసు. వేద శ్లోకాలు వల్లెవేసి, కంఠస్థం చెయ్యడం ద్వారా గురువులనుంచి శిష్యులు నేర్చుకొనేవారు. ఇలా శ్లోకాలను గుర్తు పెట్టుకోడానికి, వాటిని ఇతరులకి నేర్పడానికి, ఆ శ్లోకాలకి కొంత నిర్దిష్టత అవసరం. మామూలుగా మనం మాట్లాడే వాక్యాలకి ఆ నిర్దిష్టత ఉండదు. అంచేత ఒకరు చెప్పిన వాక్యాలు అక్షరం పొల్లుపోకుండా తిరిగి ఒప్పచెప్పాలంటే ఇంచుమించు అసాధ్యం. ఈ సమస్యని అధిగమించే ఒక సాధనమే వేదాలలో ఛందస్సు. ఒక శ్లోకంలో ఇన్ని అక్షరాలు మాత్రమే ఉండాలి, అందులో కొన్ని అక్షరాలు గురువు లేదా లఘువే ఉండాలి అన్న నియమాలు ఆ చెప్పే శ్లోకానికి ఒక నిర్దిష్టతని ఇస్తాయి. వల్లెవేసి గుర్తుపెట్టుకోడానికి కూడా కొంత సులువవుతుంది. వేదాలలోని ఛందస్సు ప్రయోజనం ఇదే. ఛందస్సుతో పాటు, ఇతర వేదాంగాలైన వ్యాకరణము, నిరుక్తము, శిక్ష ద్వారా శ్లోకాలకి మరింత నిర్దిష్టత చేకూరుతుంది.

వేదాలనుంచి కావ్యలకి వస్తే, ఆదికావ్యమైన రామ్యాయణం తప్పించి, తర్వాతి కాలంలో వచ్చిన కావ్యాలలో చాలా వృత్తాల ప్రయోగం కనిపిస్తుంది. అక్షర ఛందస్సు నుంచి ఏర్పడ్డవే వృత్తాలు. అక్షర ఛందస్సు పాదంలోని అక్షర సంఖ్యని మాత్రమే నియంత్రిస్తే, అందులోని అక్షరాల గురు-లఘు క్రమాన్ని నియంత్రించేవి వృత్తాలు. ఒకో అక్షర ఛందస్సుకీ ఎన్ని వృత్తాలు ఉండగలవు అన్నది ప్రాచీన ఛందశ్శాస్త్రకారులు గణించేరు. అంటే permutations అన్న మాట. దీన్ని ప్రస్తారం అంటారు. పాదంలోని గురు-లఘువుల క్రమాన్ని నిర్దేశించడమే వృత్త నిర్వచనం చేసేది. వృత్త నిర్వచనంలో ఇప్పుడు మనకి కనిపించే "యమాతారాజభానసలగం" గణాల ప్రసక్తి లేనే లేదు. ఈ గురు-లఘు క్రమాన్ని గుర్తుపెట్టుకోడానికి, రక రకాల పద్ధతులు అవలంబించేవారు. మూడు లేదా రెండు అక్షరాలని కలిపి ఒక గణంగా ఇలా గుర్తించడాన్ని కనిపెట్టింది పింగళుడని అంటారు. ఇవి అక్షర గణాలు (అంటే అక్షరాల సమూహంతో ఏర్పడ్డ గణాలు). పింగళుడి ముందు నాలుగు/రెండు అక్షరాలని ఒక గణంగా గుర్తించే పద్ధతి అమలులో ఉండేదట. ఆ గణాలకి వేరే పేర్లు ఉండేవి. అంచేత మనం నేర్చుకున్న అక్షరగణాలు కేవలం గురు-లఘు క్రమం గుర్తుపెట్టుకొనడానికి ఉపయోగపడే సాధనమే కాని, వృత్త నిర్వచనానికి వాటి అవసరం లేదు. ఒకవేళ పదాలు అక్షర గణాన్ని అనుసరించే విరగాలి అన్న నియమం ఉంటే, వాటికి నిర్వచనంలో ప్రాధాన్యం ఉండేది. కాని అలాంటి నియమమేమీ లేదు.

సరే, అది అలా ఉంచితే, కావ్యాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? శ్లోకాలను సులువుగా గుర్తుపెట్టుకొనేటట్టు వాటికి నిర్దిష్టమైన రూపం ఇవ్వడం అన్న ప్రయోజనం ఎప్పుడూ ఛందస్సు చేస్తుంది. వృత్తాలు మరింత నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తాయి. అయితే, కావ్యాలలో మనోరంజన ప్రధానం కాబట్టి, చెప్పే విషయానికి అనువుగా, చెవికి ఇంపుగా ఉండేటట్టు పద్యాలని వ్రాసే ప్రయత్నం పూర్వ కవులు చేసారు. అందుచేతనే బహుశా వేల వేల వృత్తాల లోంచి కేవలం కొన్ని వందల వృత్తాలని మాత్రమే కావ్యాలలో ప్రయోగించారు. అందులోనూ వేళ్ళ మీద లెక్కబెట్టగల వృత్తాలే ఎక్కువ ప్రచారం పొందాయి. కవులు ఒకో వృత్తాన్ని ఒకో ప్రత్యేక సందర్భంలో ఎక్కువగా ప్రయోగించినట్టు కూడా కొన్ని దాఖలాలు కనిపిస్తున్నాయి. క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో దీనిని వృత్తౌచిత్యమని పేర్కొని దీని గురించి కొంత వివరించాడు. చెప్పే విషయాన్ని విన సొంపుగా (ఒక ప్రస్ఫుటమైన నడకతో) చెప్పే ప్రయత్నంలోనే, జానపద ఛందస్సుల ప్రభావం కావ్య ఛందస్సులలో కనిపిస్తుంది. ఆ ప్రభావం గురించి తెలుసుకొనే ముందు, అసలు జానపద ఛందస్సు అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా!

జానపదులలో సంగీతం సాహిత్యం బాగా పెనవేసుకుపోయి ఉంటాయి. అంటే జానపదుల పాటల్లో ఒకే పాటని వేరువేరు వరసల్లో పాడటం అన్నది సాధారణంగా ఉండదు. ఎందుకిలా అవుతుంది? జానపదుల పాటలకి "దరువు"(beat) ప్రధానం. ఆ దరువుకి తగ్గట్టు పదాలు సహజంగా విరుగుతాయి. ఉదాహరణకి ఎండ్రకాయ పాటలో ఈ రెండు చరణాలు చూడండి:

వరీమడీ నాటబోతి ఓరి మగడా - నేను
గెనుం వార మునుం బడితి ఓరి మగడా
గెనుం వార మునుం బడితి ఓరి మగడా - నన్ను
ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా

ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా - నాకు
ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా - నాకు
ఉలవపిండి పట్టెయ్ రా ఓరి మగడా - నువ్వు
రాతిరంత మేలుకోర ఓరి మగడా

*(ఇది త్రివిక్రం గారి "అవీ ఇవీ" బ్లాగునుండి సంగ్రహించబడింది :-)

ఇది మనకి మనం చదువుకుంటే వెంటనే దాని నడక తెలిసిపోతోంది. దీన్ని ఎవ్వరు పాడినా అదే నడకతో పాడగలరు. ఎందుకు? "తందనాన తందనాన తందనాననా - తాన, తందనాన తందనాన తందనాననా" అనే నడకకి తగ్గట్టుగా రెండు మూడు అక్షరాల చిన్న చిన్న పదాలతో ఉంది కాబట్టి. ఇది జానపద ఛందస్సు. జానపద ఛందస్సుకి ముఖ్య లక్షణాలు ఇవి:

1. ఇందులో repetitive patterns చిన్నగా ఉండి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఉదాహరణకి పై పాటలో "తందనాన" అన్నది మళ్ళి మళ్ళీ వస్తోంది.
2. ఈ repetitive patternsలో గురు-లఘు క్రమం ముఖ్యం కాదు. మొత్తం మాత్రల సంఖ్య ముఖ్యం. ఉదాహరణకి పై పాటలో "వరీ మడీ", "ఎండ్రకాయ", "ఉలవ పిండి" - వీటిలో గురు-లఘు క్రమం తేడా ఉన్నా మొత్తం మాత్రల సంఖ్య ఒకటే. మాత్రల మీద ఆధారపడే ఈ repetitive patternsని "మాత్రా గణాలు" అంటాం.
3. మాత్రా గణానికి తగ్గట్టు సాధారణంగా పదాలు విరుగుతాయి. ఒక వేళ కాని సందర్భంలో కూడా పాడేటప్పుడు అలా విరిచి పాడతారు.
4. మాత్రా గణాలకి నప్పడానికి ఒకోసారి అక్షరాలని సాగదియ్యడం, కుదించడం చేస్తారు. ఉదాహరణకి పై పాటలో "వరిమడి" అన్నది అసలు పదం. కాని నడక సరిపోవడం కోసం పాడేటప్పుడు "వరీమడీ" అని పాడతారు.
5. జానపద గీతాలలో, ఒకే రకమైన మాత్రా గణాలు ఎన్ని పాదాలకి ఉండాలన్న నియమం స్పష్టంగా ఉండదు.

అన్ని జానపద గీతాలకీ పై అన్ని లక్షణాలూ ఉంటాయని చెప్పలేను కాని సాధారణంగా ఈ లక్షణాలని గమనించవచ్చు. ఈ జానపద ఛందస్సునే "మాత్రా ఛందస్సు" అని కూడా అంటారు.

జానపదగీతాల నుంచి లలిత గీతాలు, వాటినుంచి సినిమా గీతాలు వచ్చాయి కాబట్టి, సినిమా పాటల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సంగీతంలో శాస్త్రీయ తాళాలు (మేళకర్త తాళాలు) ఛందస్సులో వృత్తాలవంటివైతే, చాపు తాళాలు మాత్రా ఛందస్సు వంటివి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పోలికలని మరికొంత వివరంగా పరిశీలించండి.

ఇది జానపద/మాత్రా ఛందస్సు!

జానపద ఛందస్సుల ప్రభావం కావ్యలపై ఉందని అన్నాను కదా. ఆ ప్రభావం ఏమిటో ఈపాటికి చూచాయగా మీకు తెలిసే ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలలో 1, 3 లక్షణాలు కలిగిన వృత్తాలని కొన్నిటిని కవులు గుర్తించి, వాటిని తమ కావ్యాలలో అక్కడక్కడ ప్రయోగించారు. అలా వచ్చినవే మనం క్రితం టపాలో చూసిన "మత్తకోకిల", "లయగ్రాహి" వంటి వృత్తాలు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి - భుజంగ ప్రయాతం, పంచచామరం మొదలైనవి.
మత్తకోకిల ఛందస్సుని మళ్ళీ మీరు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే అలాంటి ఛందస్సులని వాటి నడకతో ("తాన తానన..." లాగ) గుర్తుపెట్టుకోవడం సులువు అవుతుంది.
మీరు జాగ్రత్తగా చూసి ఉంటే, కిందటి టపాలో నేనిచ్చిన మత్తకోకిల ఉదాహరణ నిజానికి మత్తకోకిల పద్యపాదం కాదు, యతి కుదరలేదు కాబట్టి. అది నేనెప్పుడో రాసుకున్న ఒక పాట పల్లవిలోనిది. ఆ పల్లవి ఇది:

నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో
గతము మరచెను వెఱ్ఱి హృదయము తేలిపోయెను హాయిలో

ఈ పల్లవిలో రెండో పాదం చూస్తే విషయం పూర్తిగా అర్థమవుతుంది! అది కచ్చితంగా మత్తకోకిల కాదు. కాని ఇది ఒక మాత్రా ఛందస్సు. దీని లక్షణం "3+4+3+4+3+4+3+2". ఇందులోని సంఖ్యలు మాత్రలని సూచిస్తాయి. మొదటి పాదం, రెండో పాదం కూడా ఇదే ఛందస్సులో ఉన్నాయి. అంటే "మత్తకోకిల" ఈ మాత్రా ఛందస్సుకి subset అన్న మాట!

ఈసారికి ఇక్కడతో ఆపుదాం. ఇప్పటికే ఎక్కువైపోయింది. మీ బుఱ్ఱలు వేడెక్కిపోయి ఉంటాయి :-) అందుకే ఈసారి ప్రశ్న సులువుగానే ఇస్తున్నాను. మాత్రా ఛందస్సుకి గ్రాఫు ఎలా గియ్యాలో ఆలోచించండి.


పూర్తిగా చదవండి...