తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, October 22, 2014

తెలుగు యతి - తిరుగు మతి!

"మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"

నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బ్లాగులో పోస్టు పెడదామనే దురాలోచన వచ్చింది. :-)  దీనికి స్ఫూర్తినిచ్చిన పంతుల గోపాలకృష్ణగారికి ముందుగా కృతజ్ఞతలు. వారు ఛందస్సు ఫేసుబుక్కు గ్రూపులో యతి గురించి పెట్టిన చర్చ దీనికి కారణం. కొన్ని కారణాలుగా FBని read-only మాత్రమే చేసాను కాబట్టి, దీని గురించి అక్కడ కాకుండా యిక్కడ నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను. దీనికి వారికి అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నాను. గోపాలకృష్ణగారు సంస్కృత తెలుగు యతుల మధ్య చెప్పిన భేదాలతో నాకు భేదాభిప్రాయమేదీ లేదు కాబట్టి, దాన్ని ఇక్కడ తిరిగి ఉట్టంకించడం లేదు. వారు లేవదీసిన ముఖ్యాంశం గురించి వారు చెప్పిన విషయాలు మాత్రం యథాతథంగా యిక్కడ పెడుతున్నాను, ఈ బ్లాగు చదివేవాళ్ళకు వీలుగా:

===
పాద ప్రథమాక్షరమే ఏ మార్పు లేకుండా తిరిగి యతి స్థానంలో ప్రయోగింపబడడమే తెలుగులో యతి చెల్లించడమంటే. ఇది ప్రాచీనమైన పద్ధతి. ఆ విధంగా సంస్కృతంలో యతి స్థానంలో విశ్రాంతి తీసుకుంటుండగా తెలుగులో అదే అక్షరాన్నితిరిగి ప్రయోగించడం ద్వారా ఒక కొత్త అందాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట. ఈ ప్రయోజనం అక్కడ పద విఛ్ఛేదనం జరిగి కొత్త పదం అదే అక్షరంతో తిరిగి ప్రారంభమయితేనే ఒనగూరుతుంది. అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. ఇంతటితో ఆగలేదు.పాదాద్యక్షరాన్నే తిరిగి యతిస్థానంలో అలాగే ప్రయోగించాలంటే కష్టమని భావించి ఆ అక్షరంతో మైత్రిగల ( అంటే ఉచ్చారణలో సారూప్యం గల) అక్షరాన్ని వేసుకున్నా సరిపోతుందని సరిపెట్టుకున్నారు. నిజానికి ఇది సరిపెట్టుకోవడమే గాని అదే అక్షరాన్ని యతిగా చెల్లించడం లోని అందాన్ని తీసుకు రాదు. అలాగే పదమధ్యంలో ఉన్న అక్షరంతో యతి చెల్లించడం వలన ఒక నియమాన్ని పాటించడం జరుగుతోందే తప్ప పద్యానికి ఏ విదమైన శోభనీ చేకూర్చడం లేదు. ఇది మన మహా కవులకు తెలియదని కాదు. కాని పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలల్లుతున్నప్పుడు యతి స్థానంలో పద విఛ్ఛేదనం జరగాలంటే కుదరదు. సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు. అందుకే పద మధ్యం లోని అక్షరంతో సరూపాక్షర యతి మొక్కుబడిగా చెల్లిస్తూ వచ్చారు. సరూపాక్షర యతి ఉండడం మంచిదే. కాని దాని ప్రయోజనం యతిస్థానంలో పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే ఒనగూరుతుంది . నియమాలూ కట్టబాట్లూ సంఘానికి మేలు చేసేవిగా ఉండాలి. అలానే ఛందో నియమాలు పద్యానికి అందం చేకూర్చేవిగా ఉండాలి. నిష్ప్రయోజనంగా ఉండ కూడదు. ఒక జాతి స్త్రీలు అందమైన మెడ కోసం జీవితంలో చాలా భాగం మెడ చుట్టూ బరువైన రింగులు దిగేసుకుని సంచరిస్తారు. పెరుగుతున్నకొద్దీ మరికొన్ని రింగులు చేరుస్తూ ఉంటారు. వారు సాధించుకునే అందమేమిటో గాని ఆ స్త్రీల జీవితాలకవి నిశ్చయంగా గుదిబండలే. తరతరాలుగా వచ్చినంత మాత్రాన అన్నీ మంచివే కాదు. వాటి ప్రయోజనాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చర్చలో మన మహాకవులు ఛందో నియమాల్ని అవలీలగా పాటించారనీ ఇప్పుడు అది చేతగాక యతి నియమం వద్దంటున్నాననీ ఏదేదో వ్రాసేరు. నేను యతి నియమం వద్దన లేదు. యతి ప్రయోజనం ఒనగూరాలంటే పద మధ్యంలో కాకుండా పదారంభంలో యతి చెల్లిస్తే అక్కడ పద విచ్ఛేదం జరిగి పద్యానికి ఒక కొత్త అందం వస్తుందన్నదే నా అబిప్రాయం. పెద్ద పెద్ద వృత్తాలలో పద మధ్యంలో మొక్కుబడి గా యతి చెల్లించిన పద్యాలూ, పద విఛ్చేదనంతో పాటు యతి చెల్లించిన వేమన పద్యాలూ కంద పద్యాలూ గమనిస్తే ఈ సంగతి స్పష్టంగా బోధ పడుతుంది. ఎంతటి మహా కవులకైనా ఈ నియమాలు ఎలా ఇబ్బంది పెడతాయో చూపిస్తాను చూడండి.
సిరి గల వానికి చెల్లును
తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
శ్రీనాధ మహా కవిది- ఎంత చక్కటి పద్యం. అయినా చూడండి-సిరిగల వానికి పదహారువేలమందిని
పెండ్లాడడం చెల్లుతుంది, చెల్లును- అంటే తగును అనే కదా అర్థం? మరి మళ్ళా తగ పెండ్లాడన్ ఏమిటి? ఇది యతి చెల్లించడానికి పడ్డ తిప్పలు. ఇలా బయటకు స్పష్టంగా కనిపించక పోయినా, పద్యాల్లో యతి చెల్లించడానికి ముందో వెనకో అక్కర్లేని పదాలో విశేషణాలో వేయడమో లేక పోతే చక్కగా భావయుక్తంగా ఉండే పదాల్ని వదులుకుని ఏదోఒక పదం వేసి సరిపెట్టుకోవడమో జరుగుతూనే ఉంటుంది. పద్యం హృద్యంగా ఉండాలంటే యతి చెల్లించడంతో పాటు అక్కడ పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే అందమన్నది నా అభిప్రాయం.అలాజరగనప్పుడు అది మొక్కుబడి
చెల్లింపే. లేదు దాని వన ఫలానా ప్రయోజనం ఒనగూరుతున్నాదని ఎవరైనా చూపిస్తే చాలా సంతోషం. చర్చ పదమధ్యంలో అక్షరంతో యతి చెల్లించడం- దాని ప్రయోజనం-గురించి మాత్రమే జరపాలని నా విన్నపం.
============

ఇది గోపాలకృష్ణగారు లేవదీసిన చర్చ. వారితో నేను ఏకీభవించే విషయాలను ముందుగా ప్రస్తావించి, ఆ తర్వాత విభేదించే అంశాలూ, వాటిపై నా ఆలోచనలూ పంచుకుంటాను. నేను ఏకీభవించే అంశాలు:

1. పదవిచ్ఛేదన జరిగే విశ్రాంత యతి పద్యానికి ఒక స్పష్టమైన లయని చేకూరుస్తుంది. తెలుగులో యతి (విరామాన్ని పాటించవలసిన అవసరం లేనందువల్ల) అలాంటి ప్రయోజనాన్ని యివ్వదు.
2. పద విరామంతో కూడిన అక్షరసామ్య యతి, ఆ అక్షరసామ్యాన్ని మరింత ప్రస్ఫుటం చేసి అక్షరసామ్యంలో గల శ్రావ్యతను చక్కగా ఆవిష్కరిస్తుంది. అలా లేనప్పుడు ఆ అక్షరసామ్యం అంతగా చెవులకి యింపు కలిగించదు.

యతికి యీ రెండు ప్రయోజనాలూ తప్ప మరేమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి అన్నది గోపాలకృష్ణగారి ప్రశ్న. దాన్ని గురించి వివరించే ముందు, ఆ ప్రశ్నలో భాగంగా వారు ప్రస్తావించిన మరికొన్ని అంశాలు, నాకు ఇబ్బందికరంగా తోచిన వాటిని ముందుగా చర్చిస్తాను.

"అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. "

ఇక్కడ పదవిచ్ఛేదన నియమానికి "మంగళం పాడడం" అనే విషయం గురించి వారు ఒక ఊహ చేసారు. అది వారి ఊహ మాత్రమే. కాని అది "ఊహ" అని ధ్వనించకుండా, కచ్చితమైన విషయంగా వారు ప్రస్తావించడం నాకు అభ్యంతరకరంగా అనిపించింది. పద విచ్ఛేదన యతికి మన పూర్వకవులు ఎందుకు "మంగళం పాడేరో" మనకిప్పుడు కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. దాని గురించి ఎవరు ఏమనినా అది కేవలం ఊహ మాత్రమే అవ్వగలదు. దీని గురించి నా ఊహలు ఇలా ఉన్నాయి. పదవిచ్ఛేదన పద్యపాదానికి ప్రస్ఫుటమైన లయని చేకూర్చడం ప్రధానంగా రెండు సందర్భాలలో మాత్రమే జరుగుతుంది - ఒకటి, పద్యపాదం మరీ పెద్దది కాకపోవడం. దీనికి మంచి ఉదాహరణ కందం రెండవ పాదం. "ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ!" కందం కదను తొక్కే గుఱ్ఱంలా పరిగుపెట్టడానికి దాని చతుర్మాత్రా గణాలూ, జగణంతో పాటు, యతిస్థానంలో విరామం చక్కని లయని చేకూరుస్తుంది. అలాగే తేటగీతి పాదం కూడా.
"ఇనకరంబులలో వెల్గు ఎందుకొరకు?
ఇందుకిరణంబులను చల్వ ఎందుకొరకు?
ఋక్షసంతతిలో మిన్కు లెందు కొరకు?
ప్రేమ కొరకు ప్రేమ కొరకు ప్రేమ కొరకు"

తేటగీతికి ఆటవెలది వంటి విలక్షణమైన లయ లేదు. కాని యతి స్థానంలో విరామం ఒక లయని కలిగిస్తుంది.
ఇక విరామయతి పద్యానికి చక్కని లయని చేకూర్చే మరొక సందర్భం - పద్య ఛందస్సులోనే ఒక విలక్షణమైన లయ ఉండడం. ఆటవెలది, మత్తకోకిలా, తరలం, భుజంగప్రయాతం - ఇలాంటి ఛందస్సులన్నీ వీటికి ఉదాహరణలు. మాత్రాఛందస్సులు కూడా లయప్రధానమైనవే కాబట్టి వాటిలో కూడా విరామయతి ఆ లయ చెడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అయితే ఇక్కడ గమనించ వలసిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఆయా పద్యాలలో యతిస్థానంలోనే కాక, వాటి సహజలయని అనుసరించి పదాలు విరిగితేనే వాటిలో ఆ లయసౌందర్యం కనిపిస్తుంది.

ఈ రెండూ కాని చోట్ల విరామయతికి ప్రయోజనం ఏమిటి? ఉదాహరణకు శిఖరిణి వంటి వృత్తంలో స్పష్టమైన లయ కనిపించదు. "స్పష్టమైన లయ" అంటే ఒకే పాదంలో ఒకే రకమైన గురులఘుక్రమం లేదా మాత్రల ఆవృత్తి. ఉదాహరణకి ఆటవెలదిలో మూడు మాత్రలు మూడుమార్లు వరసగా వస్తాయి. మత్తకోకిలలో మూడు, నాలుగు మాత్రల గణాలు తిరిగి తిరిగి వస్తాయి. ఇలాంటి ఆవృత్తి "స్పష్టమైన లయ"ని ఇస్తుంది. శిఖరిణి వంటి వృత్తాలలో అది లేదు. అలాగే మాలా విక్రీడిత వృత్తాలు కూడా. ఒకే మాత్రలు/గురులఘుక్రమం కలిగిన (కనీసం మూడక్షరాల)గణాలు రెంటికి మించి వరసగా వాటిల్లో రావు. కాబట్టి వాటికి పైన ఉదాహరించిన యితర వృత్తాలలో మాదిరి స్పష్టమైన లయ లేదు. కాబట్టి యీ పద్యాలలో పాదవిరామం ప్రత్యేకంగా ఒక చక్కని లయని సాధిస్తుందని అనడం సరికాదు.
పద్యానికి లయని చేకూర్చడంతో పాటు, విరామయతికి  ఉన్న మరొక ప్రయోజనం, పద్యానికి పఠనసౌలభాన్ని కల్పించడం. అంటే చదివే వాళ్ళకి కాస్త విరామం, విశ్రాంతి కలిగించడం.
"దాసీభూతసమస్తదేవ వనితాం!" అని ఒక పెద్ద సమాసం చదివేవారు, ఒక్కసారి ఊపిరిపీల్చుకొని "లోకైకదీపాంకురాం" అని చదివే వెసలుబాటు అక్కడ విరామయతి కలిగిస్తోంది. ఇది స్తోత్రాలు చదివే వారికి చాలా అవసరం.

బాగుంది. ఇప్పుడు మరి తెలుగు పద్యాలకి యీ మూడు ప్రయోజనాలూ అవసరం లేకుండా పోయాయా? పోయాయి అన్నదే నా ఊహ. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. తెలుగు కవులు, నన్నయ్యాగారితో మొదలుపెట్టి - చెప్పే విషయానికీ, పద్యపు నడకకూ ఒక సంబంధాన్ని కలిగించే ప్రయత్నం చేసారు - అన్ని చోట్లా కాకపోయినా, కొన్ని విశేష సందర్భాలలో. అంటే, పద్యపు నడకను, ఆ పద్యంలోని భావాన్ని ఉద్దీపింప జేసేందుకు ఉపయోగించడం అన్నమాట. మనకి ఎక్కువ చంపూ కావ్యాలు రావడం వెనకకూడా బహుశా ఇదే కారణం అని నేననుకుంటున్నాను. ఇది నాకు తెలిసి సంస్కృత కవిత్వంలో పెద్దగా కనిపించదు. రామాయణ మహాభారతాలు చాలావరకూ అనుష్టుప్ ఛందస్సులోనే సాగుతాయి. తర్వాత కావ్యాలు కూడా ఒకో సర్గా మొత్తం ఒకే వృత్తంలో సాగేవే ఎక్కువగా కనిపిస్తాయి. క్షేమేంద్రుడు వృత్తౌచిత్యాన్ని గురించి ఫలానా ఛందస్సు ఫాలానా భావాన్ని వ్యక్తపరచడానికి ఎక్కువగా ఉచితమని చెప్పాడు. అయితే అతను దానికి కారణం అందులో ఉండే గురు లఘు సంఖ్య ఆధారంగా చేసినదే కాని, పద్యపు నడకని నాకు తెలిసి ప్రస్తావించ లేదు. తెలుగు ఆలంకారికులు కూడా ఎక్కువగా సంస్కృతాలంకారశాస్త్రాన్నే అనుసరించారు కాబట్టి, వారు కూడా దీని గురించి విశ్లేషించినట్టు నాకు తెలియదు. దీని గురించి ఆధునికకాలంలో కొంతమంది కొన్ని విశ్లేషణలు చేసారు. వాటన్నిటినీ పూర్తిగా నేను ఒప్పుకోకపోయినా, పద్యపు నడకని (నడక అంటే ఒక ప్రత్యేకమైన "లయ" కాదు, పద్యం సాగే తీరు మాత్రమే) తెలుగు కవులు ప్రత్యేకంగా వాడుకొన్నారని నేను బలంగా నమ్ముతాను. దీని గురించి ఇంతకు ముందు కొన్నిచోట్ల (ఈ బ్లాగులోనూ, ఇతరత్రా వ్యాసాలలో) నేను ప్రస్తావించి కొన్ని ఉదాహరణలు ఇచ్చిన గుర్తు.
పై కారణాలవల్ల లయప్రాధాన్యం కాక, పద్యపు నడకలో స్వేచ్ఛకే పూర్వకవులు ఎక్కువ మొగ్గుచూపడం వల్ల, ఆ స్వేచ్ఛకి అడ్డంకి అయిన కారణంగా విరామయతిని పాటించ లేదన్నది నా ఊహ.

"సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు."
గోపాలకృష్ణగారు నన్ను క్షమించాలి, నేననుకున్నది చెపుతున్నాను. ఈ మాట నాకు కాస్త దురుసుగా అనిపించింది. ఇది పూర్వకవుల పట్ల నాకున్న వీరాభిమానం వల్ల కాదు. తార్కికంగా ఆలోచిస్తే, ఎంతశాతం అలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి కవులు ఎక్కువగా ఆపని చేసారు మొదలైన విషయాలని పరిశీలిస్తే, ఇలాంటి "generic statements" (సర్వకవులకూ ఆపాదించే మాటలు) అనడం కుదరదు. విరామయతిని కాదన్న నన్నయ్యగారి విషయంలో కాని, వారిని అనుసరించిన తిక్కనగారి విషయంలో కాని అసలు కుదరదు.

ఇక తెలుగులో ఉన్న అక్షరసామ్య యతికి అసలు ప్రయోజనం ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. అక్షరసామ్యం అనేది తెలుగు భాషకి ఒక సహజమైన అందాన్ని యిచ్చే అంశమని మన సామెతలూ, జానపదగేయాలు మొదలైనవి స్పష్టంగా రుజువు చేస్తాయి. బహుశా ఆ దృష్టితోనే పూర్వకవులు ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు అని ఊహించడంలో నాకు అభ్యంతరం లేదు. అది పద్యాలలో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా సాధించలేదు అన్న విషయమూ స్పష్టమే (పైన నేను ఏకీభవించిన రెండో అంశం ఇది). మరి దీనికి వేరే ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని అడిగితే, ఉందని నా స్వానుభవం. ఇది ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అయినా మళ్ళి చెపుతున్నాను. ఈ ప్రయోజనం ఏమిటో మీరు సొంతంగా తెలుసుకోవాలంటే, మన కావ్యాలలోనుండి ఒక వంద పద్యాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక యాభై సంస్కృత శ్లోకాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. ఏది సులువో మీకు మీరు తెలుసుకోండి. నా విషయంలో తెలుగు పద్యాల కంఠస్థం సులువయింది. దీనికి తెలుగు భాషలో పద్యాలు సులువుగా అర్థమవడం, ఆ పదాలు ఎక్కువగా తెలియడం ఒక కారణం. అయితే నేను గమనించిన మరొక ముఖ్యకారణం అక్షరసామ్య యతి. అలాగే ప్రాస కూడానూ. ఒక పద్యంలో పదాలు గుర్తు పెట్టుకొనేటప్పుడు యతిస్థానంలో ఉండే అక్షరం మొదటి అక్షరంతో సామ్యం కలిగి ఉండడం వల్ల, అక్కడ వచ్చే పదమేమిటో సులువుగా గుర్తుంటుంది. ఇది నాకు చాలాసార్లు అనుభవంలోకి వచ్చిన సంగతి. ఇది కొంత తర్కసహంగానే అనిపించింది కాబట్టి, ఇతరుల విషయంలో కూడా యిది వర్తిస్తుందని నేను అనుకొంటున్నాను.
ఇంకొక విషయం - కొన్ని సందర్భాలలో పూర్వకవులు, చెప్పే విషయానికి ఒక ఉద్దీపన కలిగించడానికి కూడా యతిస్థానాన్ని వాడుకొన్నారని పండిత విమర్శకులు కొందరు విశ్లేషించారు. దీనిని కూడా నేను ఇంతకుముందు కొన్ని వ్యాసాలలో ఉదాహరించడం జరిగింది. ఇలాంటి విశ్లేషణతో అందరూ ఒప్పుకోవాలని లేదు కాని, యిది కూడా యతి ప్రయోజన విషయమై తప్పక ఆలోచించాల్సిన అంశమే.

చివరిగా, ఈ అక్షరసామ్య యతి పద్యరచనకు ఒక ప్రతిబంధకం, "గుదిబండ" అని గోపాలకృష్ణగారు అభిప్రాయపడ్డారు. అది వారి వ్యక్తిగత అనుభవం అంటే ఇబ్బంది లేదు. చాలామందికి అది గుదిబండ అయ్యే అవకాశం ఉంది అన్నా ఒప్పుకోవచ్చు. కాని పూర్వకవుల పద్యరచనకి యిది యించుమించు అంతటా గుదిబండగా మారింది అనే ధ్వని వారి మాటల్లో ఉంది. ఇది కచ్చితంగా తేల్చగలిగే అంశం కాదు. ఒక పద్యంలో యతిస్థానం వచ్చే పదానికి ప్రయోజనం ఉందా, కేవలం యతి కోసమే వేసారా అనే చర్చ ఎటూ తేలని చర్చ. ఒకోరికి ఒకో పదం వ్యర్థంగా తోచవచ్చు. మరొకరికి అందులో మహార్థమేదో గోచరించ వచ్చు, అది మొదటి వారికి రుచించక పోవచ్చు! పైగా మొత్తం కావ్యంలో, కావ్యసర్వస్వంలో అలాంటి వ్యర్థపదాలు యతిస్థానంలో ఉన్న పద్యాలశాతం ఎంత అనే లెక్క తెలియకుండా అది పద్యరచనలో మనకవులకు "గుదిబండ" అయింది అనే సర్వసామాన్య సిద్ధాంతాలు చేయడం సాధ్యం కాదు. ఈ యతి ఎలా ఇబ్బంది పెడుతుందో చూపిస్తాను చూడండి అని గోపాలకృష్ణగారు ఒక ఉదాహరణ ఇచ్చారు. దాని గూర్చి ముచ్చటించడం అసందర్భం కాదనుకుంటాను. వారిచ్చిన ఉదాహరణలో "తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్" అనే పాదంలో "తగ" అనేది వ్యర్థ పదం. సరే అది వ్యర్థపదమా కాదా అనే చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పైన చెప్పినట్టుగా అది తేగే చర్చకాదు. మరొక ముఖ్యమైన అంశాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ పద్యం ఒక చాటువు. చాటుపద్యాలలో ప్రతి పదం సార్థకంగా వాడడం అనేది మనకి చాలా అరుదుగా మాత్రమే కనిపించే అంశం. మంచి నడకతో, ఝటితిస్ఫూర్తి కలిగించే భావంతో ఉండడమే చాటుపద్యాల ముఖ్య లక్షణం. కాబట్టి వాటిలో వ్యర్థపదాలు కేవలం యతి వల్లనే ఉంటాయని భావించడం పొరపాటు. చాటుకవిత్వపు సహజమైన లక్షణాలలోనే వ్యర్థపదాలు భాగాలు. నిజానికి అక్కడ వాటిని "వ్యర్థ" పదాలని అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ "వ్యర్థం" అనే తూనికని మార్గకవిత్వపు లక్షణాన్ని బట్టి నిర్వచిస్తున్నాం కాబట్టి. దాన్ని మరొక రకమైన కవిత్వానికి వర్తింప చెయ్యడం సరికాదు కదా!

అయ్యలారా, అమ్మలారా! ఇవీ యతి గురించి నా మతికి తోచిన కొన్ని ఆలోచనలు. మీమీ సులోచనాలను బట్టి వీటిని ఆమోదిస్తారో తిరస్కరిస్తారో (ఏదో ఒకటి చెయ్యాలని రూలేమీ లేదు!) మీ యిష్టం. 


మళ్ళీ ఎప్ప్పుడైనా ఎందుకైనా మరోసారి కలుసుకొనేదాకా స్వస్తి! అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...

Tuesday, July 2, 2013

ఓ పలకరింపు టపా

ఈ బ్లాగు ద్వారా చాలామంది పాఠకలు మిత్రులయ్యారు. అందరూ ఇప్పటికీ మిత్రులే, పాఠకులవునో కాదో మాత్రం తెలియదు. :-) ఇంకా పాఠకులే అయిన మిత్రుల కోసం, మిత్రులు కాని పాఠకుల కోసం కూడా, బ్లాగు మూసెయ్య లేదన్న సూచనగా, ఒక చిన్న పలకరింపు టపా యిది, అంతే. పనిలో పనిగా కొంత సొంత ప్రోపగాండా కూడా చేసుకుందామని.

సుజనరంజని పత్రికలో "పద్యాలలో నవరసాలు" అనే శీర్షికతో ఒక వ్యాసపరంపర వ్రాస్తున్నాను, ఆరు నెలలుగా. అందులో యీ నెల బీభత్స రసాన్ని గురించిన వ్యాసం ఇక్కడ చదవుకోవచ్చు:

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/padyam-hrudyam.html

ఈమాట పత్రికలో వస్తూ ఉన్న "నాకు నచ్చిన పద్యం" శీర్షికని యీ నెలనుంచీ నేను కొనసాగిస్తున్నాను. ఈ నెల వ్యాసం ఇక్కడ:

http://www.eemaata.com/em/issues/201307/2116.html

(నేను బ్లాగుకి దూరమవ్వడానికి అసలు కారణం ఇప్పుడర్థమయ్యిందా! అంచేత దీనికి బాధ్యులు ఆయా పత్రికల సంపాదకులే తప్ప నేను కాదు. :))

ఎంత పలకరింపు టపా అయినా, ఒక్క పద్యంకూడా లేకపోతే ఎలా? అందుకోండి ఒక పద్యం. ఈ పద్యం వ్రాసిన కవి ఎవరో కనుక్కోండి చూద్దాం!

నెట్టిన ప్రతి గుమ్మంలో
మెట్టిన ప్రతి గడపలోన మేమేం చూశాం?
పుట్టల చెదపట్టిన తు
ప్పట్టిన భావాల బీరువాలు, అనేకం!

తెలియలేదా? పోనీ మరొక్క పద్యం కూడా ఆ కవిదే చూడండి:

నేటి తెలుగుసాహిత్య వాణిజ్యవీథి
కేవల నిరక్షరాస్యులు కృతకవేత్త
లెంత పెత్తనమ్మును చలాయింపగలరొ
నాడెపుడయిన తలపోసినామ మనము?

ఎప్పుడైనా వీలూ, 'విల్లూ' కుదిరినప్పుడు, యీ కవి గురించి కొంచెం వివరంగా టపాయిస్తాను.
పూర్తిగా చదవండి...

Thursday, April 11, 2013

వసంతవిజయం


పదిరోజుల కిందట హఠాత్తుగా మా యింటి మందారం, నిండా మొగ్గలతో నిండుగా కనిపించింది. అబ్బా! వసంతం వచ్చేసింది అనుకున్నా. ఆరునెలలయి ఒక్క పువ్వు కూడా పూయనిది రోజూ పూలతో కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో! అదే కదా మరి పూల ఋతువు మహిమంటే!
"పేరంటమున కేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత" వసంతం వచ్చిందని తెలిసిందంటారు విశ్వనాథ, తన తెలుగు ఋతువులలో. వసంతమంటే కవులకి ఒక ప్రత్యేక అభిమానం. ఎక్కడెక్కడి కవికోకిలల గొంతుకలూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి.

పూర్వకవులకి వసంతమంటే, మన్మథుడు పూలబాణాలతో చిగురాకుబాకుతో చిలుకతేజీనెక్కి జైత్రయాత్ర చేసే కాలం. వసంతవిజయమంటే మన్మథవిజయమే!

అత్తఱి చిత్తజాత విజయాంబుజమందిర కాటపట్టు నా,
గొత్త మెఱుంగు గ్రొన్ననల గుంపుల చక్కలిగింతనా, శుభా
యత్తత నొప్పె బుష్పసమయంబు సమంచిత చంచరీక లో
కోత్తరవిత్తమై, వనసముజ్జ్వల పైకవధూ సదుక్తమై

మన్మథుని విజయలక్ష్మికి (అంబుజమందిర అంటే పద్మనిలయ లక్ష్మి) ఆటపట్టులాగా ఉందట పుష్పసమయం. అప్పుడే విరిసి మెరిసే పూలగుంపుల చక్కిలిగింతలాగా కూడా ఉన్నదట. తుమ్మెదలు కూడబెట్టిన లోకోత్తరమైన విత్తం (అంటే తేనెపట్టు) వసంతం. "పైకవధూ" అన్న పదం దగ్గర కొంతసేపు ఆగిపోయాను. పైకము అచ్చ తెలుగుపదం. అయితేగియితే పైకపువధూ అని ఉండాలి కాని సమాసంలో "పైకవధూ" ఏమిటి? - అని పెద్ద అనుమానం వచ్చేసింది. కాస్త ఆలోచించిన మీదట తట్టింది. "పైకము" అంటే పిక సంబంధమైనది అనే అర్థం వస్తుంది. పికమంటే తెలుసు కదా, కోకిల. పైకవధూ అంటే ఆడకోయిల. ఆడకోయిలలల చక్కని గాత్రాలు ప్రతిధ్వనించే అడవులతో వెలిగిపోతోంది వసంతం - అని తాత్పర్యం. పద్ధెనిమిదవ శతాబ్దానికి చెందిన తక్కెళ్ళపాటి లింగన అనే కవి రచించిన సూర్యతనయాపరిణయం అనే కావ్యంలోని పద్యమిది. ఎప్పుడూ పేరైనా వినని కావ్యంలోంచి నాకీ పద్యం ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఇలా ఎన్నో తెలియని (తెలిసినవి కూడా) కావ్యాలనుండి రకరకాల అంశాలకి సంబంధించిన వర్ణనలను ఏర్చికూర్చి దాసరి లక్ష్మణస్వామిగారనే అతను "వర్ణనరత్నాకరము" అనే పుస్తకాన్ని నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఆ పుస్తకంలోనే చదివానీ పద్యాన్ని. Digital Libraryలో నాలుగుభాగాలూ రెండు పుస్తకాలుగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కణ్ణుంచి దింపుకోవచ్చు. ఇటీవల యీ పుస్తకానికి "పాఠకమిత్రవ్యాఖ్య" అనే బేతవోలు రామబ్రహ్మంగారి చిరు వ్యాఖ్యానంతో మూడు భాగాలు ప్రచురించారని విన్నాను. ఇంకా అది నా కంటపడ లేదు.

అన్నట్టు మన్మథుడంటే గుర్తుకు వచ్చింది, సుజనరంజని పత్రికలో నేను నెలనెలా "పద్యాలలో నవరసాలు" అనే పేరుతో వ్యాసాలు (పద్యం-హృద్యం అనే శీర్షిక క్రింద) వ్రాస్తున్నాను. ప్రస్తుతం శృంగారరసం నడుస్తోంది. ఆసక్తిగల వాళ్ళు యిక్కడ చూడవచ్చు: http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr13/padyamhrudyam.html

ఇంతకీ, పూర్వకవుల తీరు అలా ఉంటే, నవకవులది ఎంతైనా మరి కొత్త దారి. వీరికి వసంతం అంటే కొత్తదనానికి ప్రతీక. లేత చివుళ్ళతో, విరిసే పూలతో నవకాంతులీనే ప్రకృతి క్రొంగొత్త ఆశలకి స్వాగతం పలుకుతుంది. సరిగ్గా అప్పుడే, కొత్త సంవత్సరం కూడా మన ముంగిట అడుగుపెడుతుంది.

క్రొత్తదనాలు పూవులయి గుత్తులుగట్టి యుగాది పందిటన్
మత్తిలి నృత్తమాడినవి, మామిడికొమ్మలు కొత్తగా చివు
ళ్ళెత్తి సుమించి కాచి ఫలియించెను, తీయని క్రొత్త కోరికల్
మెత్తని మన్మనః పథముమీది పదమ్ముల నూని సాగినన్

అని దాశరథివంటి నవకవి పులకించి పాడతాడు. దాశరథికి పూవులన్నిటిలోనూ మోదుగపూలంటే యిష్టం. "పల్లెపడుచు కచమ్ముల నుల్లసిల్లు మోదుగను మించినట్టి పువ్వేది జగతి!" అంటారాయన. అంతే కాదు,

కోట్ల చిలుక ముక్కు లిట్లేకమైనట్లు
కింశుకమ్ము లందగించె నేడు
పేదవాని మదిని పెకలివచ్చిన ఆశ
అరుణతరుణ మగుచు విరిసె ననగ

అని కూడా అంటారు. కోట్ల చిలుకల ముక్కులు ఒక్కదగ్గర చేరినట్లు ఉన్నాయట ఆ కింశుకాలు. అక్కడితో ఆగిపోతే అది దాశరథి కవిత్వం అవ్వదు. విరగపూచిన ఆ మోదుగపూలు, పేదవాని మదిలోని ఆశ పైకి పెకలివచ్చిన తొలిసంధ్య వెలుగులా ఉన్నాయనడం ఆయనకే చెల్లింది! పేదతనమనే చీకటి పూర్తిగా తొలగిపోయే కొత్త ఉషస్సునీ ఉగాదినీ ఆకాంక్షిస్తాడు అభ్యుదయ కవి. అతని దృష్టిలో వసంతవిజయమంటే అదీ.

ఏ పేరుతో వచ్చినా క్రొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించాలని దాశరథి నిష్కర్షగా అంటారు. "విజయ" అనే మంచి పేరుతో వచ్చిన యీ కొత్త సంవత్సరం కొత్త మంచిని తెస్తుందని ఆశిస్తూ దాన్ని స్వాగతిద్దాం. మంచిచెడుల సరిహద్దులు చెరిగిపోయిన యీ కాలంలో ఎవరు ఎవరిని జయించాలని కోరుకుంటాం? ఈ కాలంలో మనకు బాగా తెలిసిన Win-Win situation అనే పదబంధ స్ఫూర్తితో, అందరికీ విజయం చేకూరాలనీ, ఎవరికివారు తమలోని చెడుపైన విజయం సాధించాలనీ కోరుకుందాం, ప్రయత్నిద్దాం.

అందరికీ "విజయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! విజయీభవ!

పూర్తిగా చదవండి...

Friday, February 15, 2013

నన్నయ్యగారి గడుసుదనం


మన పూర్వకవుల రూపురేఖలు కానీ, వారి స్వరూపస్వభావాలు కానీ మనకి తెలియదు. వారివారి కవిత్వ లక్షణాల బట్టి కొంతా, వారి గురించి లభిస్తున్న ఇతరత్రా సమాచారం ద్వారా కొంతా, అనూచానంగా వచ్చే కథల ద్వారా మరికొంతా, కొందరికి కొన్ని ఊహాచిత్రాలను మనం కల్పించుకున్నాం. నన్నయ్యగారు అనేసరికల్లా ఒక శాంతగంభీర స్వరూపం మన మనసులో మెదులుతుంది. తిక్కన  అనేసరికి, ఒక నిండైన విగ్రహం, ఒకింత తీక్ష్ణమైన చూపు, నిటారుగా నిలబడి కనిపిస్తారు. శ్రీనాథుడైతే నిగనిగలాడే పచ్చని మేనితో విబూధిరేఖలతో తాంబూలంతో ఎఱ్ఱబడ్డ నోటితో చిలిపి నవ్వు నవ్వుతూ కనిపిస్తాడు (ఎంటీవోడి పంఖాలకైతే అతనే కనిస్తాడనుకోండి :-)). పోతనగారంటే మాత్రం నాగయ్యగారే, మరో మాట లేదు. అదే పెద్దనగారైతే పండుమీసంతో, చిరుబొజ్జతో, కప్పురవిడెము సేవిస్తూ, ఊయల ఊగుతూ కనిపిస్తారు. ఇక తెనాలి రామకృష్ణుడైతే సరేసరి! 

అయితే, వారివారి స్వరూపాలకు విరుద్ధమైన లక్షణాలు వారి కవిత్వంలో కనిపించినప్పుడు మనకి ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకి, నన్నయ్యగారు ఒక గడుసైన పద్యాన్ని, కొన్ని పాత్రల దుస్థితిని గడుసుగా వెక్కిరిస్తూ, వ్రాసారంటే ఆశ్చర్యం వెయ్యదూ! నాకైతే వేసింది. ఆ పద్యమేమిటో చూద్దామా? ఆ పద్యంలోకి వెళ్ళే ముందు శబ్దశక్తిని గురించి - అభిధ, లక్షణ, వ్యంజన - అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇద్దామనుకున్నాను కానీ అవన్నీ చెప్పి యిప్పుడు సుత్తికొట్టడం దేనికని నేరుగా పద్యంలోకే వెళుతున్నాను. అది కుమారాస్త్ర ప్రదర్శనా ఘట్టం. అంటే కురుపాండవ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ తమ విద్యలనీ, శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్నీ ప్రదర్శించే సన్నివేశం.

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క
నెంతయును సంతసంబున గుంతిదేవి
రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి
కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! 

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. అందమైన కళ్ళని పద్మాలతో పోల్చడం మామూలుగా ప్రాచీన కవిత్వం అంతటా కనిపించేదే. ఇక్కడ మామూలు పద్మాలు కాదు, బాగా విచ్చుకున్న పద్మాలు. అంటే కుంతి కళ్ళు అంతగా విచ్చుకొని ఉన్నాయన్న మాట! పద్యం మొదట్లో చెప్పనే చెప్పాడు కాదా - ఆమె వేడ్కతోనూ సంతోషంతోనూ తన కుమారుల విద్యని చూడాలని కూర్చుంది. ఆ ఉత్సాహమూ ఆ సంతోషమూ, బాగా విచ్చుకున్న ఆమె కన్నుల్లో కనిపిస్తున్నాయన్న ధ్వని యీ విశేషణంలో ఉంది. ఇలా సార్థకమైన విశేషణాల ద్వారా ఒక విషయాన్ని ధ్వనింపజేయడం మంచి కవిత్వ లక్షణం.
బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం!


పూర్తిగా చదవండి...

Thursday, January 24, 2013

సాపుటేరుపై సరదా పద్యం


చిన్నప్పుడు మన బళ్ళో తెలుగు తరగతిలో ప్రకృతి-వికృతులని చదువుకున్నాం గుర్తుందా?

ఆశ్చర్యము - అచ్చెరువు
భాష - బాస
పుస్తకము - పొత్తము

యిలా... ఇవన్నీ సంస్కృతంనుండి ప్రాకృతానికీ అక్కడినుంచి తెలుగుకీ వచ్చిన పదాలు కొన్ని, నేరుగా సంస్కృతం నుంచి వచ్చినవి కొన్నీను. వీటిలో మూల పదాల స్వరూపం మన భాషాస్వరూపానికి తగ్గట్టుగా మారడం గమనించవచ్చు. ఇవన్నీ ఎవరో తీరికూర్చుని తయారుచేసినవి కావు. ప్రజల నోళ్ళల్లో నలుగుతూ ఏర్పడిన మాటలు. ఇలా వేరే భాషనుంచి రూపాంతరం చెంది తెలుగులోకి రావడం, ఒక్క సంస్కృత ప్రాకృతాలకే పరిమితం కాదు. ఆధునిక కాలంలో హిందీలాంటి యితర భాషల నుండి కూడా ఎన్నో పదాలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లీషునుండి కూడా వచ్చిన పదాలు మనకెన్నో వాడుకలో ఉన్నవే. Car - కారు, Bus - బస్సు, Hospital - ఆసుపత్రి, యిలా. అయితే మన వ్యాకరణ పండితులు సంస్కృత ప్రాకృతాలనుండి వచ్చిన వాటిని తత్సమ, తద్భవాలనీ మిగిలిన భాషలనుండి వచ్చినవాటిని అన్యదేశ్యాలనీ వర్గీకరించారు. ఈ వర్గీకరణ వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు కాని ఒక రకంగా చూస్తే అది కృత్రిమమైన వర్గీకరణే.

ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వాటిని, యిలా మన భాషారూపంలోకి దిగుమతి చేసుకోడం తప్పుకాదని నా అభిప్రాయం. ఆ దృష్టితో software రంగానికి సంబంధించిన కొన్ని పదాలని వాడుక భాషలోకి ఎలా అనువదించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటే మనసులో కొన్ని పదాలు మెదిలి, ఆ పదాలతో ఒక పద్యం అల్లుకుంది. ఇలాంటి అనువాదం కొంతమందికి రుచించకపోవచ్చు. ఇది ఇంగ్లీషు భాషని భ్రష్టుపట్టించడంగా కొంతమంది భావించవచ్చు. ఇంగ్లీషుతో సంకరం చేసి తెలుగుని భ్రష్టుపట్టించడం అని మరికొందరు అనుకోవచ్చు. ఇందులో తప్పుపట్టేందుకేమీ లేదు. అది వారివారి అభిరుచి, అంతే. అలాంటి వారు దీన్ని కేవలం ఒక సరదా పద్యంగా తీసుకొని మరిచిపోవలసిందిగా మనవి. కానివారు ఈ తరహా అనువాదాన్ని గురించి ఆలోచించవచ్చు. స్ఫూర్తికూడా పొందవచ్చు. అయితే ఇలాంటి పదాలు సృష్టించినప్పుడు, అవి తెలుగుభాషా స్వరూపానికి తగినట్టుగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి.

కాపీపేసుటు చేసిచేసి పలు ప్రోగ్రాముల్ లిఖించున్ మరిన్
మాపున్‌దోపును బగ్గులెన్నొ తుదకుం బ్రాప్తించు స్థానోన్నతుల్
ఆపై దొంతరదొంతరల్ వరడుపత్రాళుల్ మరింకెన్నొ సొం
పౌ పీపీటులు గళ్ళపొత్తములు తయ్యార్ చేయుచున్ గాలమున్
దీపిన్ బుచ్చును సాపుటేరు బ్రతుకింతేకాదటోయ్ చూడగన్!

దీనికి టీకా టిప్పణి:

కాపీ - Copy, పేసుటు - Paste, ప్రోగ్రాము - Program, మాపున్ - fix, దోపున్ - insert, బగ్గు - bug, వరడుపత్రం - Word Document, పీపీటి - PPT(PowerPoint) (బహువచనం పీపీటులు), గళ్ళపొత్తం/గళ్ళపుస్తకం - Excel Workbook, సాపుటేరు - Software.

ఇంతకన్నా దీని అర్థం వివరించాల్సిన అవసరం లేదనుకుంటా! ఏ పనీ యిచ్చిన గడువులోపల పూర్తి చేసే అలవాటు బొత్తిగా సాపుటేరు వాళ్ళకి లేదనే విషయం, పద్యం నాలుగు పాదాల్లో పూర్తికాక అయిదవ పాదానికి సాగడం ద్వారా ధ్వనింపజేసానని పద్యాన్ని "లోనారసి"న సారమతులు గ్రహించిగలరు. :)



పూర్తిగా చదవండి...